CM Chandrababu: అమెరికా టారిఫ్లతో నష్టపోతున్నాం, అండగా నిలవాలంటూ కేంద్రానికి సీఎం చంద్రబాబు లేఖ
Andhra Pradesh News | అమెరికా సుంకాల కారణంగా నష్టపోతున్న ఆక్వారంగానికి అండగా నిలవాలని కోరుతూ కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖామంత్రి పీయూష్ గోయల్కు ఏపీ సీఎం చంద్రబాబు లేఖ రాశారు.

USA Tarrifs Impact on Aquaculture | అమరావతి: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు, వేస్తున్న కొత్త టారిఫ్ లతో భారత్ సహా పలు దేశాలు ఇబ్బంది పడుతున్నాయి. ట్రంప్ చేస్తున్న టారిఫ్ వార్ ఆంధ్రప్రదేశ్ మీద పడింది. అమెరికా సుంకాల కారణంగా ఏపీలో ఆక్వారంగం నష్టపోతోందని, అండగా నిలవాలని కోరుతూ కేంద్రం సాయం కోరారు ఏపీ సీఎం చంద్రబాబు. అమెరికా సుంకాల కారణంగా నష్టపోతున్న ఆక్వారంగానికి అండగా నిలవాలని కేంద్ర పీయూష్ గోయల్కు చంద్రబాబు లేఖ రాశారు.
అమెరికా విధిస్తున్న సుంకాల నుంచి ఆక్వా ఉత్పత్తులకు మినహాయింపు పొందేలా ప్రయత్నాలు చేయడం ద్వారా రైతులను ఆదుకోవాలని కేంద్రమంత్రిని కోరారు. ఆంధ్రప్రదేశ్ జీడీపీలో మత్స్య రంగం కీలక భూమిక పోషిస్తుందని, ఆక్వా రైతులకు సంక్షోభ సమయంలో అండగా నిలవాలని పీయూష్ గోయల్ కు రాసిన లేఖలో సీఎం చంద్రబాబు కోరారు.
కేంద్రానికి రాసిన లేఖలో సీఎం చంద్రబాబు ప్రస్తావించిన అంశాలు
భారతదేశం నుంచి వెళ్లే సముద్ర ఆహార ఎగుమతులపై అమెరికా ప్రభుత్వం 27 శాతం దిగుమతి సుంకం విధించింది. కాగా, 2023-24 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం నుంచి అమెరికాకు 2.55 బిలియన్ల డాలర్ల విలువైన సముద్ర ఆహార ఉత్పత్తులు ఎగుమతి అయ్యాయి. వీటిలో రొయ్యలే 92 శాతం వాటాను కలిగి ఉన్నాయి.
అమెరికా దేశానికి రొయ్యల ఎగుమతిలో కీలకమైన భారతదేశంపై 27 శాతం దిగుమతి సుంకం కారణంగా ఆక్వా రైతాంగం తీవ్రంగా నష్టపోతుంది. ఈక్వెడార్ వంటి ఎగుమతిదారులపై కేవలం 10 శాతం పన్ను మాత్రమే అమెరికా విధించింది. ఇది భారతదేశానికి పరోక్షంగా నష్టం చేయడంతో పాటు వారికి అనుకూలంగా మారుతోంది. మన దేశ ఎగుమతిదారులు ఇప్పటికే 5.77 శాతం కౌంటర్వెయిలింగ్ డ్యూటీ (CVD) భారాన్ని మోస్తున్నారు. ఇలా అన్ని టాక్స్లను కలుపుకుని చూస్తే ఈక్వెడార్కు, భారతదేశానికి మధ్య సుంకాల వ్యత్యాసం దాదాపు 20 శాతం ఉంటుంది.
అమెరికా విధించిన కొత్త సుంకాలు ఏప్రిల్ 5, 2025 నుండి అమల్లోకి వచ్చాయి. దీని కారణంగా అమెరికా దేశానికి వెళ్లే అన్ని ఎగుమతులపైనా ఈ భారం పడుతోంది.
గతంలో వచ్చిన ఆర్డర్లకు అనుగుణంగా ఇప్పటికే సేకరించిన ఉత్పత్తులు ప్యాకింగ్ అయి, కోల్డ్ స్టోరేజ్ లు, పోర్టులలో ఉన్నాయి. కొత్త నిబంధనల వల్ల ఈ ఉత్పత్తులపై సైతం అమెరికా విధించిన సుంకాల భారం పడుతుంది.
యూరోపియన్ యూనియన్లో భారతీయ ఎగుమతిదారులు 50 శాతం తనిఖీ రేట్లు, 4 – 7 శాతం దిగుమతి సుంకంతో సహా నాన్-టారిఫ్ అడ్డంకులను ఎదుర్కొంటున్నారు. కానీ వియత్నాం వంటి దేశాలు EUతో వారి స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ FTA) కింద జీరో-డ్యూటీ పొందాయి. ఈ కారణంగా వియాత్నాం వంటి దేశాలు యూరోపియన్ మార్కెట్ను సమర్థవంతంగా ఆక్రమిస్తున్నాయి. వియత్నాం, థాయిలాండ్, జపాన్ దేశాల మార్కెట్లు భారతదేశం నుంచి సీ ఫుడ్ను కొనుగోలు చేసి వాటిని ప్రాసెస్ చేసి అమెరికాకు ఎగుమతి చేస్తాయి. నేడు తుది ఉత్పత్తులపై విధించిన అధిక ట్యాక్సుల వల్ల ఆ దేశాలు కూడా మనకు ఇచ్చిన ఆర్డర్లను రద్దు చేస్తున్నాయి.
ఏపీలో శీతల గిడ్డంగులు కూడా నిండిపోవడంతో చేతికి వచ్చిన ఆక్వా పంట ఎక్కడ నిల్వ ఉంచాలో కూడా తెలియని గందరగోళ పరిస్థితిలో రైతాంగం ఉంది. ఇంకా పంట సిద్ధంగా ఉంది. 27 శాతం సుంకాల కారణంగా రైతుల నుండి పంట సేకరిచడం ఎగుమతిదారులు నిలిపివేశారు. ఈ పరిణామాలు ఏపీలో ఆక్వా రంగాన్ని సంక్షోభంలోకి నెట్టివేస్తున్నాయి. ఈ పరిణామాలతో ఆక్వా రైతులు, హేచరీలు, ఫీడ్ మిల్లులు, ప్రాసెసర్లు, ఎగుమతిదారులు.... ఇలా అందరికీ సమస్యలు వచ్చాయి.
అమెరికా ప్రభుత్వంతో చర్చలు జరిపి సుంకాల నుంచి రొయ్యలను మినహాయింపు జాబితాలో చేర్చడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరుతున్నాను. సకాలంలో మీరు దీనిపై జోక్యం చేసుకుని సమస్య పరిష్కరిస్తే ఆక్వాపై ఆధారపడి బతుకుతున్న లక్షలాది మంది జీవనోపాధిని కాపాడవచ్చు’ అని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్కు రాసిన లేఖలో చంద్రబాబు కోరారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

