TDP MP Putta Mahesh Kumar: డ్రగ్స్ తీసుకున్న టీడీపీ ఎంపీ రాజీనామాకు వైసీపీ డిమాండ్.. చంద్రబాబు చిత్తశుద్ధిపై షర్మిల ప్రశ్నలు
డ్రగ్స్ టెస్టులో పాజిటివ్గా తేలిన టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని, ఆయనను వెంటనే రాజీనామా చేయించి చర్యలు తీసుకోవాలని వైఎస్ షర్మిల, వైసీపీ నేతలు డిమాండ్ చేశారు.

అమరావతి: హైదరాబాద్ మొయినాబాద్ ఫామ్హౌస్ డ్రగ్స్ కేసులో ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్కు పాజిటివ్గా తేలడం ఆ పార్టీకి చిక్కులు తెచ్చిపెట్టింది. డ్రగ్స్ తీసుకునే వ్యక్తులకు ప్రజాప్రతినిధులుగా కొనసాగే నైతిక హక్కు లేదంటూ వైఎస్సార్ సీపీ నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. ఈ వ్యవహారంపై మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు సహా పలువురు నేతలు ఘాటుగా స్పందించారు.
చంద్రబాబు హాట్-లైన్ రాజకీయాలు: కాకాణి గోవర్ధన్ రెడ్డి
టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్కు డ్రగ్స్ టెస్టులో పాజిటివ్ వచ్చినట్లు స్వయంగా ఎస్పీ ధృవీకరించారని, అటువంటి వ్యక్తికి ఎంపీగా కొనసాగే అర్హత లేదని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ, స్పష్టం చేశారు. ‘ఎంపీ పుట్టా మహేష్ వెంట ఉన్న వ్యక్తులు పోలీసులపైనే కాల్పులు జరిపారు. ఇంతటి తీవ్రమైన డ్రగ్స్ కేసులో తన పార్టీ ఎంపీని కాపాడేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. దీనికోసం ఆయన హాట్-లైన్ రాజకీయాలు చేస్తూ వ్యవస్థలను ప్రభావితం చేయాలని చూస్తున్నారు. ఇది సాదాసీదా విషయం కాదు. దేశ భద్రత, యువత భవిష్యత్తుకు సంబంధించిన అంశం’ అని మాజీ మంత్రి కాకాణి మండిపడ్డారు.
తెలుగు డ్రగ్స్ పార్టీగా టీడీపీ: సుధాకర్ బాబు విమర్శలు
మాజీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు టీడీపీపై విమర్శలు గుప్పించారు. ‘టీడీపీ కాస్తా ఇప్పుడు 'తెలుగు డ్రగ్స్ పార్టీ'గా మారిపోయింది. ఒక లోక్సభ ఎంపీ అయి ఉండి, మద్యం తాగుతూ డ్రగ్స్ తీసుకోవడం సిగ్గుచేటు. క్యారెక్టర్ లేని వ్యక్తులను చంద్రబాబు లోక్సభకు పంపారు. అసలు పార్లమెంట్లో అడుగుపెట్టే నైతిక హక్కు పుట్టా మహేష్కు లేదు. ఆయన వెంటనే తన ఎంపీ పదవికి రాజీనామా చేయాలి’ అని సుధాకర్ బాబు డిమాండ్ చేశారు.
వైసీపీ ఆరోపణలు, డిమాండ్లు ఇవే..
డ్రగ్స్ కేసులో నిందితుడిగా తేలిన వ్యక్తి ప్రజా ప్రతినిధిగా ఉండకూడదు. డ్రగ్స్ పార్టీలో పోలీసులపై కాల్పులు జరపడం నేరపూరిత చర్య. టీడీపీ ఎంపీని రక్షించేందుకు ఏపీ ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నిస్తోందని ఆరోపించారు
'చంద్రబాబు చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి': వైఎస్ షర్మిల
విజయనగరం పర్యటనలో ఉన్న ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి మొయినాబాద్ ఫాంహౌస్ డ్రగ్స్ కేసుపై తీవ్రంగా స్పందించారు. ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాలు జరుగుతుంటే, బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఇక్కడ కొకైన్తో విందులు చేస్తూ పట్టుబడటం అత్యంత సిగ్గుచేటని ఆమె మండిపడ్డారు. డ్రగ్స్ టెస్టులో పాజిటివ్ వచ్చిన ఎంపీపై ఏపీ సీఎం చంద్రబాబు ఎలాంటి చర్యలు తీసుకుంటారని ఆమె ప్రశ్నించారు. డ్రగ్స్ తీసుకుంటూ దొరికిపోయిన ఎంపీ యువతకు ఏం సందేశం ఇస్తున్నారని, ఆయనను వెంటనే పదవి నుంచి తొలగించి, పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని షర్మిల డిమాండ్ చేశారు. డ్రగ్స్పై నిజంగా ఉక్కుపాదం మోపాలనే ఆలోచన ఉంటే, ఎంపీపై కఠిన చర్యలు తీసుకుని చంద్రబాబు తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని ఆమె సవాల్ విసిరారు.
అసలేం జరిగిందంటే..
హైదరాబాద్ శివార్లలోని మొయినాబాద్ అజీజ్నగర్లో గల బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్హౌస్లో డ్రగ్స్ పార్టీ జరిగింది. శనివారం రాత్రి ఈగల్ (EAGLE) ఫోర్స్ నిర్వహించిన ఈ మెరుపు దాడుల్లో డ్రగ్స్ వినియోగం జరిగినట్లు గుర్తించారు. ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి సహా మొత్తం ఆరుగురికి డ్రగ్స్ పరీక్షల్లో పాజిటివ్ వచ్చినట్లు ఈగల్ ఫోర్స్ ఎస్పీ ఆర్. గిరిధర్ వెల్లడించారు. ఇందులో పుట్టా మహేష్ కుమార్కు ప్రాథమిక యూరిన్ టెస్టులో నెగటివ్ వచ్చినప్పటికీ, తదుపరి నిర్వహించిన రక్త పరీక్షల్లో (Blood Test) పాజిటివ్ అని తేలిందని అధికారులు స్పష్టం చేశారు. వీరితో పాటు నమిత్, రితేష్ రెడ్డి, కౌశిక్ రవి, అర్జున్ రెడ్డిలకు కూడా డ్రగ్స్ పాజిటివ్ అని తేలింది.
ఈ దాడి సమయంలో పోలీసులను భయపెట్టేందుకు నిందితులు తుపాకీతో నాలుగు రౌండ్లు గాలిలోకి కాల్పులు జరిపి తీవ్ర ఉద్రిక్తత సృష్టించారు. ఫాం హౌస్లో రివాల్వర్, డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న ఈ కేసులో ప్రజాప్రతినిధుల ప్రమేయం ఉండటంతో పోలీసులు విచారణను మరింత వేగవంతం చేశారు.
ట్రెండింగ్ వార్తలు























