Tuni Train Case: తుని రైలు దహనం కేసుపై ప్రభుత్వం యూటర్న్ - అప్పీలుకు వెళ్లకూడదని నిర్ణయం - తెర వెనుక ఏం జరిగింది?
Andhra Pradesh: తుని రైలు దహనం కేసులో ప్రభుత్వం యూటర్న్ తీసుకుంది. తీర్పుపై అప్పీల్కు వెళ్లకూడదని నిర్ణయం తీసుకున్నారు. జీవో ఉపసంహరించుకున్నారు.

Tuni train burning case: తుని రైలు దహనం కేసుపై దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును ఎగువ కోర్టులో అప్పీల్ చేసే ఉద్దేశం లేదని ప్రభుత్వం ప్రకటించింది. తుని కేసు కొట్టేస్తూ రైల్వే కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై అప్పీల్ కు వెళ్లే ఆలోచన లేదని ... అప్పీల్ చేయాలనే ఉత్తర్వులను తక్షణమే రద్దు చేయాలని ఆదేశించింది. తుని కేసును పై కోర్టులో అప్పీల్ చేయాలని ఆదేశిస్తూ జారీ చేసిన ఉత్తర్వుల గురించి ప్రభుత్వ పెద్దల దృష్టికి రాగానే అప్పీల్ ఆలోచనలను విరిమించుకోవాలని ఆదేశించారు. ఏ స్థాయిలో ఆమోదంతో ఫైల్ నడిచింది అనే విషయంలో ప్రభుత్వం ఆరా తీసింది.
ప్రభుత్వానికి తెలియకుండా ఆర్పీఎఫ్ ప్రతిపాదన ఆధారంగా యాంత్రికంగా ఉత్తర్వులు
రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సీనియర్ డివిజినల్ సెక్యూరిటీ కమిషనర్ చేసిన ప్రతిపాదనల ఆధారంగా ఉత్తర్వులు వెలువడినట్లు అధికారులు గుర్తించారు. సున్నితమైన ఇలాంటి అంశాలపై అలసత్వంలో జరిగే చర్యలను ఉపేక్షించేది లేదని అధికారులను హెచ్చరించారు. జీవో రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. సాధారణంగా కింది కోర్టు కొట్టి వేసిన కేసులను ఉన్నత న్యాయస్థానంలో వాటి తీవ్ర ఆధారంగా సవాల్ చేస్తారు. దానికి పర్మిషన్ అవసరం. పెండింగ్ లో ఉన్న ఈ విజ్ఞప్తికి తాజాగా అనుమతి ఇవ్వడం రాజకీయ కలకలానికి కారణం అయింది.
2015లో తుని రైలు దహనం ఘటన
2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే కాపు రిజర్వేషన్ల ఉద్యమాన్న ముద్రగడ పద్మనాభం నేతృత్వంలో చేపట్టారు. తునిలో సమావేశం పెట్టారు. సభ జరిగిన తరవాత విధ్వంసం చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న రైలును ప్లాన్ ప్రకారం తగులబెట్టించారు. పోలీసులను, పోలీస్ స్టేషన్ పైనా దాడి చేశారు. వ్యక్తిగత ఆస్తులనూ వదల్లేదు. భారీ విధ్వంసం చేయాలో అంతా చేశారు. ఈ కేసులో ప్రదానంగా ముద్రగడ పద్మనాభం, దాడిశెట్టి రాజా, కామన ప్రభాకరరావు, వంటి వారు ఉన్నారు.
ఒక్క సాక్షినీ ప్రవేశ పెట్టలేదని కేసు కొట్టేసిన రైల్వే కోర్టు
తుని రైలు దరహనం కేసులను వైసీపీ ప్రభుత్వం రాగానే ఉపసంహరించుకుంది. రైల్వే పోలీసులు పెట్టిన కేసును కోర్టు కొట్టి వేసింది. ఒక్కటంటే ఒక్క సాక్ష్యం కూడా కోర్టు ముందు అధికారులు ప్రవేశ పెట్టలేదు. ఐదేళ్లు కేసును సాగదీసి ఒక్క సాక్షిని మాత్రమే ప్రవేశ పెట్టారని ఒక్క సాక్ష్యం కూడా చూపించలేదని మండిపడి ముగ్గురు రైల్వే ఉన్నతాధికారులపై చర్యలు తీసుకోవాలని తీర్పు సందర్భంగా కోర్టు ఆదేశించింది. 41 మందిపై పెట్టిన కేసుల్ని అక్రమ కేసులుగా పరిగణిస్తూ విజయవాడ రైల్వే కోర్టు న్యాయమూర్తి తీర్పు చెప్పారు. ఆ తీర్పుపై అప్పీలుకు వెళ్లాలని సోమవారం ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లుగా ఉత్తర్వులు వచ్చాయి. తెల్లవారే సరికి సీన్ మారిపోయింది. తెర వెనుక ఆ కేసులో నిందితులు..ఒత్తిడి తేవడం వల్ల యూటర్న్ తీసుకున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది.





















