West Godavari Latest News: దిండి చించినాడ వంతెనపై మరమ్మత్తు పనుల నిమిత్తం వాహనాల రాకపోకలు నిషేదం అమలు విషయంలో వరదలు ఆటంకంగా మారాయి.. వంతెనకు కొంత వరకు ప్రత్యామ్నాయంగా ఉన్న సఖినేటిపల్లి - నర్సాపురం రేవుపై పంటు దాటింపులు వరదల ఉద్ధృతి వల్ల నిలిపివేయడంతో ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని మరమ్మత్తు పనులు వాయిదా వేశారు.. అయితే వరదలు తగ్గుముఖం పట్టడంతో మరళా వంతెన మరమ్మత్తులు పునప్రారంభించేందుకు పచ్చజెండా ఊపారు.. ఈ నేపథ్యంలోనే ఈ నెల 25, 26 తేదీల్లో మొత్తం వంతెనపై ఎటువంటి రాకపోకలు చేయకుండా రెండు రోజులుపాటు నిషేదం విధించారు.. ఈమేరకు అంబేడ్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్.మహేష్కుమార్ ప్రకటన విడుదల చేశారు..
జిల్లా కలెక్టర్ ఏం చెప్పారంటే...
వశిష్ట నదిపాయ పై 216 జాతీయ రహదారిని కలుపుతూ నిర్మించిన దిండి - చించినాడ వంతెన మరమ్మత్తు పనులు నిర్దేశిత గడువులో పూర్తికాని దృష్ట్యా మరో రెండు రోజులపాటు వంతెన పై పూర్తిగా రాకపోకలను నిలుపుదల చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. చించినాడ వంతెన వద్ద మరమ్మతు పనులు బేరింగ్ రీప్లేస్మెంట్ పనుల కోసం ట్రాఫిక్ బ్లాక్ నియంత్రణ కొరకు ఈనెల 25, 26 వ తేదీలలో వరుసగా రెండు రోజులు ఉదయం 10 గంటలనుండి రాత్రి 10 గంటల వరకు పూర్తిగా రాకపోకలు నిలుపుదల సమయం పొడిగించినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ నేపధ్యంలో దిండి చించినాడ 216 జాతీయ రహదారి వెంబడి పర్య టించే వాహనదారులు ఈ విషయాన్ని గమనించి పూర్తిగా సహకరిస్తూ ఈ రెండు రోజులపాటు ఈ వంతెన పై రాకపోకలు పూర్తిగా నిషేధించినందున ప్రత్యా మ్నాయమార్గాల ద్వారా వారి గమ్యస్థానాలకు చేరుకోవాలని ఆయన ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.
కీలక మార్గంలో ఆటంకాలు
పశ్చిమగోదావరి జిల్లా నుంచి అంబేడ్కర్ కోనసీమ జిల్లాకు రావాలన్నా పోవాలన్నా వశిష్ట నదిపై ఉన్న దిండి చించినాడ వంతన అత్యంత కీలకం.. ఈ వంతెన మరమ్మత్తులకు గురికావడంతో ఈ రెండు జిల్లాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్నారు. గోదావరికి వరదలు పోటెత్తడంతో ఈ పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. సఖినేటిపల్లి, నర్సాపురం రేవు ద్వారా చాలా మంది అటు ఇటూ రాకపోకలు సాగించే పరిస్థితి ఉండగా వరదల వల్ల ఈరేవు మూసివేశారు అధికారులు. దీంతో రావులపాలె నుంచి చుట్టు తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో గంట ప్రయాణం కాస్త రెండు నుంచి మూడు గంటల సమయం పడుతోంది. అంతే కాదు ప్రయాణ ఖర్చుల భారం కూడా తడిసి మోపెడవుతోంది.
అధికారులు ప్రకటించిన రెండు రోజుల వ్యవధిలో అయినా వంతెన మరమ్మత్తు పనులు వేగంగా పూర్తిచేసి కనీసం లైట్ మోటార్ వెహికల్స్, ద్విచక్రవాహనాలను వెళ్లనిచ్చేలా అవకాశం కల్పించాలని ప్రజలు కోరుతున్నారు. ముఖ్యంగా రోజూ ఈ వంతెనపై ప్రయాణించే విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోందని వాపోతున్నారు..