Rajahmundry Tiger: రాజమండ్రిలో పాడుబడిన ఇంట్లో పులి .. చుట్టూ బోన్లు, సిబ్బంది మోహరింపు.. క్లైమాక్స్లో ఏం జరగుతుంది ?
Rajahmundry: రాజమండ్రి శివారులో పాడుబడిన ఇల్లు.. చుట్టూ అటవీ శాఖ అధికారుల నిఘా.. ఏ క్షణమైనా బోనులో చిక్కుతుందన్న ఉత్కంఠ. ఈ పులి ఆపరేషన్ ఏపీ ప్రజల్ని టెన్షన్కు గురి చేస్తోంది.

Rajahmundry Tiger Searching: తూర్పుగోదావరి జిల్లా ప్రజలను గత కొద్ది రోజులుగా కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న పులి ఎపిసోడ్ ఇప్పుడు క్లైమాక్స్కు చేరుకుంది. దట్టమైన అటవీ ప్రాంతం నుంచి జనారణ్యంలోకి ప్రవేశించిన పెద్దపులి ప్రస్తుతం రాయవరం మండలంలోని కూర్మాపురంలోని ఒక పాడుబడిన పాత ఇంట్లో గుర్రుపెట్టి నిద్రపోతోంది. చుట్టూ ఎత్తైన గోడలు, పిచ్చి మొక్కలు మొలచిన ఆ శిథిల భవనం చుట్టూ ఇప్పుడు ట్రాప్ వేశారు. పులి లోపలే ఉందన్న పక్కా సమాచారంతో అటవీ శాఖ అధికారులు ఆ ప్రాంతాన్ని మొత్తం తమ ఆధీనంలోకి తీసుకున్నారు.
పదిహేను రోజుల క్రితం ప్రత్తిపాడు శివార్లలో మొదలైన ఈ పులి సంచారం, క్రమంగా అనపర్తి, రామచంద్రాపురం పరిసర ప్రాంతాలకు వ్యాపించింది. వెళ్ళిన ప్రతిచోటా పశువులపై దాడులు చేస్తూ, తన పాదముద్రలతో గ్రామస్తుల్లో వణుకు పుట్టించింది. అయితే, ఎక్కడా చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్న ఈ బెంగాల్ టైగర్, చివరికి గురువారం రాత్రి ఆహారం కోసం వేటాడుతూ దారి తప్పి ఈ పాడుబడిన పాత ఇంట్లోకి ప్రవేశించింది. ఆ విషయాన్ని గమనించిన స్థానికులు వెంటనే అధికారులకు సమాచారం అందించడంతో ఈ బిగ్ క్యాట్ ఆపరేషన్ కీలక మలుపు తిరిగింది.
పులి ఆ ఇంట్లో నిద్రపోతున్నట్లుగా అనుమానిస్తున్నరు. పెద్ద ఎత్తున గురక శబ్దం వస్తోంది. అందుకే ప్రస్తుతం ఆ పాడుబడిన ఇంటి ప్రధాన ద్వారం వద్ద , వెనుక వైపున అటవీ శాఖ భారీ బోన్లను ఏర్పాటు చేసింది. పులికి ఇష్టమైన ఆహారాన్ని ఎరగా వేసి, అది ఎప్పుడు బయటకు వస్తుందా అని అధికారులు వేచి చూస్తున్నారు. ఇంటి చుట్టూ ఎవరూ రాకుండా 144 సెక్షన్ తరహాలో ఆంక్షలు విధించారు. నైట్ విజన్ కెమెరాలు, డ్రోన్ల సాయంతో ప్రతి కదలికను పర్యవేక్షిస్తున్నారు. పులి గాండ్రింపులు వినబడుతుండటంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భయాందోళనలో ఉన్నప్పటికీ, అది బందీ అవ్వడం ఖాయమన్న ఆశతో ఉన్నారు.
పులిని పట్టుకోవడం అధికారులకు సవాలుగా మారింది. ఆ ఇల్లు శిథిలావస్థలో ఉండటం, లోపల గదులు ఎక్కువగా ఉండటంతో పులి ఎక్కడ నక్కి ఉందో స్పష్టంగా తెలియడం లేదు. నేరుగా లోపలికి వెళ్లి మత్తు మందు ఇవ్వడం ప్రమాదకరమని భావించిన అధికారులు, అది స్వచ్ఛందంగా బోనులోకి వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. ఒకవేళ అది బోనులోకి రాకపోతే, ఇంటి పైకప్పు నుంచి రంధ్రం చేసి మత్తు మందు ఇచ్చే ప్రత్యామ్నాయ మార్గాలను కూడా పరిశీలిస్తున్నారు.
జిల్లా యంత్రాంగం మొత్తం ఇప్పుడు ఈ పాడుబడిన ఇంటిపైనే దృష్టి సారించింది. గతంలో కూడా కాకినాడ జిల్లాలో ఇలాంటి పులి సంచారం నెలల తరబడి సాగి, అధికారులను ముప్పుతిప్పలు పెట్టింది. అందుకే ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ బంధించి, సురక్షితంగా అటవీ ప్రాంతానికి తరలించాలని అధికారులు పట్టుదలతో ఉన్నారు. మరికొన్ని గంటల్లోనే ఈ ఉత్కంఠకు తెర పడే అవకాశం కనిపిస్తోంది.























