Konaseema Latest News: అమలాపురం వైసీపీలో విశ్వరూప్ కుటుంబం ఎవ్వరినీ ఎదగనీయడం లేదా..
Konaseema Latest News: అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో వైసీపీకి విశ్వరూప్ ఫ్యామిలీ తప్ప వేరే దిక్కులేని పరిస్థితి ఉందా? లేక పార్టీలో వేరే ఎవర్నీ ఎదగనివ్వడం లేదా.? కోనసీమలో జరుగుతున్న చర్చ ఇదేనా?

Konaseema Latest News: మర్రి చెట్టు నీడలో ఏ చెట్టూ ఎదగదంటారు.. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో వటవృక్షంతో మాజీ మంత్రి విశ్వరూప్ కుటుంబాన్ని ఆ పార్టీలోనే కొందరు నేతలే ఉదాహరణగా చెప్పుకుంటున్న వేళ.. వైసీపీ అధిష్టానం అందరికీ షాక్ ఇచ్చే న్యూస్ విడుదల చేసింది. వైసీపీ అధికారంలో వచ్చిన తరువాత మంత్రి పదవిని దక్కించుకున్న విశ్వరూప్.. ఆ తరువాత మంత్రివర్గ విస్తరణలో వైసీపీలో హేమాహేమీలుగా ముద్ర వేసుకున్న పేర్ని నాని, కొడాలి నాని లాంటి వాళ్లే మంత్రి పదవిని కోల్పోయినా విశ్వరూప్ మాత్రం మళ్లీ మంత్రి పదవిని కాపాడుకోవడమే కాకుండా ఇంకా మంచి పోర్టుపోలియో దక్కించుకున్నారు. పార్టీ టిక్కెట్టు విషయంలో టిక్కెట్టు దక్కించుకున్న విశ్వరూప్ ఓటమి తరువాత వైసీపీ జిల్లా అధ్యక్షునిగా పదవిని సొంతం చేసుకున్నారు. ఇదిలా ఉంటే తాజాగా వైసీపీ విడుదల చేసిన ఓ ప్రకటనలో అమలాపురం పార్లమెంటు నియోజకవర్గ సమన్వయకర్తగా విశ్వరూప్, అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా ఆయన తనయుడు శ్రీకాంత్ను నియమిస్తూ పార్టీ అధినేత జగన్ నిర్ణయం తీసుకోవడం తీవ్ర చర్చనీయాంశం అయ్యింది..
పోటీ అనుకున్నవారిని తొక్కేస్తున్నారా..?
ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం అయిన అమలాపురంలో విశ్వరూప్ పార్టీలో ఎస్సీ సామాజికవర్గానికి చెందిన ద్వితీయశ్రేణి నాయకులను ఎవ్వరినీ ఎదగనీయరన్న ఆరోపణలు ఆ పార్టీ నుంచే వినిపిస్తున్నాయి. రేపన్నాక పార్టీలో టిక్కెట్టు రేసులో అడ్డువస్తారన్న ఆలోచనతోనే ఆర్థికంగా, సామాజికంగా బలం ఉన్నవారు ఎవ్వరైనా పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తుంటే ఏదోలా వారిని తన అనుచరగణంతో అడ్డుకట్టవేసే ప్రయత్నం చేస్తుంటారన్న విమర్శలున్నాయి.
స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీలో చురుగ్గా ఉండే దళిత నాయకులకు పోటీచేసే అవకాశం కల్పించకపోవడం, వారిని కలుపుకోకుండా పక్కనపెట్టడం వంటి చర్యలుతో చేదు అనుభవాన్ని చవిచూసిన వారు చాలా సందర్భాల్లో అసంతృప్తిని వ్యక్తం చేసిన సందర్భాలు నియోజకవర్గంలో కనిపించాయి. ఈ కారణంచేతనే చాలా మంది పార్టీని వీడి వేరే పార్టీల్లోకి వెళ్లిపోయారని చెబుతుంటారు. తాజాగా వైసీపీ ప్రకటించిన పార్టీ పదవుల్లో పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్త పదవులు దక్కించుకోవడంపై వైసీపీలోనే అసంతృప్తి జ్వాలలు నివురుగప్పిన నిప్పులా మారాయి.
వైసీపీకు విశ్వరూప్ కుటుంబం తప్ప వేరే ఆప్షన్ లేదా..
కోనసీమలో దళిత వర్గం నుంచి వైసీపీలో కీలక నేతగా ఉన్న పినిపే విశ్వరూప్ ఆపార్టీ చాలా ప్రాధాన్యతనిస్తూ వచ్చింది. ఈ క్రమంలోనే దళిత వర్గంలోనే చాలా మంది ఔత్సాహిక కీలక నాయకులున్నా వారు కేవలం పార్టీ కార్యకర్తలుగానే మిగిలిపోతున్నామన్నది వారి వాదన కాగా తాజా పరిణామాలను పరిశీలిస్తే కోనసీమలో ఎస్సీ వర్గం నుంచి విశ్వరూప్ కుటుంబం తప్ప వేరే ఆప్షన్ లేదన్నట్లుగా రెండు కీలక పదవులు కట్టబెట్టడం చూస్తే ఇదే ఆలోచనలో ఉందా అన్నది స్పష్టం అవుతుంది. అయితే పార్టీ తీసుకున్న ఈనిర్ణయం పట్లా సొంత పార్టీలోనే విమర్శలు ఎదురవుతున్నాయి..
హత్యకేసులో నిందితునిగా ఉన్నా..
విశ్వరూప్ తనయుడు శ్రీకాంత్ వాలంటీర్ జనుపల్లి దుర్గాప్రసాద్ అనే వాలంటీరు హత్యకేసులో అభియోగాలను ఎదుర్కొన్నారు. ఈ కేసులో ప్రధాన నిందితునిగా ఉన్నారు కూడా. అయితే అవేమీ వైసీపీ పట్టించుకోకుండా తాజాగా ప్రకటించిన పదవుల్లో డాక్టర్ శ్రీకాంత్కు కీలకమైన అమలాపురం అసెంబ్లీ నియోజవర్గ సమన్వయకర్త పదవిని కట్టబెట్టింది. గత కొన్ని రోజులుగా జిల్లా అధ్యక్షుడ్ని మారుస్తారన్న ప్రచారం జోరుగా సాగినా అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా విశ్వరూప్నే కొనసాగిస్తారని, ఆయన తనయుడు శ్రీకాంత్ విషయంలో వాలంటీర్ హత్య కేసు అభియోగాలు అడ్డంకిగా మారతాయని అంతా భావించారు. అయితే వైసీపీ అధిష్టానం నిర్ణయం స్థానికంగా చర్చకు దారితీసింది.
గత ఎన్నికల్లో కుటుంబంలోనే పోటీ..
మొన్నటి సాధారణ ఎన్నికల్లో అమలాపురం వైసీపీ అసెంబ్లీ టిక్కెట్టు విషయంలో తండ్రీ కొడుకుల మధ్య వార్ నడిచిందని గుసగుసలు వినిపించాయి. ఒక దశలో తన తండ్రి అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా టిక్కెటు తనకే కేటాయించాలని శ్రీకాంత్ కోరినట్లు వార్తలు వచ్చాయి. అయితే అమలాపురంలో పోటీచేసేది నేనే అంటూ విశ్వరూప్ ప్రకటించడంతో ఆ వివాదం సద్దుమణిగింది. అయితే ఆ తరువాత శ్రీకాంత్ నియోజకవర్గానికి దూరం అయ్యారు. అయితే దీనిపై కూడా పలు విమర్శలు వచ్చాయి. తండ్రికి అమలాపురం, కుమారునికి పి.గన్నవరం టిక్కెట్టు కేటాయిస్తారనే ఈతరహా మైండ్ గేమ్ ఆడారన్న గుసగుసలు వినిపించాయి..
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

