ప్రభుత్వ రంగ సంస్థలు, గురుకులాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఈ పెంపు వర్తిస్తుంది. 15 వేల మందికి పైగా ఉద్యోగులు లబ్ధి పొందుతారు.
AP Employees Retirement Age Increase : ఏపీలో ఉద్యోగులకు పదవీ విరమణ వయసు మరో రెండేళ్లు.. చంద్రబాబు వ్యూహం ఏమిటి?
ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇది కేవలం ఉద్యోగుల సంక్షేమ చర్య మాత్రమేనా? లేక ఆర్థిక, పరిపాలనా, రాజకీయ లెక్కలు కూడా ఉన్నాయా?

- ఏపీలో ప్రభుత్వ రంగ ఉద్యోగుల పదవీ విరమణ వయసు 62కి పెంపు.
- 15 వేల మందికి లబ్ధి, ప్రభుత్వానికి తాత్కాలిక ఆర్థిక ఊరట.
- చంద్రబాబు గత నిర్ణయం; యువత ఉద్యోగ అవకాశాలపై విమర్శ.
AP Employees Retirement Age Increase : ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ రంగ సంస్థలు, గురుకులాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, ఉపాధ్యాయులకు పదవీ విరమణ వయసును 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచుతూ రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో 15 వేల మందికి పైగా ఉద్యోగులు లబ్ధి పొందనున్నారు. అయితే ఇది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇలా రిటైర్మెంట్ వయసు పెంచడం మొదటిసారేమీ కాదు.
ఇది చంద్రబాబుకు కొత్త కాదు
2014లో రాష్ట్ర విభజన అనంతరం ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు, ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 58 నుంచి 60 సంవత్సరాలకు పెంచారు. అప్పట్లో అసెంబ్లీలో చట్ట సవరణ చేసి ఈ నిర్ణయం అమలు చేశారు. రాష్ట్ర విభజన తర్వాత అనుభవజ్ఞులైన ఉద్యోగుల సేవలు కొత్త రాష్ట్రానికి అవసరమని అప్పట్లో చంద్రబాబు పేర్కొన్నారు.
ఇప్పుడు 2026లో మరోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే తరహా నిర్ణయం తీసుకున్నారు. ఈసారి ప్రభుత్వ రంగ సంస్థలు, గురుకులాలు, సంక్షేమ సంస్థల ఉద్యోగులను ప్రధాన ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా తీసుకువస్తూ 62 ఏళ్ల పదవీ విరమణ వయసును అమలు చేస్తున్నారు.
ప్రభుత్వాలకు ఇందులో లాభం ఏమిటి?
రిటైర్మెంట్ వయసు పెంపు ఉద్యోగులకు మేలు చేసే నిర్ణయమే అయినా, ప్రభుత్వాలకు కూడా పలు ప్రయోజనాలు ఉన్నాయి.
1. పెన్షన్, గ్రాట్యుటీ భారం వాయిదా
ఉద్యోగి పదవీ విరమణ చేసిన వెంటనే ప్రభుత్వం గ్రాట్యుటీ, సెలవుల నగదీకరణ, పెన్షన్ వంటి భారీ చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. 15 వేల మంది ఉద్యోగుల రిటైర్మెంట్ను రెండేళ్లు వాయిదా వేయడం ద్వారా వేల కోట్ల రూపాయల తక్షణ ఆర్థిక భారం ప్రభుత్వంపై పడకుండా ఉంటుంది. ప్రస్తుతం ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్న రాష్ట్రానికి ఇది కొంత ఊరటనిస్తుంది.
2. సిబ్బంది అనుభవాన్ని వినియోగించుకునే అవకాశం
ఆంధ్రప్రదేశ్లో 700కు పైగా గురుకుల విద్యాసంస్థలు ఉన్నాయి. వీటిలో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు, వార్డెన్లు కీలక పాత్ర పోషిస్తున్నారు. వారిని ఒకేసారి భర్తీ చేయడం సులభం కాదు. మరో రెండేళ్లు సేవలు కొనసాగించడం వల్ల స్కూల్లు,క్లాసుల నిర్వహణ మరో రెండేళ్లు సులువుగా సాగుతుంది.
3. ఉద్యోగుల ఓటు బ్యాంక్
ప్రస్తుత ఉద్యోగులు మరో రెండేళ్ల తర్వాత వీరంతా ఖాళీఐతే ఎన్నికల నాటికి ఉద్యోగాల నోటిఫికేషన్ భారీగా వేసుకునే వెసులుబాటు ఉంటుంది.
రాష్ట్రంలో సుమారు 4.5 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. వారి కుటుంబాలను కలుపుకుంటే ఇది ప్రభావవంతమైన ఓటు బ్యాంక్. రిటైర్మెంట్ వయసు పెంపు ఉద్యోగులకు భావోద్వేగపరంగా కూడా పెద్ద ప్రయోజనం. మరో రెండేళ్ల పూర్తి జీతం, పీఎఫ్, వైద్య సదుపాయాలు అందుతాయి.
ఉద్యోగులకు కలిగే ప్రత్యక్ష లాభాలు
62 ఏళ్ల వరకు ఉద్యోగంలో కొనసాగడం వల్ల ఉద్యోగులకు అనేక ఆర్థిక ప్రయోజనాలు లభిస్తాయి. మరో రెండేళ్ల పూర్తి జీతం రూపంలో రూ.12 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు అదనపు ఆదాయం. సర్వీస్ పెరుగుతుంది కాబట్టి జీపీఎఫ్, ఇతర పొదుపుల్లో పెరుగుదల ఉంటుంది. హెల్త్ ఇన్షూరెన్స్, చివరి జీతం పెరగటంతో పెన్షన్ కూడా అధికంగా లభించే అవకాశముంది.
దేశవ్యాప్తంగా పరిస్థితి ఏంటి ??
ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సాధారణ పదవీ విరమణ వయసు 60 సంవత్సరాలు. తెలంగాణలో ఇది 61 సంవత్సరాలు కాగా, ఆంధ్రప్రదేశ్లో ప్రధాన ప్రభుత్వ ఉద్యోగులకు ఇప్పటికే 62 సంవత్సరాలు అమల్లో ఉంది. ఇప్పుడు ప్రభుత్వ రంగ సంస్థలు, గురుకుల ఉద్యోగులు కూడా అదే స్థాయికి చేరుకున్నారు.
2025 నాటికి భారతదేశ సగటు జీవితకాలం 70.8 సంవత్సరాలకు చేరుకుంది. మెరుగైన వైద్య సదుపాయాలు, జీవన ప్రమాణాలు పెరగడంతో ఉద్యోగులు ఎక్కువకాలం పని చేయగలుగుతున్నారని పాలకులు భావిస్తున్నారు. ప్రపంచంలోని అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో పదవీ విరమణ వయసు 65 నుంచి 67 సంవత్సరాల మధ్య ఉంది.
మరి కొత్త కొత్త ఉద్యోగార్ధుల పరిస్ధితేంటి??
ప్రభుత్వ నిర్ణయంపై విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. యువతకు ఉద్యోగ అవకాశాలు ఆలస్యమవుతాయని విమర్శకులు అంటున్నారు. ఒక ఉద్యోగి మరో రెండేళ్లు కొనసాగితే, ఆ పోస్టు కొత్త అభ్యర్థికి అందుబాటులోకి రావడం కూడా రెండేళ్లు ఆలస్యమవుతుంది. అలాగే ఇది శాశ్వత ఆర్థిక ఉపశమనం కాదని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం చెల్లించాల్సిన పెన్షన్, గ్రాట్యుటీ భారం వాయిదా పడుతుందే తప్ప పూర్తిగా తగ్గదని చెబుతున్నారు.
చంద్రబాబు ఆలోచన ఏంటి?
2014 నుంచి 2026 వరకు పరిశీలిస్తే ఒక విషయం స్పష్టంగా కనిపిస్తోంది. అనుభవజ్ఞులైన మానవ వనరులను కొనసాగించడం పరిపాలనకు ఉపయోగపడుతుందనే నమ్మకం చంద్రబాబుకు ఉంది. ఉద్యోగుల సంక్షేమాన్ని కేవలం రాజకీయ ప్రయోజనంగా కాకుండా పాలనా వ్యూహంగా కూడా ఆయన చూస్తున్నట్లు ఈ నిర్ణయాలు సూచిస్తున్నాయి.
మొత్తానికి చూస్తే, ప్రభుత్వ రంగ సంస్థలు, గురుకులాలు, సంక్షేమ సంస్థల్లో పనిచేస్తున్న 15 వేల మందికి పైగా ఉద్యోగులకు ఈ నిర్ణయం మరో రెండేళ్ల ఉద్యోగ భద్రతను కల్పించింది. ప్రభుత్వానికి ఆర్థిక భారం తాత్కాలికంగా తగ్గింది. రాజకీయంగా ఉద్యోగ వర్గాల్లో సానుకూలత పెరిగింది. మరోసారి పదవీ విరమణ వయసు పెంపుతో చంద్రబాబు తనదైన ముద్ర వేశారు.
Before You Go
94-Year-Old Woman Renounces US Citizenship | US సిటిజన్షిప్ వద్దని తిరిగొచ్చిన బామ్మ
Frequently Asked Questions
ఆంధ్రప్రదేశ్లో పదవీ విరమణ వయసు పెంపు ఎవరికి వర్తిస్తుంది?
పదవీ విరమణ వయసు పెంపు వల్ల ప్రభుత్వానికి కలిగే ప్రయోజనాలు ఏమిటి?
పెన్షన్, గ్రాట్యుటీ భారం వాయిదా పడుతుంది, తక్షణ ఆర్థిక భారం తగ్గుతుంది. అలాగే అనుభవజ్ఞులైన ఉద్యోగుల సేవలను మరింత కాలం వినియోగించుకునే అవకాశం ఉంటుంది.
ఈ నిర్ణయం వల్ల ఉద్యోగులకు ఆర్థికంగా ఎలాంటి లాభాలు ఉంటాయి?
ఉద్యోగులకు మరో రెండేళ్ల పూర్తి జీతం (రూ.12-20 లక్షలు) లభిస్తుంది. జీపీఎఫ్, ఇతర పొదుపులు పెరుగుతాయి, చివరి జీతం పెంపుతో పెన్షన్ అధికంగా లభిస్తుంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















