Union Budget 2025: 11 గంటలకు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారామన్- రాయితీలు, మినహాయింపులపై కోటి ఆశలు
Indian Budget 2025: నిర్మలా సీతారామన్ నేడు కేంద్ర బడ్జెట్ లోక్సభలో ప్రవేశపెట్టనున్నారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం 3.0లో ఇది తొలి పూర్తిస్థాయి బడ్జెట్ కావడంతో పలు వర్గాల్లో ఎన్నో అంచనాలు నెలకొన్నాయి.

FM Sitharaman Budget 2025: న్యూఢిల్లీ: సామాన్యుడి నుంచి సంపన్నుడి వరకు ఎంతో ఆసక్తిగా, ఆశగా ఎదురుచూస్తున్న కేంద్ర బడ్జెట్ నేడు సభలోకి రానుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ (Union Budget 2025-26)ను ఉదయం 11 గంటలకు లోక్సభలో ప్రవేశపెట్టనున్నారు. 2019లో తొలిసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్ శనివారం నాడు కేంద్ర ఆర్థిక మంత్రిగా ఆమె 8వ బడ్జెట్ సమర్పిస్తున్నారు. కేంద్రంలో వరుసగా మూడోసారి నరేంద్ర మోదీ ప్రభుత్వం వచ్చాక ప్రవేశపెడుతున్న తొలి పూర్తిస్థాయి బడ్జెట్ కావడంతో ఎన్నో అంచనాలు నెలకొన్నాయి.
బడ్జెట్లలో మొరార్జీ దేశాయ్ రికార్డు
దేశంలో అత్యధిక పర్యాయాలు బడ్జెట్ ప్రవేశపెట్టిన రికార్డు మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ పేరిట ఉంది. ఆయన రికార్డు స్థాయిలో 10 కేంద్ర బడ్జెట్లు ప్రవేశపెట్టగా, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం 9 బడ్జెట్లతో రెండో స్థానంలో ఉన్నారు. నేటి బడ్జెట్ కలిపితే ప్రణబ్ ముఖర్జీ రికార్డును నిర్మలా సీతారామన్ సమం చేయనున్నారు. ప్రణబ్ ముఖర్జీ 8 కేంద్ర బడ్జెట్లు సమర్పించారు. అత్యధిక బడ్జెట్స్ ప్రవేశపెట్టిన మహిళా మంత్రిగా నిర్మలా సీతారామన్ నిలిచారు.
మోదీ మాటలతో ఆశలపల్లకిలో సామాన్యుడు
సామాన్యులకు, దిగువ మధ్యతరగతికి లక్ష్మీ కటాక్షం ఉండేలా కేంద్ర బడ్జెట్ ఉంటుందని ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం చెప్పిన విషయం ఆశలు రేకెత్తిస్తోంది. ట్యాక్స్ స్లాబ్లలో ఏమైనా రిలాక్సేషన్ కల్పిస్తారా, ఆదాయ పన్ను పరిమితి పెంచి తమకు ఊరట కలిగిస్తారని అటు ఉద్యోగులు సైతం నేడు నిర్మలమ్మ ప్రవేశపెట్టబోయే కేంద్ర బడ్జెట్ పై కోటి ఆశలు పెట్టుకున్నారు. అటు వ్యాపార వర్గాలు సైతం తమకు రాయితీలు కల్పిస్తారా, లేక పెట్టుబడులపై పన్ను ప్రయోజనాలు చేకూర్చుతారా అని ఆశగా ఎదురు చూస్తున్నారు. హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ లపై జీఎస్టీని ఎత్తివేయాలన్న డిమాండ్ నెలకొంది. దాంతో వీటిపై జీఎస్టీ తగ్గిస్తారా అనే ఆసక్తి నెలకొంది.
2023-24 వృద్ధి రేటు 8.2 శాతం కాగా, ఈ ఏడాది వృద్ధి 6.4 శాతానికి పడిపోయే అవకాశం ఉందని కేంద్రం ముందుగానే పేర్కొంది. ఇది నాలుగేళ్ల కనిష్టం. కాగా, కరోనా అనంతరం భారత జీడీపీ వృద్ధి రేటు ఇంతలా పడిపోవడం ఇదే మొదటిసారి. కాగా, 2025–26లో స్థూల దేశీయోత్పత్తి (GDP) వృద్ధిరేటు 6.3-6.8 శాతానికి పరిమితం కావచ్చని సర్వే తెలిపింది.
2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా అవతరించాలంటే వచ్చే 15, 20 ఏళ్ల పాటు జీడీపీ ఏటా 8 శాతం చొప్పున వృద్ధి చెందాల్సి ఉంది. జీడీపీలో పెట్టుబడుల శాతాన్ని 31 నుంచి 35 శాతానికి పెంచాలని సైతం ఆర్థిక సర్వే స్పష్టం చేసింది. తయారీ రంగాన్ని మరింత బలోపేతం చేయడంతో భారీ పెట్టుబడులను ఆకర్షించాలని సర్వే సూచించింది. పారిశ్రామిక రంగాలతో పాటు ఫ్యూచర్ అయిన రోబోటిక్స్, బయో టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వంటి సరికొత్త టెక్నాలజీల్లో భారీ పెట్టుబడులు అవసరమని సూచించింది. భారత్ 2027-28లో 5 ట్రిలియన్ డాలర్లు, 2029-30 ఆర్థిక సంవత్సరంలో 6.3 ట్రిలియన్ డాలర్లకు చేరే ఛాన్స్ ఉందని ఐఎంఎఫ్ అంచనా వేసింది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

