Gade Sai Krishna Missing Issue: సాయికృష్ణ అదృశ్యం కేసులో సిఐ మాత్రమే కాదు.. సీపీ, డీజీపీలపై మర్డర్ కేసు పెట్టాలి - సీబీఐ దర్యాప్తునకు వైఎస్ జగన్ డిమాండ్!
YS Jagan Mohan Reddy: సాయికృష్ణను పోలీసులే హత్య చేశారని.. వారిపై హత్య కేసు పెట్టాలని జగన్ డిమాండ్ చేశారు. సాయికృష్ణ కుటుంబాన్ని ఆయన పరామర్శించారు.

Sai Krishna Case Krishnalanka Police: విజయవాడ నడిబొడ్డున ఉన్న కృష్ణలంక పోలీస్ స్టేషన్లో గాదె సాయికృష్ణ అనే రౌడీషీటర్ అదృశ్యం కావడంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం విజయవాడలోని కృష్ణలంకలో ఉన్న బాధిత కుటుంబ సభ్యులను జగన్ పరామర్శించి, వారిని ఓదార్చారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంపై, రాష్ట్ర పోలీసు యంత్రాంగంపై నిప్పులు చెరిగారు. సాయికృష్ణను హత్య చేశారని జగన్ అన్నారు. ఈ దారుణ హత్య వెనుక కేవలం కృష్ణలంక సీఐ మాత్రమే లేరని, విజయవాడ పోలీస్ కమిషనర్ , రాష్ట్ర డీజీపీ కి కూడా ఇందులో ప్రత్యక్ష భాగస్వామ్యం ఉందని ఆరోపిస్తూ, ఈ కేసుపై సీబీఐ దర్యాప్తు జరగాలని డిమాండ్ చేశారు.
ఒకే నెలలో ఇద్దరి బలి.. పోలీసుల అరాచకం!
మే నెలలోనే కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసుల వేధింపులు తాళలేక క్రాంతికుమార్ అనే మరో యువకుడు సీఐ పేరును మరణవాంగ్మూలంలో ప్రస్తావిస్తూ ఆత్మహత్య చేసుకున్నాడని జగన్ గుర్తుచేశారు. ఆ ఘటన మరిచిపోకముందే మే 9న సాయికృష్ణను పోలీసులు చట్టవిరుద్ధంగా స్టేషన్కు తీసుకెళ్లి చిత్రహింసలు పెట్టారని ఆక్షేపించారు. కొడుకు కోసం పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగిన తల్లిని చూసి నీ కొడుకు ఫోటోకు దండ వేసుకో అని సీఐ హేళన చేశారు. బాధిత కుటుంబం, లాయర్ కలిసి డీజీపీ కార్యాలయంలో రాతపూర్వకంగా ఇచ్చిన ఫిర్యాదును చెత్తబుట్టలో వేశారు. తప్పు చేస్తే కోర్టులు శిక్షిస్తాయి కానీ, పోలీసులే చేతుల్లోకి తీసుకుని గోళ్లు పీకి, చిత్రహింసలు పెట్టి చంపేస్తారా అని జగ ప్రశ్నించారు.
హెబియస్ కార్పస్ పిటిషన్తోనే గుట్టు రట్టు
సాయికృష్ణను పోలీసులు కొట్టి చంపేసిన తర్వాత గుట్టుచప్పుడు కాకుండా దహనం చేశారని, ఆపై సాయికృష్ణ తల్లితో సర్దుబాటు కోసం అధికార తెలుగుదేశం, జనసేన పార్టీల ఇన్ఛార్జ్లను రంగంలోకి దించి బేరసారాలు ఆడించారని జగన్ సంచలన ఆరోపణలు చేశారు. పోలీసుల డ్రామాను గమనించిన తల్లి జూన్ 2న ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేయడం, వైఎస్సార్సీపీ అండగా నిలబడటంతోనే పోలీసుల గుట్టు రట్టయిందని పేర్కొన్నారు. కోర్టుల జోక్యంతో గత్యంతరం లేకనే సీఐని సస్పెండ్ చేశారని మండిపడ్డారు.
ఈ తల్లి ఆవేదన నీకు కనిపించడం లేదా చంద్రబాబూ?
— YSR Congress Party (@YSRCParty) June 18, 2026
కాపు యువకుడు, జనసేన కార్యకర్త సాయికృష్ణ సమాచారం గురించి అడిగితే.. నీ కొడుకు ఫొటోకి దండ వేసుకో అని సీఐ హేళనగా చెప్తాడా?
మే 9 నుంచి ఆ తల్లి ప్రతిరోజూ పోలీస్టేషన్ చుట్టూ తిరుగుతూనే ఉంది.. అయినా న్యాయం దొరకలేదు @APPOLICE100 తీరుని… pic.twitter.com/Kje8MiAg0o
సస్పెన్షన్ కాదు.. మర్డర్ కేసు పెట్టాల్సిందే!
ఒక దేశంలో సామాన్యుడి ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని, హత్య చేసిన అధికారిని అరెస్ట్ చేయకుండా కేవలం తాత్కాలికంగా విధుల్లోంచి తప్పించే సస్పెన్షన్ వేటు వేయడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని జగన్ విమర్శించారు. ఒక హత్య కేసును దాచిపెట్టేందుకు ఏసీపీ, సీపీ, డీజీపీ వరకు అందరూ కలిసికట్టుగా ప్రయత్నించారు. నేరస్తులను వెనకేసుకొస్తున్న విజయవాడ సీపీ, రాష్ట్ర డీజీపీలతో పాటు బాధ్యులైన ప్రతి ఒక్కరిపై ఐపీసీ సెక్షన్ 302 కింద మర్డర్ కేసు నమోదు చేయాలి అని తేల్చి చెప్పారు. ఈ అక్రమాలను కప్పిపుచ్చేందుకు ఒక ఎస్పీ స్థాయి అధికారి చేత విచారణ జరిపించడం లా అండ్ ఆర్డర్తో చెలగాటం ఆడటమేనన్నారు.
బాధిత కుటుంబానికి వైఎస్సార్సీపీ అండ..
సచివాలయం, డీజీపీ కార్యాలయం, ముఖ్యమంత్రి నివాసానికి కూతవేటు దూరంలోనే ఇలాంటి ఘోరాలు జరుగుతుంటే రాష్ట్రంలో ప్రజలు పోలీస్ స్టేషన్కు వెళ్లాలంటేనే భయపడే పరిస్థితి వచ్చిందని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు దగ్గరుండి కొంతమంది పోలీసు అధికారులను ప్రోత్సహించడం వల్లే ఇలాంటి లాకప్డెత్లు జరుగుతున్నాయని విమర్శించారు. ఈ కేసులో నిజాలు బయటకు రావాలంటే కేంద్ర దర్యాప్తు సంస్థ రంగంలోకి దిగాల్సిందేనని స్పష్టం చేశారు. సాయికృష్ణ కుటుంబానికి, అలాగే ఆత్మహత్య చేసుకున్న క్రాంతికుమార్ కుటుంబానికి న్యాయం జరిగే వరకు, వారి తరఫున కోర్టుల్లో జరిగే న్యాయపోరాటంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా తోడుంటుందని జగన్ హామీ ఇచ్చారు.
ట్రెండింగ్ వార్తలు






















