YV Subbareddy SIT questions: హైదరాబాద్లో వైవీ సుబ్బారెడ్డిని ప్రశ్నిస్తున్న సుప్రీంకోర్టు సిట్ - కల్తీ నెయ్యి స్కాంలో కీలక చర్యల దిశగా అడుగులు
YV Subba Reddy: టీటీడీ కల్తీ నెయ్యి కేసులో సుప్రీంకోర్టు సిట్ టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డిని ప్రశ్నిస్తోంది. తనకు అనారోగ్యమని చెప్పడంతో ఆయన ఇంటికే సిట్ బృందం వెళ్లింది.

Supreme Court SIT questions former TTD chairman YV Subba Reddy : తిరుమల తిరుపతి దేవస్థానం లో లడ్డూ తయారీలో ఉపయోగించిన కల్తీ నెయ్యి కుంభకోణంకేసులో మాజీ చైర్మన్, వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డిని సుప్రీంకోర్టు నియమించిన సిట్ ప్రశ్నస్తోంది. హైదరాబాద్లోని ఆయన నివాసంలోనే సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే సుబ్బారెడ్డి మాజీ పర్సనల్ అసిస్టెం చిన్న అప్పన్నను అరెస్టు చేసి వివరాలు సేకరించారు. అతని వాంగ్మూలం ఆధారంగా సుబ్బారెడ్డిని మరింత లోతుగా ప్రశ్నిస్తోంది. సీబీఐ పర్యవేక్షణలో జరుగుతున్న ఈ దర్యాప్తు ప్రపంచ ప్రసిద్ధ తిరుమల లడ్డూల పవిత్రతను దెబ్బతీసిన అంశంపై జరుగుతోంది.
ఐదేళ్ల పాటు కల్తీ నెయ్యితో శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారు చేశారని ఆరోపణలు
తిరుమలలో 2019-2024 వరకు కల్తీ పదార్థాలతో కలిపిన కల్తీ నెయ్యిని ఉపయోగించారని సిట్ రిపోర్టు స్పష్టం చేసింది. ఈ కుంభకోణంలో టీటీడీకు సరఫరా చేసిన 68 లక్షల కిలోల నెయ్యి విలువ రూ. 250 కోట్లకు పైగా ఉంది. ఒక్క చుక్క కూడా పాలు సేకరించకుండా తయారు చేసిన ఈ ఈ కల్తీ నెయ్యిని కాంట్రాక్టర్లు సరఫరా చేసి, అక్రమ లాభాలు దండుకున్నారు. కాంట్రాక్టర్ల నుంచి మాజీ చైర్మన్ సుబ్బారెడ్డి సన్నిహితుడైన చిన్న అప్పన్నకు రూ. 4.69 కోట్లు హవాలా లావా ద్వారా ఇచ్చినట్లుగా గుర్తించారు. అప్పన్నను నవంబర్ 11న అరెస్టు చేసిన సిట్, అతని ఖాతాలో ఈ మొత్తం ఎలా వచ్చిందో, దాని మూలం ఏమిటో విచారించింది.
సుబ్బారెడ్డి పీఏ చిన్న అప్పన్నకు ఐదు కోట్ల వరకూ కాంట్రాక్టర్ల నుంచి లంచాలు
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ కాలంలో (2019-2024) తితిదే చైర్మన్గా పనిచేసిన సుబ్బారెడ్డి, ఈ కుంభకోణంలో పాల్పడ్డారా అనే అంశంపై ఇప్పుడు ప్రధాన దృష్టి పెట్టింది. సుబ్బారెడ్డి తీరు అనుమానాస్పదంగా ఉందని సిట్ కోర్టుకు తెలిపింది. సిట్ ఇప్పటికే మాజీ అదనపు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (ఈఓ) ఎ.వి. ధర్మారెడ్డిని కూడా విచారించింది. ఈ దర్యాప్తు ఫలితాలు త్వరలోనే ఏపీ హైకోర్టుకు సమర్పించనున్నారు.
అనారోగ్యం అని చెప్పడంతో ఇంటికే వెళ్లి ప్రశ్నిస్తున్న సిట్
నాలుగేళ్ల పాటు వైవీ సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్ గా ఉన్నారు. అయితే తమ హయాంలో పూర్తి స్థాయిలో నాణ్యమైన నెయ్యి కొనుగోలు చేశామని ఆయన చెబుతున్నారు. కానీ విచారణలో భిన్నమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సిట్ అధికారులు ఎప్పుడు పిలిచినా ఆయన ఆయన ఏదో ఓ కారణం చెప్పి డుమ్మాకొడుతున్నారు. 13వ తేదీన రావాలని నోటీసులు జారీ చేసినా తనకు ఆరోగ్యం బాగోలేదన్నారు. దాంతో హైదరాబాద్ లోని ఆయన ఇంటి వద్దనే ప్రశ్నిస్తున్నారు. ఆయన బ్యాంక్ లావాదేవీల వివరాలు సిట్ అడిగితే.. ఆ అంశంపైనా కోర్టుకెళ్లారు.




















