YS Sharmila: ఏపీలో నిలిచిన ఎన్టీఆర్ వైద్య సేవలు, కూటమి ప్రభుత్వంపై షర్మిల మండిపాటు
ఏపీలో NTR వైద్య సేవలు నిలిచిపోవడం కూటమి ప్రభుత్వం కుట్రలో భాగమేనని ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల ఆరోపించారు.

Aarogyasri | అమరావతి: ఏపీలో ఎన్టీఆర్ వైద్య సేవలు నిలిచిపోయాయి. రూ.3,500 కోట్ల బకాయిలు పెండింగ్ ఉన్నాయి. ఇప్పటికే ఎన్టీఆర్ వైద్య సేవ సీఈవోకు నెట్ వర్క్ నోటీసులు ఇచ్చింది. 600 ఆస్పత్రుల్లో ఎన్టీఆర్ వైద్య సేవలు నిలిచిపోయాయి.
పేరుకు మాత్రమే ఏపీ రైజింగ్ స్టేట్ కానీ వైద్య సేవలకు దిక్కులేదు. పేదోడి ఆరోగ్యానికి రాష్ట్రంలో భరోసా లేదు అని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. ప్రజారోగ్యంపై కూటమి ప్రభుత్వానిది అంతులేని నిర్లక్ష్యం కనిపిస్తోంది. ఆరోగ్య శ్రీ సేవల కింద రూ.3500 కోట్లు పెండింగ్ పెట్టడం నిజంగా సిగ్గుచేటు అన్నారు. గత 9 నెలలుగా పూర్తి స్థాయిలో బకాయిలు విడుదల చేయకుండా వైద్య సేవలు ఆపేదాక చూడటం ఆరోగ్యశ్రీ పై చంద్రబాబు సర్కారుకున్న చిత్తశుద్ది ఏంటో అర్థమౌతుందనీ ఎద్దేవా చేశారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్రలో భాగమని విమర్శించారు.
అనారోగ్య శ్రీగా మార్చేశారు..
'కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన రోజు నుంచే ఆరోగ్యశ్రీ అనారోగ్య శ్రీగా మారింది. పేదోడికి వైద్యం అందని ద్రాక్ష అయ్యింది. వైద్య సేవలను విస్తృత పరుస్తామని, వైద్యానికి గ్లోబల్ సిటీగా చేస్తామని, గొప్పలు చెప్పే చంద్రబాబు.. ముందు ఆరోగ్యశ్రీ నిధులు విడుదల చేయాలి. ఏ ప్రభుత్వం బకాయిలు పెట్టినా అవి చెల్లించాల్సిన బాధ్యత మీదేనని తెలుసుకోండి. వెంటనే ఆసుపత్రుల యాజమాన్యాలను చర్చలకు పిలవండి. తక్షణం వైద్య సేవలను తిరిగి ప్రారంభించేలా చర్యలు తీసుకోండి. రాష్ట్రంలో ఆరోగ్య శ్రీ కింద వైద్యం అందక ఏ ఒక్కరూ మృతిచెందినా.. అవి కూటమి ప్రభుత్వం చేసిన హత్యలే అవుతాయని గుర్తుపెట్టుకోండి. పేదవారి ఆరోగ్యానికి సంజీవనిలా మారిన ఆరోగ్య శ్రీ పథకానికి ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూడాలని కాంగ్రెస్ పార్టీ తరపున కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం' అన్నారు.






















