PM Modi AP Tour: ఏపీకి ప్రధాని మోదీ, సత్యసాయి ఎయిర్ పోర్టులో ఘన స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు
భారత ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం నాడు ఆంధ్రప్రదేశ్కు వచ్చారు. పుట్టపర్తి సత్యసాయి శత జయంతి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ప్రధాని మోదీ ఇక్కడికి వచ్చారు.

PM Modi AP Tour: భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం (నవంబర్ 19) నాడు ఆంధ్రప్రదేశ్ పర్యటనకు విచ్చేశారు. ఆయన భగవాన్ సత్య సాయి శత జయంతి కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇవాళ ఉదయం రాష్ట్రానికి చేరుకున్నారు. ఉదయం 9:30 గంటలకు సత్య సాయి ఎయిర్పోర్ట్లో ప్రధాని నరేంద్ర మోదీకి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా కొందరు మంత్రులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఉదయం 11 గంటల నుంచి మొదలైన సత్య సాయి శత జయంతి కార్యక్రమంలో ప్రధాని మోదీతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొనున్నారు.

సత్యసాయి నాణెం, పోస్టల్ స్టాంప్ ఆవిష్కరణ
కుల్వంత్ హాలులో సత్యసాయి మహా సమాధిని ప్రధాని మోదీ దర్శించుకోనున్నారు. హిల్ వ్యూ ఆడిటోరియంను సైతం మోదీ సందర్శిస్తారు. సత్యసాయి జీవితం, సేవలకు స్మారకంగా రూపొందించిన రూ.100 నాణెంతో పాటు, రూ. 4 పోస్టల్ స్టాంప్ను ప్రధాని మోదీ ఆవిష్కరించనున్నారు.
ప్రధాని మోదీ కార్యక్రమం ముగిసిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు కడప జిల్లా పర్యటనకు బయలుదేరతారు. మధ్యాహ్నం వేళ ఆయన కడప జిల్లాలోని కమలాపురం నియోజకవర్గ పరిధిలో ఏర్పాటు చేసిన అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో పాల్గొనున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రైతుల ఖాతాలలో నేరుగా నిధులను జమ చేస్తారు. రైతు సంక్షేమానికి ఉద్దేశించిన ఈ ముఖ్య కార్యక్రమం తరువాత, కమలాపురం నియోజకవర్గంలోనే చంద్రబాబు టీడీపీ పార్టీ శ్రేణులతో కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు.
కడప జిల్లాలో తన కార్యక్రమాలు ముగించుకుని చంద్రబాబు రాత్రి 8 గంటలకు తిరిగి అమరావతి చేరుకోనున్నారు. రాజధానికి వచ్చిన తర్వాత, ఆయన నేరుగా సీపీఐ నేత రామకృష్ణ నివాసానికి వెళ్తారు. సీపీఐ నేత రామకృష్ణ కుమార్తె వివాహం సందర్భంగా వారి ఇంటికి వెళ్లి ముఖ్యమంత్రి చంద్రబాబు నూతన వధూవరులను ఆశీర్వదించనున్నారు.






















