E20 Petrol: షెల్, జియో BP పెట్రోల్లో ఎథనాల్ తక్కువేనా? ల్యాబ్ రిపోర్ట్ చెప్పే ఆసక్తికర విషయాలు
షెల్, జియో BP పెట్రోల్ను ముంబై ల్యాబ్లో టెస్ట్ చేయగా, రెండింటిలోనూ ఎథనాల్ స్థాయులు లేబుల్లో ఉన్నదాని కంటే తక్కువగా ఉన్నట్లు తేలింది. ఆక్టేన్ రేటింగ్స్ మాత్రం 97 నుంచి 98.5 RON వరకు ఉన్నాయి.

E20 Fuel: మన దేశంలో, అందరు వాహనదారుల దృష్టి E20 పెట్రోల్ నిబంధనల పైనే ఉంది. ఈ నేపథ్యంలో, ప్రభుత్వ రంగ ఇంధన కంపెనీల తర్వాత, ప్రైవేట్ కంపెనీలైన Shell & Jio BP అమ్మే పెట్రోల్ను కూడా ల్యాబ్లో పరీక్షించారు. ముంబైలోని గుర్తింపు పొందిన ల్యాబ్లో ఈ టెస్టులు జరిగాయి. పరీక్షల్లో ఎథనాల్ కంటెంట్ (Ethanol Content), ఆక్టేన్ రేటింగ్ (Octane Rating) వంటి కీలక అంశాలను పరిశీలించారు.
ల్యాబ్ టెస్టుల్లో ఏం బయటపడింది?
ASTM D4815 పద్ధతిలో గ్యాస్ క్రోమాటోగ్రఫీ (GC) టెస్టు ద్వారా ఎథనాల్ శాతం కొలిచారు. ఫలితాలు ఇలా ఉన్నాయి:
Shell Regular: 16.7% ఎథనాల్
Shell V-Power: 15.1% ఎథనాల్
Jio BP E12: 15.7% ఎథనాల్
Jio BP E20: 18.7% ఎథనాల్
ఈ సంఖ్యల ప్రకారం, ఈ రెండు కంపెనీలు (Shell & Jio BP) E20 లక్ష్యానికి ఇంకా పూర్తిగా చేరుకోలేదు. అంటే, లేబుల్లో చెప్పినంత ఎథనాల్ ప్రస్తుతం ఈ ఇంధనాల్లో లేదన్నమాట.
ఆక్టేన్ రేటింగ్ మాత్రం టాప్
ఇక, ఆక్టేన్ రేటింగ్ టెస్టులు ASTM D2699 పద్ధతిలో చేసారు. అన్ని నమూనాల్లో ఆక్టేన్ లెవెల్స్ 97 నుంచి 98.5 RON మధ్య ఉండి, ప్రభుత్వ రంగ పెట్రోల్ సంస్థల కంటే (91-95 RON) ఎక్కువగా వచ్చాయి. Jio BP E20 లో ఎక్కువ ఎథనాల్ ఉండడం వల్ల 98.5 RON రేటింగ్ వచ్చింది. ఇది హై కంప్రెషన్ లేదా టర్బో ఇంజిన్లకు మేలు చేస్తుంది. అయితే, ఎథనాల్ ఎనర్జీ డెన్సిటీ తక్కువగా ఉండడం వల్ల మైలేజ్ కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది.
షెల్ & జియో BP ఫ్యూయల్ సోర్సింగ్ తేడాలు
షెల్కి సొంత రిఫైనరీ ఇండియాలో లేదు. అది IOCL, BPCL లాంటి పబ్లిక్ సెక్టార్ కంపెనీల నుంచి బేస్ పెట్రోల్ తీసుకుని, తన సొంత యాడిటివ్లతో “Regular” & “V-Power” వేరియంట్లుగా విక్రయిస్తోంది. జియో BP మాత్రం రిలయన్స్ జామ్నగర్ రిఫైనరీ నుంచి నేరుగా ఇంధనం తెచ్చుకుని, రెండు గ్రేడ్స్ - E12 & E20 - పేరిట అమ్ముతోంది.
ప్రస్తుతం, కేంద్ర ప్రభుత్వ E20 రూల్ దశల వారీగా అమలవుతోంది. ఇందులో మొదట పబ్లిక్ సెక్టార్ పెట్రోల్ కంపెనీలకే ప్రాధాన్యం ఇవ్వడంతో, షెల్కి ఇంకా పూర్తిగా E20 బేస్ ఫ్యూయల్ అందడం లేదు. అందుకే వాటిలో ఎథనాల్ శాతం కొంచెం తక్కువగా ఉన్నట్లు రిపోర్ట్ చెబుతోంది.
E20 వైపు ఇండియా అడుగులు
కేంద్ర ప్రభుత్వం, 2025 ఏప్రిల్ నుంచి దేశవ్యాప్తంగా E20 పెట్రోల్ తప్పనిసరి చేసింది. అందుకే ప్రైవేట్ ఇంధన కంపెనీలు కూడా తమ బ్లెండింగ్ యూనిట్లను విస్తరిస్తున్నాయి. జియో BP ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో E20 ఇంధనం అందిస్తోంది. షెల్ కూడా రాబోయే నెలల్లో E20కి పూర్తిగా అనుగుణంగా మారనుంది.
ప్రస్తుతం షెల్ & జియో BP ఇంధనాల్లో ఎథనాల్ లెవెల్స్ కొంచెం తక్కువగా ఉన్నా, ఆక్టేన్ రేటింగ్ మాత్రం గట్టిగా ఉంది. అంటే, పెర్ఫార్మెన్స్ బాగానే ఉన్నా, పూర్తి E20 ప్రమాణాలకు ఇంకా సమయం ఉంది. రాబోయే నెలల్లో ఈ కంపెనీల ఫ్యూయల్ మిక్సింగ్ మరింత స్థిరంగా మారే అవకాశం ఉంది.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్ని ఫాలో అవ్వండి.
ట్రెండింగ్ వార్తలు





















