AP Liquor Scam: దుబాయ్, ముంబైకు సిట్ టీమ్స్ - ఏపీ లిక్కర్ స్కామ్లో వచ్చే వారం సంచలనాలు?
AP liquor scam: ఏపీ లిక్కర్ స్కాంలో వారం, పది రోజుల్లో కీలక పరిణామాలు చోటు చేసుకోనున్నాయి. పది రోజుల్లో మరో నలుగురు నిందితుల్ని చేర్చి అదనపు చార్జిషీటు దాఖలు చేయనున్నారు.

AP liquor scam take place new Turn in ten days : ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ ను దర్యాప్తు చేస్తున్న సిట్ బృందం దుబాయ్, ముంబైలకూ వెళ్లినట్లుగా తెలుస్తోంది. దుబాయ్ లో లిక్కర్ స్కామ్ నిందితులు షెల్టర్ తీసుకున్నారు. అదే సమయంలో అక్కడికి పెద్ద ఎత్తున మనీ లాండరింగ్ చేసినట్లుగా గుర్తించారు. వాటి ఆధారాలతో పాటు అక్కడ నిందితులు ఏం చేస్తున్నారో పూర్తి సమాచారం తెలుసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. అదే సమయంలో షెల్ కంపెనీల ద్వారా మనీ లాండరింగ్ కు పాల్పడినట్లుగా గుర్తించారు. ఆ షెల్ కంపెనీల ఆచూకీ, డైరక్టర్ల వివరాలు.. వాటి గురించి పూర్తి సమాచారం సేకరించేందుకు ఓ టీం ముంబై వెళ్లింది. ఆయా రాష్ట్రాల ప్రభుత్వాల సహకారంతో మొత్తం నగదు చెలామణి గుట్టును సిట్ టీములు బయటకు లాగుతున్నాయి.
మరో వైపు దర్యాప్తు కీలక దశకు చేరుకోవడంతో.. డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు..సిట్ దర్యాప్తు బృందం పురోగతిని వివరించింది. తాజాగా బయటపడిన ఆధారాలు.. ఇంకా సోదాలు చేయాల్సిన ప్రాంతాలతో పాటు..మరో పది రోజుల్లో దాఖలు చేయాల్సిన అదనపు చార్జిషీటు గురించి కూడా చర్చించినట్లుగా తెలుస్తోంది. మరో నలుగురు పాత్ర బయటపడిందని.. వారిపై పక్కా ఆధారాలు ఉన్నాయని వారిని ఈ స్కామ్లో బలంగా చూపిస్తూ అదనపు చార్జిషీటు దాఖలుచేయాల్సిన అంశంపై చర్చించారు. ఈ అంశంలో ఎలాంటి చిన్న ఆధారాన్ని వదిలి పెట్టకుండా దర్యాప్తు చేయాలని.. సూత్రధారుల్ని కూడా అరెస్టు చేయాలని భావిస్తున్నారు.
మరో పది రోజుల్లో దాఖలు చేయబోతున్న అదనపు చార్జిషీట్ లో ఉండబోయే నలుగురు కీలక వ్యక్తులు ఎవరన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పేరు ఎక్కువగా ప్రచారంలోకి వస్తోంది. కారణం ఏదైనా లిక్కర్ స్కామ్ పై ఆయన ఎక్కువగా మాట్లాడటం లేదు. చాలా మంది వైసీపీ నేతలు జైలుకెళ్తున్నారు. వారిని జగన్ వెళ్లి పరామర్శిస్తున్నారు కానీ లిక్కర్ కేసులో అరెస్టు అయిన వారిని మాత్రం పరామర్శించేందుకు వెళ్లడం లేదు. తనకు అత్యంత సన్నిహితులు అయిన మిథున్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ్ రెడ్డి లాంటి వాళ్లు అరెస్టు అయినా వారిని పరామర్శించేందుకు జగన్ వెళ్లకపోవడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది.
ఈ లిక్కర్ కేసులో తన పేరు కూడా వినిపిస్తూండటం వల్లనే జగన్ వెళ్లడం లేదని చెబుతున్నారు. జగన్ అరెస్టు ప్రచారం కారమంగా ఇప్పటికే తన లీగల్ టీమ్ ను అప్రమత్తం చేసినట్లుగా తెలుస్తోంది. చార్జిషీటులో ఇప్పటికే తనపేరు ప్రస్తావించారు. కానీ ఇంకా నిందితుడిగా చేర్చలేదు. ఇలా నిందితుడిగా చేర్చిన వెంటనే ముందస్తు బెయిల్ పిటిషన్లు.. క్వాష్ పిటిషన్లు వేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నట్లుగా చెబుతున్నారు. జగన్ ను నిందితుడిగా చేర్చినా అరెస్టు చేసే అవకాశాలు ఉండవు. ఇతర నిందితులకు.. అన్ని రకాల న్యాయపరమైన అవకాశాలు కల్పించినట్లే జగన్ కూడా సుప్రీంకోర్టు వరకూ వెళ్లే అవకాశాలు కల్పించిన తర్వాతనే అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు. మొత్తంగా వచ్చే పది రోజుల్లో.. లిక్కర్ స్కామ్లో సంచలన పరిణామాలు ఉండబోతున్నాయని ఏపీలో గట్టిగా ప్రచారం జరుగుతోంది.




















