MP Putta Mahesh Kumar: మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. దుష్ప్రచారాలు నమ్మవద్దన్న ఎంపీ పుట్టా మహేష్ కుమార్
Moinabad Farmhouse Case | మొయినాబాద్ పార్టీలో తాను ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదని, స్నేహితుడు ఆహ్వానిస్తే వెళ్లి వచ్చానని టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తెలిపారు. దుష్ప్రచారం నమ్మవద్దని సూచించారు.

TDP MP Putta Mahesh Kumar | హైదరాబాద్/ఏలూరు: హైదరాబాద్ మొయినాబాద్ ఫాం హౌస్లో శనివారం రాత్రి జరిగిన పార్టీపై ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ స్పందించారు. ఈ కేసులో తనపై వచ్చిన కథనాలను టీడీపీ ఎంపీ తీవ్రంగా ఖండించారు. ఆదివారం పోలీసు విచారణ ముగించుకుని హైదరాబాద్ లోని తన నివాసానికి చేరుకున్న పుట్టా మహేష్ కుమార్ మీడియాకు వీడియో ద్వారా ఒక ప్రకటన విడుదల చేశారు.
‘నేను ఎలాంటి వ్యక్తినో రెండేళ్లుగా ఏలూరు ప్రజలు, టీడీపీ నేతలు, కార్యకర్తలు అందరికీ తెలుసు. నాకు ఎటువంటి దురలవాట్లు లేవు. ఏ తప్పు చేయలేదు. కేవలం ఒక స్నేహితుడు పిలిస్తే కలవడానికి మాత్రమే మొయినాబాద్ వెళ్ళాను. కలిసి తిరిగి వచ్చే సమయంలో జరిగిన కొన్ని సంఘటనలపై మీడియాలో రకరకాల కథనాలు వచ్చాయి. ఆ విషయాలను ఎవ్వరూ నమ్మవద్దు. ఈ కేసులో పోలీసు విచారణకు పూర్తిగా సహకరిస్తాను. పూర్తి వివరాలతో త్వరలో ప్రజల ముందుకు వస్తానని’ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తెలిపారు. ఎప్పటికైనా నిజం గెలుస్తుందని, తన విషయంలో ఎటువంటి ఆందోళన చెందవద్దని ప్రజలకు, అభిమానులకు టీడీపీ ఎంపీ తన ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.
ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్..
మొయినాబాద్ డ్రగ్స్ కేసులో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ పేరు రావడంపై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. డ్రగ్స్ వంటి అసాంఘిక కార్యకలాపాల్లో ఎవరున్నా ఉపేక్షించే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తూ, ఈ ఘటనపై సమగ్ర నివేదిక సమర్పించాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావును ఆదేశించారు. వ్యక్తుల తప్పుల వల్ల పార్టీ ప్రతిష్ట దెబ్బతినకూడదని పార్టీ అధిష్ఠానం భావిస్తోంది.
తెలంగాణ పోలీసుల ప్రకటన వెలువడిన వెంటనే, పుట్టా మహేష్ను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశించారు. చంద్రబాబు సూచన మేరకు పల్లా శ్రీనివాసరావు ఎంపీ పుట్టా మహేష్ కుమార్కు షోకాజ్ నోటీసులు జారీ చేస్తూ, ఐదు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని గడువు విధించారు. పార్టీ గౌరవానికి భంగం కలిగించే ఈ వ్యవహారంలో ఎంపీ ఇచ్చే సంజాయిషీని బట్టి తదుపరి కఠిన క్రమశిక్షణ చర్యలు ఉంటాయని పల్లా వెల్లడించారు. అంతవరకు ఆయన ఎటువంటి రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనకూడదని స్పష్టం చేశారు.
అసలేం జరిగిందంటే..
హైదరాబాద్ శివార్లలోని మొయినాబాద్లోని పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్హౌస్లో శనివారం రాత్రి జరిగిన పార్టీపై 'ఈగల్ ఫోర్స్' మెరుపు దాడులు చేసింది. పార్టీకి హాజరైన వారికి జరిపిన టెస్టుల్లో ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్, మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సహా ఆరుగురికి డ్రగ్స్ పాజిటివ్గా తేలింది. రక్త పరీక్షలో ఎంపీకి పాజిటివ్ వచ్చినట్లు ఎస్పీ గిరిధర్ తెలిపారు. దాడుల సమయంలో నిందితులు తుపాకీతో గాలిలోకి కాల్పులు జరిపి పోలీసులను భయపెట్టే ప్రయత్నం చేయడం ఉద్రిక్తతకు దారితీసింది. ఘటనా స్థలంలో రివాల్వర్, డ్రగ్స్ స్వాధీనం చేసుకున్న పోలీసులు, ప్రజాప్రతినిధుల ప్రమేయంపై విచారణను వేగవంతం చేశారు. ఈ కేసులో ఎంపీ పుట్టా మహేష్ కు బెయిల్ రావడంతో ఆయన విడుదలయ్యారు.
ట్రెండింగ్ వార్తలు
























