YS Jagan: బెంగుళూరు అంకుల్ అంటూ వైఎస్ జగన్పై సెటైర్ వేసిన హోంమంత్రి అనిత , సోషల్ మీడియా ట్రోలింగ్తో డిలీట్
YS Jagan: అంకుల్ అంటూ వైఎస్ జగన్పై సెటైర్లు పోస్టు చేసిన ఏపీ హోంమినిస్టర్ అనిత విపరీతమైన ట్రోలింగ్కు గురయ్యారు. అనంతరం ఆ పోస్టును డిలీట్ చేశారు.

- గృహమంత్రి వంగలపూడి అనిత సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్ట్ పెట్టారు.
- రిపబ్లిక్ డే కి జగన్ హాజరు కాలేదని మార్ఫ్ చేసిన ఫోటో పోస్ట్ చేశారు.
- విమర్శల నేపథ్యంలో అనిత వెంటనే ఆ పోస్ట్ ను తొలగించారు.
- నేతలు అధినేతల దృష్టి ఆకర్షించడానికి హద్దులు దాటుతున్నారు.
ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత కు డైనమిక్ లేడీగా ఇమేజ్ ఉంది. అలాగేటీడీపీకి నమ్మిన బంటుగా కూడా పేరు ఉంది. అయితే కాస్త అత్యుత్సాహంతో ఆమె లేదా ఆమె సోషల్ మీడియా టీమ్ సోషల్ మీడియాలో హ్యాండిల్లో పెట్టిన ఒక పోస్ట్ తీవ్రంగా ట్రోలింగ్కి గురైంది. రిపబ్లిక్ డే రోజు అనవసరంగా మాజీ సీఎంను జగన్ మోహన్ రెడ్డి పై సెటైర్ వేయబోయి తానే ట్రోలింగ్కు గురయ్యారు అనిత. దీంతో సోషల్ మీడియాలోని ఒక పోస్ట్ విషయంలో వెనకడుగు వేసి చేసిన ఒక పోస్ట్ డిలీట్ చెయ్యాల్సి వచ్చింది.
రిపబ్లిక్ డే రోజు ఏపీలో కనపడని జగన్
ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి రిపబ్లిక్ డే రోజు ఏపీలో కనపడలేదు. పార్టీ సీనియర్ నేతలే జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం కానిచ్చేశారు. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడిచింది. కానీ దీన్ని బేస్గా చేసుకుని హోంమంత్రి అనిత సోషల్ మీడియా అకౌంట్ లో కనిపించిన ఒక పోస్ట్ తీవ్ర సంచలనంగా మారింది.
"బెంగుళూరు అంకుల్.." అంటూ అనిత పోస్ట్
ఏపీలో రిపబ్లిక్ డేకి దూరంగా ఉన్న జగన్ ని ఉద్దేశిస్తూ అనిత "బెంగుళూరు అంకుల్.. ఈ రోజు జెండా వందనం ఎందుకు చేయలేదు " అంటూ ఒక సెటైర్ ను అలానే జగన్ కు చెందిన మార్ఫ్ చేసిన ఫోటో పోస్ట్ చేశారు. స్వయంగా ఆమే చేశారో లేక ఆమె టీమ్ చేసిందో తెలియదు గానీ దీనిపై ఒక్క వైసీపీ నుంచే కాక అన్ని వర్గాల నుంచి విమర్శలు వచ్చాయి. వైసీపీ సోషల్ మీడియా నుంచి అలాగే జగన్ అభిమానులు అయితే అనిత పోస్ట్ పై తీవ్రంగా మండిపడ్డారు సామాన్య జనం కూడా హోం మంత్రి స్థాయిలో ఉండి మార్ఫ్ చేసిన ఫోటోలు వాడడం ఏంటి అంటూ గట్టిగానే విమర్శలు గుప్పించారు. మార్ఫింగ్ అనేది సొసైటీ లో తీవ్రమైన సమస్యగా మారిన ప్రస్తుత సమాజం లో హోం మంత్రి స్థాయి వ్యక్తి హోదా కు ఇది సరికాదని సోషల్ మీడియా పోస్ట్ లు కామెంట్స్ ఎక్కువ కావడంతో అనిత సోషల్ మీడియా నుంచి ఆ పోస్ట్ మాయమైంది.
అధినేతల కళ్ళల్లో పడేందుకు హద్దులు దాటుతున్న నేతలు
నిజానికి ఈ పద్దతి ఇంతకు ముందు నుంచే అమల్లో ఉంది. అధినేత ల కళ్ళల్లో పడేందుకు ప్రత్యర్థులపై హద్దులు దాటిన కామెంట్స్ తో రాజకీయ నేతలు ఎలా చెలరేగి పోయేవారో అందురూ చూసిందే. గత ప్రభుత్వంలో అయితే ఇది తారాస్థాయికి చేరింది. ప్రెస్ మీట్ల స్థాయి దాటి ఏకంగా అసెంబ్లీలోనే బూతులు మాట్లాడిన గతం ఆ పార్టీ ఓటమికి ప్రధాన కారణాల్లో ఒకటిగా మారింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి తమ పార్టీ నేతలు ప్రత్యర్థులను బూతులు తిట్టరనీ హద్దు దాటరనీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పదేపదే చెబుతూ వస్తున్నారు. అయినప్పటికీ కొందరు నేతలు చేసే వ్యాఖ్యలు పెట్టే పోస్టులు వివాదాస్పదం అవుతున్నాయి. అలాంటి ఘటనల్లో టీచింగ్ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చిన హోంమంత్రి అనిత కూడా చిక్కుకోవడం విచారకరం అన్న వాదన వినిపిస్తోంది. కాకపోతే మరీ వివాదం ముదరక ముందే ఆ పోస్ట్ ను డిలీట్ చేయడం కొంతలో కొంత బెటర్ అంటున్నారు విశ్లేషకులు. రిపబ్లిక్ డే కు జగన్ హాజరు కాలేదన్న విమర్శలకు జవాబు చెప్పే ప్రయత్నం చేస్తున్న వైసీపీ నేతలకు మాత్రం హోం మంత్రి అనిత పోస్ట్ ఒక మంచి ఆయుధం అయ్యిందన్న మాట మాత్రం వాస్తవం అంటున్నాయి రాజకీయ వర్గాలు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు





















