Vanagaveeti Mohana Ranga Statue : వంగవీటి రంగా విగ్రహం ఏర్పాటుపై వివాదం-అంతర్వేదిలో ఉద్రిక్తత
Vangaveeti Mohana Ranga Statue : వంగవీటి మోహనరంగా విగ్రహ ఏర్పాటు విషయంలో కోనసీమలో ఉద్రిక్తత చోటుచేసుకోగా కాకినాడ జిల్లాలో విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు.

Vangaveeti Mohana Ranga Statue: అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం సఖినేటిపల్లి మండలం అంతర్వేది కర గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేస్తోన్న కాపు నాయకుడు వంగవీట మోహన రంగా విగ్రహ ఏర్పాటుపై తీవ్ర వివాదం రేగింది. రెండు సామాజికవర్గాల మధ్య తలెత్తిన ఈ వివాదంపై ఎటువంటి శాంతిభద్రతలకు విఘాతం కలుగకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ఇదిలా ఉంటే కాకినాడ జిల్లా యు.కొత్తపల్లిలోని చెరువు పక్కన ఉన్నటువంటి వంగవీటి మోహనరంగా విగ్రహాన్ని బుధవారం తెల్లవారు జామున గుర్తు తెలియని వ్యక్తులు ధ్వసం చేయడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. నిందితులను పట్టకుని కఠినంగా శిక్షించాలంటూ ఆ ప్రాంతవాసులు ఆందోళన బాటపట్టారు.
విగ్రహ ఏర్పాటులో అసలు ఎందుకు వివాదం..
సఖినేటిపల్లి మండలం అంతర్వేదికర గ్రామంలో స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ విగ్రహాన్ని అంతర్వేదికర కాపునాయుకులు, గ్రామస్థులు కలిసి ఏర్పాటు చేశారు..మరో సామాజికవర్గం చెందినవారు అక్కడ పెట్టటం కుదరదఅంటూ అడ్డుకున్నారు.. అంతే కాకుండా ఎటువంటి అనుమతులు లేకుండా విగ్రహ ఏర్పాటు కుదరదని ఫిర్యాదులు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగి ఏర్పాటు చేసిన రంగా విగ్రహాన్నిపెట్టడానికి ఏ విధమైన అనుమతులు లేవంటూ తొలగించారు.. దీంతో ఒక్కసారిగా వివాదం రాజుకుంది.. విగ్రహం తొలగించడంతో తెల్లవారుజాము నుంచి కాపునేతలు, గ్రామస్తులు ఆందోళన చేపట్టి పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు..
విగ్రహాన్ని మళ్లీ అక్కడే ఏర్పాటు చేయడంతో ఉద్రిక్తత..
విగ్రహాన్ని తొలగించిన చోటే మళ్లీ అదే చోట పెట్టడానికి ప్రయత్నించిన కాపు నాయకులు పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడ ఒకసారి గా ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఎట్టి పరిస్థితిలో విగ్రహం పెట్టాలని పట్టు పట్టిన కాపునాయకులు ప్రతిపాదనను పోలీసులు అంగీకరించలేదు. అయితే ఒకసారిగా తరలివచ్చిన కాపు సామాజిక యువకులు, మహిళలు అదే చోట బలవంతంగా విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.. ఈక్రమంలోనే పోలీసులకు యువకులకు మధ్య తోపులాట జరిగింది.. దీంతో ఒక్కసారిగా అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొనడంతో అదనపు బలగాలను రప్పించిన పోలీసులు పరిస్థితిని అదుపులో తీసుకువచ్చారు.. మొత్తం మీద పోలీస్ పహార మధ్య స్థానిక ఎమ్మెల్యే దేవ వరప్రసాద్, కొత్తపేట డిఎస్పి సుంకర మురళీకృష్ణ, అమలాపురంఆర్డీవో కే మాధవి కలిసి రెండు వర్గాలను శాంతింపచేశారు. రెండు వర్గాలను కూర్చోబెట్టి మాట్లాడారు.. ఎట్టి పరిస్థితిలో రంగా విగ్రహాన్ని అక్కడ ఏర్పాటు చేయాలని కాపు నాయకులు పట్టుబడుతుండగా మరో సామాజిక వర్గం కుదరదని పట్టుబట్టడంతో ఇంకా గ్రామంలో ఉద్రికత్త పరిస్థితులు కొనసాగుతోంది..
గ్రామంలో కొనసాగుతోన్న పోలీస్ పికెటింగ్..
రంగా విగ్రహ ఏర్పాటు విషయంలో రెండు సామాజికవర్గాల మధ్య వివాదం తలెత్తి ఉద్రిక్త పరిస్థతి తలెత్తడంతో అంతర్వేది కర గ్రామంలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు..విషయం తెలుసుకున్న వంగవీటి మోహన్ రంగ తనయుడు రాధ పరిస్థితిని ఆరా తీశారు.. అలాగే రంగా మిత్రమండలి అధ్యక్షుడు కాలపాళెంబుజ్జి పరిస్థితిని సమీక్షిస్తున్నారు..
యు.కొత్తపల్లిలో రంగా విగ్రహం ధ్వంసంతో ఉద్రిక్తత..
పిఠాపురం నియోజకవర్గంలోని యు.కొత్తపల్లిలో వంగవీటి మోహనరంగా విగ్రహాన్ని బుధవారం తెల్లవారు జామున గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేయడంతో ఆ గ్రామంలో ఉ్రదిక్తత చోటుచేసుకుంది. విగ్రహాన్ని ధ్వంస రచన చేసిన వారిని పట్టుకుని కఠినంగా శిక్షించాలంటూ ఆ గ్రామంలోని కొందరు ఆందోళనకు దిగారు. దీంతోపోలీసులు రంగ ప్రవేశం చేసి దర్యాప్తు ప్రారంభించి విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.





















