Bhishma Ekadashi 2026: మాఘపౌర్ణమి ముందు వచ్చే ఏకాదశిని 'భీష్మ ఏకాదశి' అంటారెందుకు? ఈ రోజు విశిష్టత ఏంటి?
Significance of Bhishma Ekadashi 2026: జనవరి 29 గురువారం వచ్చిన ఏకాదశిని భీష్మ ఏకాదశి అంటారు.. ఈరోజుకున్న విశిష్టత ఏంటి? ఏం చేయాలి?

Bhishma Ekadashi 2026: మాఘ మాసం శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశిని భీష్మ ఏకాదశిగా పిలుస్తారు. భీష్మపితామహుడు భగవంతుడిలో ఐక్యమైన రోజు ఇదే. అంపశయ్యపై ఉన్న సమయంలో భీష్ముడు పాండవులకు చేసిన మహోపదేశం విష్ణు సహస్రనామం. కురుక్షేత్ర సంగ్రామం పూర్తయ్యాక ఉత్తరాయణ పుణ్యకాలం వరకూ భీష్ముడు అంపశయ్యపైనే ఉన్నాడు. మాఘమాసం శుక్లపక్షం అష్టమి రోజు నిర్యాణం చెందారు. భీష్ముడు నిర్యాణం చెందిన తర్వాత వచ్చిన ఏకాదశి కాబట్టి భీష్మ ఏకాదశి అంటారు. ఈ ఏకాదశికి మరోపేరు జయ ఏకాదశి.
భీష్ముడు అంపశయ్యపై ఉన్న సమయంలో...కృష్ణ పరమాత్ముడు పాండవులను తీసుకెళ్లాడు. ధర్మశాస్త్రాలను అవపోశన పట్టిన మహనీయుడు భీష్ముడు . ఏ ధర్మ సందేహాన్నైనా ప్రామాణికంగా తీర్చగలడు. అంత గొప్ప వ్యక్తి దేహం నుంచి నిష్క్రమించే సమయం ఆసన్నమవుతోంది..ఆయన అస్తమయం తర్వాత ధర్మ సంశయాలను తీర్చే వ్యక్తులు ఎవరూ ఉండరు..అందుకే సూక్ష్మ విషయాలు తెలుసుకునేందుకు రండి అని పాండవులకు చెప్పాడు కృష్ణుడు
దేహమంతా బాణాలు గుచ్చుకుని..శరీరం పూర్తిగా క్షీణించిపోయింది. మాఘమాసంలో ఎండకు ఎండుతూ, మంచుకు తడుస్తూ , నీరు ఆహారం లేకుండా ఉన్నాడు. తాను కోరుకున్న క్షణం మరణం పొందే వరం భీష్ముడికి ఉంది. కానీ ఇత్త బాధలు భరించినా దక్షిణాయనం ముగిసి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమయ్యేవరకూ అంపశయ్యపైనే ఉన్నాడు. ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశించిన తర్వాత సూర్య భగవానుడి జయంతి అయిన రథసప్తమి ముగిసిన తర్వాత వచ్చే ఏకాదశి రోజు దేహాన్న విడిచిపెట్టాలని శ్రీ మహావిష్ణువును తలుచుకున్నాడు. అయితే తాను చేసిన ఓ దోషం స్పష్టంగా జ్ఞాపకం ఉంది. చేసిన ప్రతిపాపం శరీరంపై రాసి ఉంటుంది. అది పూర్తిగా తొలగిపోతే కానీ సద్గతి కలగదు.
భీష్ముడు చేసిన ఆ దోషం ఏంటి?
ద్రౌపదికి నిండు సభలో అవమానం జరుగుతున్నా ఏం చేయలేకపోయాడు. ద్రౌపదికి శ్రీ కృష్ణుడు అంటే అత్యంత ప్రేమ. తమ గురువైన వశిష్ఠుడు ద్రౌపదితో ఓ సందర్భంలో ఇలా చెప్పారు...
మహత్యాపది సంప్రాప్తే స్మత్తవ్యః భగవాన్ హరిః
ఇతరులు తొలగించలేని ఆపదలు కలిగినపుడు శ్రీహరిని స్మరించుకుంటే ఆయన పరిష్కరిస్తాడు అని అర్థం
కౌరవ సభలో ద్రౌపది వస్త్రాపహరణం జరుగుతుంటే పరాక్రమవంతులైన భర్తులు ఆమె గౌరవాన్ని కాపాడలేకపోయారు..కానీ సోదరా అనగానే కృష్ణుడు ప్రత్యక్షమై ఆమె కష్టాన్ని తీర్చాడు.
భీష్ముడు..ధర్మరాజుకి ఉపదేశాలు చెబుతున్నప్పుడు పక్కనే ఉన్న ద్రౌపది ...కురుసభలో తనకు జరిగిన అవమానం గుర్తొచ్చి నవ్విందట. తాతా ఆ రోజు నాకు అవమానం జరుగుతుంటే ఈ ధర్మాలన్నీ ఏమయ్యాయి అని అడిగింది. అవును తల్లీ నా దేహం నా అధీనంలో లేదు..అది దుర్యోధనుడి ఆహారం తినడంతో తన సొంతం. అందుకే నీకు అవమానం జరుగుతోందని తెలిసినా నా దేహం నా మాట వినలేదు..అంత ఘోరమైన పాపం చేశాను కాబట్టి ప్రక్షాళన కోసం ఇన్ని రోజులు అంపశయ్యపై ఉన్నాను అని సెలవిచ్చాడు. అప్పుడు శ్రీ కృష్ణుడు అంపశయ్యపై ఉన్న భీష్ముడికి నొప్పి నుంచి ఉపశమనం కల్పించి పాండవులకు ధర్మసూత్రాలు చెప్పించాడు
భగవద్గీతను నేరుగా చెప్పిన శ్రీ కృష్ణుడు.. విష్ణు సహస్రనామాన్ని భీష్ముడితో చెప్పించాడు..అందుకే ఏ ఏకాదశి అయినా...ముఖ్యంగా భీష్మ ఏకాదశి రోజు విష్ణు సహస్రనామం విన్నా, పఠించినా మోక్షం సిద్ధిస్తుందని పండితులు చెబుతారు
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం కేవలం నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. ABPదేశం ఎలాంటి నమ్మకాలను, సమాచారాన్ని ధృవీకరించదని ఇక్కడ చెప్పడం ముఖ్యం. ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని అమలు చేయడానికి ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు




















