Andhra Pradesh Liquor Scam: ఏపీ మద్యం కుంభకోణంలో కీలక మలుపు - ఎ2 వాసుదేవరెడ్డి అరెస్ట్
Vasudeva Reddy arrest: ఏపీ లిక్కర్ స్కాంలో ఏ2 వాసుదేవరెడ్డిని సిట్ అరెస్టు చేసింది. ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండి ఐదేళ్లు పని చేశారు.

SIT arrests A2 Vasudeva Reddy in AP liquor scam: ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన సుమారు 3,500 కోట్ల మద్యం కుంభకోణం కేసులో కీలక నిందితుడు, ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండి వాసుదేవరెడ్డిని సిట్ అరెస్టు చేసింది. బేవరేజెస్ కార్పొరేషన్ ఎండిగా ఉన్న సమయంలో వాసుదేవరెడ్డి, మద్యం టెండర్లు, ధరల నిర్ణయంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని సిట్ నిర్ధారించింది. ముఖ్యంగా అటోమేటెడ్ సప్లై సిస్టమ్ను రద్దు చేసి, మ్యాన్యువల్ విధానాన్ని ప్రవేశపెట్టడం ద్వారా తమకు నచ్చిన కంపెనీలకు ఆర్డర్లు ఇచ్చేలా చక్రం తిప్పారు. పాపులర్ బ్రాండ్లను పక్కన పెట్టి, నాసిరకం బ్రాండ్లను ప్రోత్సహించడం ద్వారా భారీగా కమీషన్లు వసూలు చేశారని సిట్ గుర్తించింది.
అప్రూవర్గా మారేందుకు వాసుదేవరెడ్డి ప్రయత్నం
విచారణ సమయంలో వాసుదేవరెడ్డి అప్రూవర్గా మారి, ఈ కుంభకోణం వెనుక ఉన్న అసలు సూత్రధారుల పేర్లను వెల్లడించేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. అయితే, ఆయన ఇచ్చిన సమాచారంలో కొన్ని కీలక విషయాలను దాచిపెట్టడం, అలాగే సహ నిందితులు ఆయన బెయిల్ను వ్యతిరేకించడంతో పరిస్థితి తారుమారైంది. సిట్ సేకరించిన డాక్యుమెంటరీ ఆధారాలు, డిజిటల్ సాక్ష్యాలు ఆయన ప్రమేయాన్ని బలపరుస్తుండటంతో, ఇక ఆయనను కస్టడీలోకి తీసుకుని విచారించడమే సరైన మార్గమని అధికారులు భావించి అరెస్ట్ చేశారు. వాసుదేవరెడ్డిని అరెస్ట్ చేసిన సిట్ అధికారులు, ఆయనను విజయవాడలోని ఏసీబీ కోర్టులో హాజరుపరిచనున్నారు.
అప్రూవర్ గా మారేందుకు అంగీకరించని సీబీఐ కోర్టు
మద్యం కుంభకోణం కేసులో కీలక నిందితులుగా ఉన్న వాసుదేవరెడ్డి (A2), సత్యప్రసాద్ (A3) తాము చేసిన అక్రమాల్లోని గుట్టు విప్పేందుకు, శిక్ష నుంచి తప్పించుకునేందుకు అప్రూవర్లు గా మారేందుకు గతంలో ఏసీబీ కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. తమకు క్షమాభిక్ష ప్రసాదిస్తే ఈ స్కామ్ వెనుక ఉన్న అసలు సూత్రధారులు, రాజకీయ పెద్దల వివరాలను వెల్లడిస్తామని వారు ప్రతిపాదించారు. అయితే, ఏసీబీ కోర్టు ఈ విన్నపాన్ని తోసిపుచ్చుతూ, వీరు కుంభకోణానికి తల వంటి వారని, ప్రధాన పాత్రధారులైన వీరికి ముందస్తు బెయిల్ ఇవ్వడం, అప్రూవర్లుగా మార్చడం వల్ల విచారణ ప్రభావితం అవుతుందని స్పష్టం చేసింది. బెయిల్ ఇస్తేనే అప్రూవర్లుగా మారుతామని వారు కోర్టుతో బేరసారాలు ఆడుతున్నట్లు కనిపిస్తోందని న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారి విజ్ఞప్తిని తిరస్కరించింది.
హైకోర్టులో వీరికి ముందస్తు బెయిల్ ఇవ్వొద్దని పిటిషన్ దాఖలు చేసిన చెవిరెడ్డి
ఈ కేసులో మరో కీలక మలుపు ఏమిటంటే, సహ నిందితుడైన వైఎస్ఆర్సీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వీరికి బెయిల్ ఇవ్వొద్దని కోర్టులో పిటిషన్ వేశారు. వారు అప్రూవర్లుగా మారి తమ తప్పులను ఇతరులపైకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారని, ప్రధాన పాత్రధారులైన వీరికి బెయిల్ ఇవ్వకూడదని వాదించారు.























