AP Highcourt: కఠిన చర్యలు తీసుకోకపోవడంతోనే ఏపీలో విద్వేష పోస్టులు, ఫ్లెక్సీలు - పోలీసులపై ఏపీ హైకోర్టు ఆగ్రహం
AP High Court: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సోషల్ మీడియా వేదికగా సాగుతున్న అభ్యంతరకర పోస్టులు, విద్వేషపూరిత ఫ్లెక్సీలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. పోలీసులను తీరును తప్పు పట్టింది

Hate posts and flexis issue in AP: సోషల్ మీడియాలో సాగుతున్న అరాచకాలు, వివాదాస్పద ఫ్లెక్సీలపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్రస్థాయిలో మండిపడింది. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న ముఖ్యమంత్రిని అనుచిత వ్యాఖ్యలతో దూషించడం అంటే, ఆ రాష్ట్రంలోని ఐదు కోట్ల మంది ప్రజలను అవమానించడమేనని న్యాయస్థానం స్పష్టం చేసింది. వ్యక్తుల ప్రతిష్ఠను దెబ్బతీసే అధికారం, ఇష్టానుసారంగా పోస్టులు పెట్టే హక్కు ఎవరికీ లేదని, వాక్ స్వాతంత్ర్యం పేరుతో ఇలాంటి పనులు చేస్తే సహించేది లేదని హెచ్చరించింది. సజ్జల భార్గవరెడ్డిపై జారీ అయిన ఎల్వోసీ విషయంలో ఆయన దాఖలు చేసిన పిటిషన్ పై విచారణలో హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
పోలీసుల వైఫల్యం వల్లే రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితులు నెలకొన్నాయని హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఒకసారి అరెస్టు అయిన వారు కూడా బెయిల్పై వచ్చి మళ్ళీ మళ్ళీ అవే తప్పులు చేస్తుంటే పోలీసులు ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించింది. గతంలో న్యాయమూర్తులపైనే దారుణమైన పోస్టులు పెట్టినప్పుడే పోలీసులు ఉక్కుపాదం మోపి ఉంటే, నేడు పరిస్థితి ఇంతవరకు వచ్చేది కాదని అభిప్రాయపడింది. నిందితులు చట్టానికి, కోర్టులకు భయపడటం లేదంటే అది పోలీసుల పనితీరులో లోపమేనని ఆక్షేపించింది.
ముఖ్యంగా ఫ్లెక్సీలపై రాస్తున్న భాషపై న్యాయస్థానం విస్మయం వ్యక్తం చేసింది. 2029లో మీరు చేయబోయే విధ్వంసం కోసం ఎదురుచూస్తున్నాం అని బహిరంగంగా ఫ్లెక్సీలు పెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, అసలు ఎవరిని ధ్వంసం చేస్తారని నిలదీసింది. రాష్ట్రాన్నా? లేక రాష్ట్ర ప్రజల్నా? అని పిటిషనర్ తరపు న్యాయవాదులను సూటిగా ప్రశ్నించింది. ఇలాంటి విద్వేషపూరిత ప్రచారాలను అడ్డుకోవడంలో పోలీసు యంత్రాంగం పూర్తిగా విఫలమైందని, 2024 తర్వాత కూడా ఇలాంటి ధైర్యం ఎక్కడి నుండి వస్తోందని పోలీసులను నిలదీసింది.
వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ సజ్జల భార్గవ్ రెడ్డిపై జారీ అయిన లుకౌట్ నోటీసుల రద్దు పిటిషన్పై విచారణ సందర్భంగా ఈ వాదనలు జరిగాయి. రాజకీయ విమర్శలకు , వ్యక్తిగత దూషణలకు మధ్య ఉన్న గీతను దాటకూడదని కోర్టు సూచించింది. వ్యవస్థలను కించపరిచేలా వ్యవహరిస్తే చట్టపరమైన పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తూ, ఈ కేసులో తీర్పును రిజర్వ్ చేసింది. హైకోర్టు చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా అరాచకాలకు పాల్పడే వారికి గట్టి హెచ్చరికగా మారాయి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















