Andhra New Map: ఏపీ కొత్త మ్యాప్ విడుదల - మధ్యలో అమరావతి!
Andhra Map: అమరావతిని రాష్ట్ర ఏకైక రాజధానిగా పేర్కొంటూ ఆంధ్రప్రదేశ్ కొత్త అధికారిక మ్యాప్ను ప్రభుత్వం విడుదల చేసింది. 28 జిల్లాల మధ్యలో అమరావతి ఉంది.

New map of Andhra has been released: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లు-2026కు పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదం తెలిపి, రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించడంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతిని రాష్ట్ర ఏకైక రాజధానిగా స్పష్టంగా పేర్కొంటూ ఆంధ్రప్రదేశ్ కొత్త అధికారిక మ్యాప్ను శనివారం విడుదల చేసింది. గత కొంతకాలంగా రాజధాని విషయంలో కొనసాగిన సందిగ్ధతకు ఈ మ్యాప్ విడుదలతో అధికారికంగా తెరపడినట్లయింది.
ఈ కొత్త మ్యాప్లో పరిపాలనా సౌలభ్యం కోసం జిల్లాల పునర్విభజనలో భాగంగా మార్పులు చోటుచేసుకున్నాయి. గతంలో రాష్ట్రంలో 26 జిల్లాలు ఉండగా, తాజాగా మార్కాపురం, పోలవరం లను కొత్త జిల్లాలుగా గుర్తిస్తూ మ్యాప్ను రూపొందించారు. దీంతో ఆంధ్రప్రదేశ్లో మొత్తం జిల్లాల సంఖ్య 28 కి చేరింది. భౌగోళిక విస్తీర్ణం, జనాభా ప్రాతిపదికన వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ఈ కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం గతంలోనే నిర్ణయం తీసుకుంది.
ప్రకాశం జిల్లా నుంచి మార్కాపురంను, అలాగే గోదావరి జిల్లాల సరిహద్దు, ఏజెన్సీ ప్రాంతాలను కలుపుతూ పోలవరంను విడదీసి కొత్త జిల్లా కేంద్రాలుగా ప్రకటించారు. కొత్త మ్యాప్లో అమరావతిని రాజధానిగా (Capital City) హైలైట్ చేస్తూ, అన్ని జిల్లాల సరిహద్దులను శాస్త్రీయంగా పొందుపరిచారు. అన్ని జిల్లాలకు మధ్యలో అమరావతి ఉంది. విపత్తుల నిర్వహణ సంస్థ ఈ మ్యాప్ను విడుదల చేయడం వల్ల రాబోయే కాలంలో ప్రకృతి వైపరీత్యాల అంచనా, సహాయక చర్యల సమన్వయం మరింత సులభతరం కానుంది.
అమరావతితో ఆంధ్రప్రదేశ్ కొత్త మ్యాప్. 28 జిల్లాల ఆంధ్రప్రదేశ్ మ్యాప్ను ఏపీ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఈ మ్యాప్ విడుదల చేసింది. pic.twitter.com/TPRl4SIDaP
— BSB2020 (@ManaTDPfamily) April 4, 2026
ఈ పరిణామంపై రాజకీయ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది. అమరావతికి పార్లమెంట్ సాక్షిగా చట్టబద్ధత లభించడం మరియు అధికారిక మ్యాప్లో 28 జిల్లాల పొందిక ఉండటం రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి సూచిక అని ప్రభుత్వం పేర్కొంటోంది. కొత్తగా ఏర్పడిన మార్కాపురం, పోలవరం జిల్లాల్లో ఇప్పటికే పరిపాలనా యంత్రాంగం ఏర్పాటుకు కసరత్తు మొదలైంది. ఈ అధికారిక మ్యాప్ను అన్ని ప్రభుత్వ శాఖలు, విద్యా సంస్థలు ప్రామాణికంగా తీసుకోవాలని అధికారులు సూచించారు.























