Vizianagaram News: రాములవారి విగ్రహం ధ్వంసం కేసు నిందితుడికి రూ. 5 లక్షలు - ప్రభుత్వంపై బొత్స తీవ్ర విమర్శలు
Botcha: రాముల వారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన కేసు నిందితుడికి ప్రభుత్వం సాయం అందించిందని బొత్స ఆరోపించారు. తమ హయాంలో తప్పుడు కేసు పెట్టి ఉంటే విచారణ జరిపి క్లీన్ చిట్ ఇవ్వాల్సిందన్నారు.

botsa accuses government helping accused rama statue vandalism: మూడేళ్ల క్రితం రాష్ట్రంలో సంచలనం సృష్టించిన రామతీర్థం ఆలయంలో రాముడి విగ్రహం ధ్వంసం (తల నరికిన) ఘటనలో నిందితుడి(ఏ2)గా ఉన్న వ్యక్తికి సీఎం సహాయ నిధి నుంచి రూ.5 లక్షలు సాయం ఇవ్వడం చూస్తుంటే ఆ ఘటనలో టీడీపీ పెద్దల పాత్రపై అనుమానాలు వస్తున్నాయని మండలి విపక్షనేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. ఆ కేసులో నిందితుడికి ప్రభుత్వ సొమ్ము ఇవ్వడమే కాకుండా ఆ కార్యక్రమంలో మంత్రి, స్థానిక ఎమ్మెల్యే పాల్గొనడం ద్వారా ప్రజలకు ఏం సందేశం పంపుతున్నారని విజయనగరంలో మీడియాతో మాట్లాడిన మండలి విపక్షనేత ప్రశ్నించారు.
అసలు ప్రభుత్వ ఉద్దేశం ఏమిటి?
మూడేళ్ల కిందట రామతీర్థం ఆలయంలో రాముడి విగ్రహం ధ్వంసం చేసిన (తల నరికిన) కేసులో నిందితుడి(ఏ 2)గా ఉన్న వ్యక్తికి సాక్షాత్తూ అదే ఆలయానికి ధర్మకర్తగా ఉన్న కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు చేతుల మీదుగా సీఎం సహాయ నిధి నుంచి రూ.5 లక్షలు ఇచ్చారు. ఆ కార్యక్రమంలో జిల్లా మంత్రితో పాటు, స్థానిక ఎమ్మెల్యే, ఇతర ప్రజాప్రతినిధులు కూడా పాల్గొన్నారు. ఆ రోజు సంఘటన జరిగినప్పుడు మా ప్రభుత్వం అతడిపై రాజకీయ ఉద్దేశంతో కేసు పెట్టినట్టు మీరు భావించి ఉంటే, మీ ప్రభుత్వం విచారణ జరిపించి దాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాల్సింది. తప్పుడు కేసు పెట్టారని నిర్ధారించి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలి. అలా కాకుండా, ఒకవేళ అతడు నిందితుడే కాదని మీరు చెప్పదల్చుకుంటే.. కూటమి ప్రభుత్వం అసలు నిందితుడిని పట్టుకుని చట్టం ముందు నిలబెట్టాలి. అదేమీ లేకుండా ప్రజల సొమ్మును సీఎం సహాయ నిధి నుంచి నిందితుడికిచ్చి ఏం సందేశం ఇస్తున్నారని బొత్స ప్రశ్నించారు.
బహుమానంగా ఇచ్చారా?
ఆ సంఘటన జరిగినప్పుడు దేవుడు మీద అలవిమాలిన భక్తిని ప్రదర్శించిన మీరు నానా హంగామా చేసి.. అదే కేసులో నిందితుడికి సాయం చేయడం చూస్తుంటే.. ఆ పాపంలో మీ పాత్ర కూడా ఉందన్న అనుమానాలు కలుగుతున్నాయని బొత్స అన్నారు. ఈ ఘటనలో రాజకీయంగా టీడీపీకి మేలు చేసినందుకు బహుమానంగా ఇచ్చారా?. ఒకవేళ అదే జరిగితే దేవుడి విషయంలో రాజకీయం చేసిన వారు ఎవరైనా భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని మాత్రం గుర్తుంచుకోవాలని హెచ్చరించారు.
పవన్ కల్యాణ్ నోరెందుకు మెదపడం లేదు ?
ఇంత దారుణం జరుగుతుంటే హిందూ సనాతనవాదిగా గొప్పగా ప్రకటించుకున్న పవన్ కళ్యాణ్, హిందూ మతానికి బ్రాండ్ అంబాసిడర్గా ప్రచారం చేసుకునే బీజేపీ ఏం చేస్తున్నాయి?. వారెందుకు నోరు మెదపడం లేదు?. ప్రభుత్వ చర్యను వారెలా సమర్థిస్తున్నారని బొత్స ప్రశ్నించారు. కూటమి నాయకుల అబద్ధపు హామీలు నమ్మి అన్ని వర్గాల ప్రజలు దారుణంగా మోసపోయారు. విద్యార్థులు, రైతులు, మహిళలు, ఉద్యోగులు, వ్యాపారులు.. ఎవ్వరినీ వదలకుండా అందరినీ కూటమి నాయకులు వంచించారని బొత్స సత్యనారాయణ ఆరోపించారు.





















