YS Jagan Strong Warning To Chandra Babu: మీ తప్పులు ప్రజలే డైరీల్లో రాసుకుంటున్నారు- వైఎస్ జగన్ సంచలన పోస్టు
YS Jagan Strong Warning To Chandra Babu: వంశీ అరెస్టు, అబ్బయ్య చౌదరిపై కేసు పెట్టడంపై మాజీ సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు తప్పులను ప్రజలే తమ డైరీల్లో రాసుకుంటున్నారని వార్నింగ్ ఇచ్చారు.

Andhra Pradesh Latest News: మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పట్ల చంద్రబాబు ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వంశీని అరెస్టు చేసిన 30 గంటల తర్వాత ఆయన స్పందిస్తూ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కీలకమైన నేతను అరెస్టు చేసినా జగన్ ఎందుకు స్పందించలేదని అన్ని వైపుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్న టైంలో సోషల్ మీడియా వేదికగా రియాక్ట్ అయ్యారు.
ఆంధ్రప్రదేశ్లో చట్టానికి, న్యాయానికి చోటు లేదని వాపోయారు. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడిపిస్తున్న కూటమి నేతలు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. ప్రశ్నించే వారిని అక్రమంగా అరెస్టు చేసి అసలు రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారని ఫైర్ అయ్యారు.
"రాష్ట్రంలో చట్టానికి, న్యాయానికి చోటు లేకుండా పోయింది. తీవ్ర అధికార దుర్వినియోగంతో రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ అక్రమ అరెస్టులు చేస్తూ, అసలు రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ విషయంలో చంద్రబాబు కూటమి సర్కార్ వ్యవహరిస్తున్న తీరు అత్యంత అన్యాయంగా ఉంది. "
న్యాయమూర్తి ముందు ఒక యువకుడు వాంగ్మూలం ఇస్తే తప్పులు బయటపడకుండా దాన్ని కూడా మార్చేస్తున్నారని జగన్ ఆరోపించారు. "గన్నవరం కేసులో తనపై టీడీపీ వారు ఒత్తిడి తెచ్చి, తప్పుడు కేసు పెట్టించారంటూ సాక్షాత్తూ జడ్జి ముందు దళిత యువకుడు వాంగ్మూలం ఇచ్చి, అధికారపార్టీ కుట్రను బట్టబయలు చేస్తే, తమ బండారం బయటపడిందని, తమ తప్పులు బయటకు వస్తున్నాయని తట్టుకోలేక, దాన్నికూడా మార్చేయడానికి చంద్రబాబు దుర్మార్గాలు చేస్తున్నారు."
ఇన్ని రకాలుగా వ్యవస్థలను వాడుకోవచ్చా?
అధికార పార్టీ కుట్రను భగ్నం చేసిన యువకుడిని బెదిరించారని జగన్ ఆరోపించారు. ఆ తప్పును కప్పి పుచ్చుకునేందుకు అన్ని వ్యవస్థలను వాడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. "సత్యానికి కట్టుబడి నిజాలు చెప్పినందుకు దళిత యువకుడ్ని పోలీసులను పంపించి మరీ వేధించడం ఎంతవరకు కరెక్టు? వాంగ్మూలం ఇచ్చిన రోజే ఆ దళిత యువకుడి కుటుంబంపైకి పోలీసులు, టీడీపీ కార్యకర్తలు వెళ్లి బెదిరించి, భయపెట్టడం కరెక్టేనా? ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వమేనా? మీ కక్షలు తీర్చుకోవడానికి ఇన్నిరకాలుగా వ్యవస్థలను వాడుకుని దుర్మార్గాలు చేస్తారా? సుప్రీంకోర్టు దృష్టిలో ఉన్న ఈ కేసులో, వారి ఆదేశాలను అనుసరించి దిగువ కోర్టు క్షుణ్నంగా కేసును విచారిస్తుంటే, పెట్టింది తప్పుడు కేసంటూ వాస్తవాలు బయటకు వస్తుంటే మొత్తం దర్యాప్తును, విచారణను, చివరకు జడ్జిని, న్యాయ ప్రక్రియను అపహాస్యం చేయడం, అధికారముందనే అహంకారంతో మీరు చేస్తున్నది అరాచకం కాదా? అధికార దుర్వినియోగం కాదా? వంశీ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాను. వంశీ భద్రతకు ఎలాంటి సమస్య వచ్చినా ఈ ప్రభుత్వమే పూర్తిగా బాధ్యత వహించాల్సి ఉంటుంది.
Also Read: మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ తో టీడీపీలో ఎందుకంత ఉత్సాహం?
దెందులూరు ఇష్యూపై కూడా జగన్ ఫైర్
దెందులూరు ఎమ్మెల్యే బూతులు తిట్టిన వీడియోలు బయటకు వచ్చాయని అందులో ఆయన మాట్లాడింది ప్రజలంతా చూశారన్నారు జగన్. అయినా ఈ ఇష్యూలో దెందులూరు మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరిపై తప్పుడు కేసులు పెట్టడం దారుణమన్నారు. "దెందులూరు మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరిపై తప్పుడు కేసును తీవ్రంగా ఖండిస్తున్నాను. కళ్యాణ మండపం ప్రాంగణంలో అబ్బయ్య చౌదరి డ్రైవర్ టీడీపీ ఎమ్మెల్యే బూతులు తిట్టి, తిరిగి అబ్బయ్య చౌదరిపై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టడం దుర్మార్గం. టీడీపీ ఎమ్మెల్యే ఏం తిట్టారో ఆ వీడియోను కోట్లమంది ప్రజలు చూశారు. మరి ఎవరిపై చర్యలు తీసుకోవాలి? తప్పులు టీడీపీ వారు చేసి, వారిపై చర్య తీసుకోమని కోరితే.. పోలీసులు ఎదురు కేసులు పెట్టి అన్యాయంగా వ్యవహరిస్తున్నారు. అందులోనూ 307, అంటే హత్యాయత్నం కేసులు పెట్టడం ఏంటి? అందులోనూ బాధితులపైన. రాష్ట్రంలో దిగజారిన వ్యవస్థలకు ఈ ఘటన నిదర్శనం కాదా?"
రాష్ట్రంలో చట్టానికి, న్యాయానికి చోటు లేకుండా పోయింది. తీవ్ర అధికార దుర్వినియోగంతో రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ అక్రమ అరెస్టులు చేస్తూ, అసలు రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ విషయంలో @ncbn కూటమి సర్కార్ వ్యవహరిస్తున్న తీరు అత్యంత…
— YS Jagan Mohan Reddy (@ysjagan) February 14, 2025
డైరీల్లో ప్రజలు రాసుకుంటున్నారు
సూపర్ 6 సహా 143 హామీలు నిలబెట్టుకోలేక వాటి నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి ఇలాంటివి చేస్తున్నారని వైఎస్ జగన్ అభిప్రాయపడ్డారు. చంద్రబాబు తప్పులను ప్రజలు డైరీల్లో నోట్ చేసుకుంటున్నారని వార్నింగ్ ఇచ్చారు. " చంద్రబాబుగారూ! ప్రజలకు ఇచ్చిన సూపర్-6, సహా ఇచ్చిన 143 హామీలు నిలబెట్టుకోలేక, ఒక్కదాన్నీ కూడా అమలు చేయక, అంతకుముందున్న పథకాలను సైతం రద్దుచేసి, ప్రజలను సంక్షోభంలోకి నెట్టారు. ప్రజల దృష్టిని మళ్లించడానికి మాపార్టీకి చెందిన నాయకులను, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని తప్పుడు కేసులు, తప్పుడు సాక్షులుతో అక్రమ అరెస్టులకు దిగుతున్నారు. మీ తప్పులను ప్రజలే తమ డైరీల్లో రికార్డు చేసుకుంటూనే ఉన్నారు. తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరిస్తున్నాం."
Also Read: పరిటాల రైట్ హ్యాండ్, Jr ఎన్టీఆర్ ఫ్రెండ్.. టీడీపీ ఎమ్మెల్యే.. జగన్ కు ఫ్యాన్- ఎవరీ వల్లభనేని వంశీ
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

