Vizag News : విశాఖలో ఇళ్ల యజమానులకు గుడ్ న్యూస్ - టూరిస్టులకు హోంస్టే చాన్స్ - కొత్త ఆదాయ మార్గం !
Andhra Pradesh: ఏపీ పర్యాటక ప్రాంతాల్లో టూరిస్టులకు హోం స్టే సౌకర్యాన్ని కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందు కోసం సొంత ఇళ్లు ఉన్న వారిని రిజిస్ట్రేషన్లు చేసుకోవాలని పిలుపునిచ్చింది.

Vizag Home Stays: విశాఖపట్నం వచ్చే పర్యాటకులకు హోమ్ స్టే సౌకర్యాన్ని కల్పించాలని అధికారులు నిర్ణయించారు. కనీసం ఒక గది నుంచి ఆరు గదుల వరకూ అన్ని వసతులతో పర్యాటకులకు అందించగలిగేవారు రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చని పిలుపునిచ్చారు.
విశాఖపట్నం వచ్చే పర్యాటకులకు 'ఇంటిలో ఆతిథ్యం' ఇవ్వాలనుకునేవారు రిజిస్ట్రేషన్లు చేసుకోవాలని పర్యాటక శాఖ అధికారులు పిలుపునిచ్చారు. ఎవరికైనా సొంత ఇల్లు/విల్లా/అపార్టుమెంట్ ఫ్లాట్ ఉండి, వాటిని పర్యాటకులకు రోజువారీ పద్ధతిలో అద్దెకు ఇవ్వడానికి ఆసక్తి ఉంటే పేర్లు నమోదు చేసుకోవాలని జిల్లా పర్యాటక శాఖాధికారిణి జె.మాధవి సూచించారు.
చాలా పర్యాటక ప్రాంతాల్లో హోం స్టే ఇప్పుడు ప్రత్యేక ఆకర్షణ
పర్యాటకులకు అన్ని ప్రాంతాల్లోను హోటళ్లలో గదులు లభించవు. అలాగే తినడానికి ఆహారం కూడా దొరకదు. చాలామంది పర్యాటకులు స్థానికంగా లభించే ఆహార పదార్థాలను రుచి చూడాలనుకుంటారు. అక్కడి మనుషులతో మాట్లాడి, సంస్కృతీ సంప్రదాయాలు, ఆహారపు అలవాట్లు, దుస్తులు, స్థానిక కళల గురించి తెలుసుకోవాలనుకుంటారు. ఇవన్నీ సాధారణ హోటళ్లలో లభించవు. అటువంటి అభిరుచి కలిగిన వారికి స్థానిక విధానంలో 'వసతి సౌకర్యాలు' కల్పించడాన్ని 'హోమ్ స్టే'గా వ్యవహరిస్తున్నారు.
ఏపీలోనూ మంచి ఆదరణ ఉంటుందని భావిస్తున్న ప్రభుత్వం
కేరళతో పాటు కశ్మీర్, పంజాబ్ వంటి రాష్ట్రాలతో పాటు మలేషియా వంటి దేశాల్లో, గిరిజన ప్రాంతాల్లో ఈ హోమ్ స్టే బాగా ఆదరణ పొందింది. దీనివల్ల స్థానికులకు కూడా ఉపాధి లభిస్తోంది. వారి సంస్కృతి, సంప్రదాయాలకు ప్రచారం పెరుగుతోంది. ప్రభుత్వాలపై ఒత్తిడి తగ్గుతోంది. రాష్ట్రాలకు వచ్చే పర్యాటకులకు అవసమైనన్ని గదులు పర్యాటక, ప్రైవేటు సంస్థలు సమకూర్చలేకపోతున్నాయి. ఈ హోమ్ స్టే వల్ల పర్యాటకంగా డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో స్థానికులే వారి గృహాలను అందంగా అలంకరించి, వాణిజ్య ధరల కంటే తక్కువకే వసతి కల్పించడం, ఇంట్లో వండిన ఆహార పదార్థాలను ఆప్యాయంగా వడ్డించడం వల్ల పర్యాటకుల సంతృప్తి శాతం పెరుగుతోంది.
ప్రజలకు కొత్త ఆదాయ మార్గం కూడా !
రాష్ట్ర ప్రభుత్వం దీనిని నూతన పర్యాటక పాలసీలో చేర్చింది. కనీసం ఒక గది నుంచి ఆరు గదుల వరకు అన్ని వసతులతో పర్యాటకులకు అందించగలిగేవారు పేర్లు నమోదు చేయించుకోవాలని పిలుపునిచ్చింది. ఆంధ్రప్రదేశ్ పర్యాటక ప్రాధికార సంస్థ (ఏపీటీఏ) వెబ్సైట్లో ఎవరికి వారే వివరాలు నమోదు చేసుకోవచ్చు. ఇతర వివరాలకు 0891-2754716 నంబరులో సంప్రతించాలని జె.మాధవి సూచించారు. కొద్ది రోజులు గడిచాక ఆసక్తి కలిగిన వారిని పిలిచి అవగాహన సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. విధి విధానాలు తెలియజేస్తామని, పర్యాటకులే నేరుగా ఎవరికి ఎక్కడ నచ్చితే అక్కడి హోమ్ స్టేను ఎంపిక చేసుకుంటారని వివరించారు.





















