Nandamuri Padmaja Passes Away: నందమూరి కుటుంబంలో విషాదం, జయకృష్ణ భార్య పద్మజ కన్నుమూత.. చంద్రబాబు సంతాపం
నందమూరి కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. దివంగత ఎన్టీఆర్ పెద్ద కుమారుడు జయకృష్ణ భార్య పద్మజ కన్నుమూశారు. ఏపీ సీఎం చంద్రబాబు సంతాపం తెలిపారు.

Nandamuri Padmaja Passes Away | హైదరాబాద్: నందమూరి కుటుంబం (NTR Family)లో విషాదం చోటుచేసుకుంది. ఉమ్మడి ఏపీ మాజీ సీఎం, దివంగత నందమూరి తారక రామారావు పెద్ద కోడలు, నందమూరి జయకృష్ణ సతీమణి పద్మజ మంగళవారం (ఆగస్టు 19న) తెల్లవారుజామున కన్నుమూశారు. పద్మజ వయసు 73 సంవత్సరాలు కాగా, ఆమె గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగడంతో నేటి తెల్లవారుజామున హుటాహుటీన ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో చికిత్స పొందుతూ నందమూరి పద్మజ తుదిశ్వాస విడిచారు. జయకృష్ణ, పద్మజ దంపతుల కుమారుడే హీరో చైతన్యకృష్ణ.
నందమూరి పద్మజ దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు చెల్లెలు. పద్మజ మృతితో నందమూరి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మధాహ్ననికి హైదరాబాద్కు చేరుకోనున్నారు. రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి ఢిల్లీ నుండి హైదరాబాద్కు రానున్నారని సమాచారం. నందమూరి కుటుంబసభ్యులు ఒక్కొక్కరుగా హైదరాబాద్కు చేరుకుంటున్నారు.
ఏపీ సీఎం చంద్రబాబు సంతాపం..
బావమరిది నందమూరి జయకృష్ణ సతీమణి, దగ్గుబాటి వెంకటేశ్వరరావు సోదరి పద్మజ మరణించారని తెలిసి దిగ్భ్రాంతికి లోనయ్యాను. ఈ ఘటన మా కుటుంబంలో విషాదం నింపింది. పద్మజ ఆత్మకు శాంతిని చేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను.
— N Chandrababu Naidu (@ncbn) August 19, 2025
ఏపీ మంత్రి లోకేష్ సంతాపం
మామయ్య నందమూరి జయకృష్ణ సతీమణి, నందమూరి పద్మజ అత్త కన్ను మూశారన్న వార్త తనను తీవ్ర ఆవేదనకు గురిచేసిందన్నారు ఏపీ మంత్రి లోకేష్. మాకు అన్నివేళలా అండగా నిలిచే పద్మజ అత్త ఆకస్మిక మృతి మా కుటుంబానికి తీరని లోటు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్ధించారు.
పెద్దమ్మ లేని లోటు తీరనిది..
పెద్దమ్మ పద్మజ హఠాన్మరణంతో నారా బ్రాహ్మణి దిగ్భ్రాంతికి గురయ్యారు. పెద్దమ్మ ఆత్మకు శాంతి కలగాలని, కన్నీటి నివాళులు అర్పిస్తున్నాను. పెద్దమ్మ లేని లోటు తీరనిది. ఈ విషాద సమయంలో పెదనాన్న నందమూరి జయకృష్ణ, కుటుంబ సభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని దేవుడిని ప్రార్థించారు.






















