Jagan PM Meet : రాష్ట్ర సమస్యలే ఎజెండా - ప్రధానితో జగన్ భేటీ
ప్రధానమంత్రి నరేంద్రమోదీతో సీఎం జగన్ దాదాపుగా గంట సేపు భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీతో సీఎం జగన్ సమావేశం అయ్యారు. దాదాపుగా గంట సేపు వీరి మధ్య భేటీ జరిగింది. రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ అంశాలతో పాటు ఆర్థిక పరమైన సాయం కోసం ప్రత్యేకంగా ప్రధానిని జగన్ అభ్యర్థించినట్లుగా తెలుస్తోంది.
పోలవరం సవరించిన అంచనాలను ఆమోదించండి !
పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి సవరించిన అంచనాలకు ఆమోదం తెలపాలని మరోసారి ప్రధానిని జగన్కోరారు. 2019, ఫిబ్రవరి 11న జరిగిన టెక్నికల్ అడ్వైజరీ కమిటీ పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలను రూ. 55, 548.87 కోట్లుగా నిర్ధారించిందని జగన్ ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. ప్రాజెక్టును పూర్తిచేయడానికి ఇంకా రూ.31,188 కోట్లు ఖర్చు చేయాల్సిన అవసరం ఉందన్నారు. నిర్మాణ పనులకోసం రూ.8,590 కోట్లు, భూ సేకరణ – పునరావాసంకోసం రూ.22,598 కోట్లు ఖర్చవుతుందని జగన్ ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో కాంపొనెంట్ వైజ్గా బిల్లుల చెల్లింపు ఇబ్బందుల వల్ల రూ.905 కోట్ల బిల్లులను ప్రాజెక్ట్అథారిటీ తిరస్కరించింది. కాంపొనెంట్వారీగా కాకుండా మొత్తం ప్రాజెక్టులో జరిగే పనులను పరిగణనలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పోలవరం ప్రాజెక్ట్ కారణంగా నిర్వాసితులైన కుటుంబాలకు ఎలాంటి ఆలస్యం లేకుండా ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీని నేరుగా వారి బ్యాంకు ఖాతాలకు బదిలీచేయాలన్నారు.
ఆహారభద్రతా చట్టం వల్ల ఏపీకి నష్టం !
జాతీయ ఆహార భద్రతా చట్టం కింద లబ్ధిదారుల గుర్తింపుకోసం అనుసరిస్తున్న విధానం లోపభూయిష్టంగా ఉంది. దీనివల్ల ఏపీకి అన్యాయం జరుగుతోంది. రాష్ట్రంలో 1.45 కోట్ల కుటుంబాలకు రేషన్ అందిస్తుంటే, ఇందులో కేంద్రం నుంచి కేవలం 0.89 కోట్ల కుటుంబాలకు మాత్రమే అందుతోంది. మిగిలిన 0.56 కోట్ల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా నిధులు ఖర్చుచేస్తూ రేషన్ ఇస్తోంది. ఆర్థికంగా బాగున్న మహారాష్ట్ర, కర్ణాటక లాంటి రాష్ట్రాల్లో గ్రామీణ ప్రాంతాల్లోని 75శాతం, పట్టణ–నగర ప్రాంతాల్లోని 50శాతం ప్రజలకు రేషన్ను కేంద్ర ప్రభుత్వం ఇస్తుంటే, ఏపీలో మాత్రం 61శాతం రూరల్, 41శాతం అర్బన్ ప్రజలకు మాత్రమే రేషన్ను ఇస్తున్నారు. దీన్ని వెంటనే సరిదిద్దాలని కోరారు.
బీచ్ శాండ్ ఏపీఎండీసీకి కేటాయించాలి !
అలాగే భోగాపురం అంతర్జాతీయ ఎయిర్పోర్టుకు సంబంధించి సైట్ క్లియరెన్స్ అప్రూవల్ గడువు ముగిసింది. తాజాగా క్లియరెన్స్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. పునర్విభజన చట్టం ప్రకారం కడపలో సమగ్ర స్టీల్ప్లాంట్ ఏర్పాటు చేస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. స్టీల్ప్లాంట్ ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ మెకాన్ ఇప్పటికీ తన నివేదికను ఇవ్వలేదన్నారు. రాయలసీమ, కడప జిల్లా ప్రజల ఆకాంక్షలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వమే స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు నడుంబిగించింది. దీనికోసం వైయస్సార్ స్టీల్ కార్పొరేషన్ లిమిటెడ్ను ఏర్పాటు చేసింది. ఈమేరకు కేంద్రం తోడ్పాటు అందించాలని కోరారు. ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు బీచ్శాండ్ మినరల్స్ ప్రాంతాలను కేటాయించాలని విజ్ఞప్ తిచేశారు. 16 చోట్ల బీచ్శాండ్ ఉన్న ప్రాంతాలను ఏపీఎండీసీకి కేటాయించాలని కోరారు. అటమిక్ ఎనర్జీ విభాగం ఇప్పటికే 2 ప్రాంతాలను ఏపీఎండీసీకి కేటాయించింది. దీనికి సంబంధించిన అనుమతులు కూడా పెండింగులో ఉన్నాయన్నారు. మిగిలిన 14 ప్రాంతాలకు సంబంధించి కేటాయింపులు, అనుమతులకు ఆదేశాలివ్వాలని కోరారు.
విభజన లోటును భర్తీ చేయాలి !
ఏపీలో నిర్మిస్తున్న పన్నెండు మెడికల్ కాలేజీలకు అనుమతులు వెంటనే ఇవ్వాలని జగన్ కోరారు. విభజన కారణంగా రెవిన్యూ గ్యాప్ను భర్తీకోసం ఇచ్చిన నిధుల్లో తీవ్ర వ్యత్యాసం ఉందన్నారు. 10వ వేతన సంఘం సిఫార్సుల అమలులో భాగంగా ఇవ్వాల్సి బకాయిల రూపంలో తదితర కార్యక్రమాల వల్ల దాదాపు రూ.32,625.25 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం తన సొంతంగా ఖర్చు చేసింది. ఈ నిధులను రెవిన్యూ లోటు కింద భర్తీచేయాలని కోరారు. రాష్ట్ర విభజన వల్ల 58.32శాతం జనాభా విభజిత ఆంధ్రప్రదేశ్కురాగా, కేవలం 46శాతం రెవిన్యూ మాత్రమే దక్కింది. ఉమ్మడి రాష్ట్రంలో కేవలం 9శాతం జానాభా ఉన్న హైదరాబాద్ నగరంను కోల్పోవడంద్వారా ఆ నగరం నుంచి అందే 38శాతం రెవిన్యూను కోల్పోయామని ప్రధానికి గుర్తు చేశారు. కోవిడ్.. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గణనీయంగా దెబ్బతీసిందని దాదాపు రూ. 33,478 కోట్ల మేర ఆదాయం కోవిడ్ కారణంగా రాకుండాపోయిందన్నారు.
గత ప్రభుత్వం హయాంలో అదనపు రుణాలకు అనుమతిచ్చారు. ఇప్పుడు ఆ అదనపు రుణాలకు సరిపడా... రాష్ట్ర రుణపరిమితుల్లో కోత విధిస్తామని అంటున్నారు. దీనివల్ల రాష్ట్రానికి నష్టం వాటిల్లుతుందన్నారు. . విధించిన రుణ పరిమితిని మించి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ రుణాలు తీసుకురాలేదు. ఈ పరిస్థితులను పరిగణలోకి తీసుకుని రుణాల పరిమితిని సవరించాల్సిందిగా కోరారు.
తెలంగాణ నుంచి కరెంట్ బకాయిలు ఇప్పించండి !
తెలంగాణ డిస్కంలు రూ.6,455.76 కోట్ల రూపాయలను ఏపీ జెన్కోకు చెల్లించాల్సి ఉంది. రాష్ట్రాన్ని విభజించిన నాటినుంచీ జూన్ 2017 వరకూ తెలంగాణ డిస్కంలకు చేసిన విద్యుత్ పంపిణీకి సంబంధించి ఈమొత్తాన్ని ఇవ్వాల్సి ఉంది. ఈ డబ్బును ఇప్పించాల్సిందిగా కూడా ప్రధానిని జగన్ కోరారు. తీవ్ర రుణభారాన్ని ఎదుర్కొంటున్న ఏపీ విద్యుత్ పంపిణీ సంస్థలు తమ ఆర్థిక నిర్వహణకోసం ఈ డబ్బు చాలా అవసరమన్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
and tablets