CM Revanth Reddy: మదీనా ప్రమాద మృతుల కుటుంబాలకు పరిహారం చెక్ లు అందించిన సీఎం రేవంత్ రెడ్డి
Madina Bus Accident | మదీనా ప్రమాద మృతుల కుటుంబాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిహారం చెక్ లు అందించారు. 44 మంది మృతుల కుటుంబ సభ్యులకు 5 లక్షల పరిహారం అందించారు.

Telangana Government | హైదరాబాద్: సౌదీ అరేబియాలోని మదీనా సమీపంలో జరిగిన ఘోర బస్సు ప్రమాద బాధితులను తెలంగాణ ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆదుకుంది. 2025 నవంబర్ 17న జరిగిన ఈ ప్రమాదంలో 44 మంది హైదరాబాద్ వాసులు సజీవ దహనం కావడం రాష్ట్రవ్యాప్తంగా విషాదం నింపినంది. ఈ ప్రమాద మృతుల కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సెక్రటేరియట్లో పరిహారం చెక్కులను పంపిణీ చేశారు. మరణించిన 44 మంది కుటుంబాలకు ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయల చొప్పున, అలాగే తీవ్రంగా గాయపడిన వ్యక్తికి 3 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు.

కేబినెట్ ప్రత్యేక నిర్ణయంతో ఆర్థిక సాయం..
ఈ కార్యక్రమంలో మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అజారుద్దీన్, ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, నాంపల్లి ఎమ్మెల్యే మహమ్మద్ మాజిద్ హుస్సేన్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. బాధితుల కుటుంబాల్లో భరోసా నింపేందుకే వారిని నేరుగా సెక్రటేరియట్కు ఆహ్వానించి ఈ సహాయాన్ని అందించినట్లు ప్రభుత్వం పేర్కొంది. సాధారణంగా దేశం వెలుపల జరిగే ప్రమాదాలకు ప్రభుత్వాలు పరిహారం చెల్లించే నిబంధనలు లేకపోయినప్పటికీ, బాధితుల దయనీయ స్థితిని చూసి కేబినెట్ ప్రత్యేక నిర్ణయం తీసుకుందని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ‘ప్రమాదం జరిగిన వెంటనే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి సహాయక చర్యలను పర్యవేక్షించాం. పరిస్థితిని స్వయంగా సమీక్షించేందుకు మంత్రి అజారుద్దీన్ను మదీనాకు పంపించాం. ప్రభుత్వం ఎప్పుడూ మీకు అండగా ఉంటుందనే నమ్మకాన్ని కల్పించడమే మా ప్రాధాన్యత," అని అన్నారు. గతంలో నాంపల్లి అగ్ని ప్రమాద బాధితులను కూడా ఇదే విధంగా ఆదుకున్నామని’ ఆయన గుర్తు చేశారు.
ముస్లిం సోదరులకు అత్యంత పవిత్రమైన ఈ నెలలో, అందరూ కలిసిమెలిసి ముందుకు సాగాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. అలాగే తన వ్యక్తిగత సేవా కార్యక్రమాల గురించి ప్రస్తావిస్తూ, 2009 నుండి కొడంగల్ నియోజకవర్గంలోని ప్రతి మండలం నుండి ఒకరిని తన సొంత ఖర్చులతో హజ్ యాత్రకు పంపిస్తున్నట్లు తెలిపారు. "ఇది మీ ప్రభుత్వం, మీ కష్టసుఖాల్లో తోడుగా ఉంటుంది, ఎవరూ ఆందోళన చెందవద్దు" అని బాధితులకు సీఎం రేవంత్ రెడ్డి ధైర్యాన్ని చెప్పారు.
























