ఆంధ్రప్రదేశ్లో 12 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ కేసులలో నలుగురు బాధితులు మరణించారు.
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఆంధ్రప్రదేశ్లో 12 కొవిడ్ కేసులు నమోదవగా, నలుగురు మృతి చెందారని వైద్యశాఖ అధికారులు తెలిపారు. ఆసుపత్రుల్లో వీటీఎం, పీపీఈ కిట్ల కొరత, ఆక్సిజన్ ప్లాంట్లు నిరుపయోగంగా మారడం ఆందోళన కలిగిస్తోంది.

- ఆంధ్రప్రదేశ్లో 12 కొవిడ్ కేసులు; నలుగురు మరణించారు.
- కడపలో ముగ్గురు, కాకినాడలో ఒకరు మృతి; సహ-వ్యాధులతో.
- వైరస్ జన్యు విశ్లేషణకు పుణెకు ఐదు నమూనాలిచ్చారు.
- ఆసుపత్రులకు మార్గదర్శకాలు; వైద్య సామాగ్రి కొరతపై ప్రశ్నలు.
అమరావతి: భారత్లో మరోసారి కరోనా కేసులు నమోదవుతున్నాయి. మరణాలు కూడా సంభవిస్తుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో 12 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా, వీరిలో నలుగురు బాధితులు మృతి చెందారని వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి జి.వీరపాండియన్ గురువారం ఒక ప్రకటనలో వెల్లడించారు.
కడపలో ముగ్గురు, కాకినాడలో ఒక్కరు మృతి
కరోనా బారిన పడిన మరణించిన వారిలో వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన ముగ్గురు, కాకినాడ జిల్లాకు చెందిన ఒకరు ఉన్నారని, వారంతా ఇదివరకే తీవ్రమైన ఇతర ఆరోగ్య సమస్యలతో (కో-మార్బిడిటీస్) బాధపడుతున్నారని వీరపాండియన్ స్పష్టం చేశారు. వైరస్ జన్యు క్రమ స్వరూపాన్ని విశ్లేషించేందుకు 5 శాంపిల్స్ సేకరించి పుణెలోని జాతీయ వైరాలజీ ల్యాబ్కు పంపినట్లు తెలిపారు.
కడపలో అత్యధిక కరోనా కేసులు
ఏపీలో నమోదైన మొత్తం కోవిడ్19 కేసుల్లో అత్యధికంగా వైఎస్సార్ కడప జిల్లాలో 8 కేసులు, గుంటూరులో 2, విశాఖపట్నం, కాకినాడ జిల్లాల్లో ఒక్కో కేసు నమోదయ్యాయి. ప్రజలెవరూ ఆందోళన చెందకుండా తగిన ముందు జాగ్రత్తలు తీసుకోవాలని, లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ను సంప్రదించి చికిత్స తీసుకోవాలని ఆయన సూచించారు.
మరోవైపు, రాష్ట్ర సర్వైలెన్స్ విభాగం ఇప్పటికే అన్ని బోధనాసుపత్రులు, జీజీహెచ్లు, డీఎంహెచ్వోలకు అత్యవసర మార్గదర్శకాలు జారీ చేసింది. ఆక్సిజన్ సిలిండర్లు, కరోనా మందులు, ఆర్టీపీసీఆర్ కిట్లను సిద్ధం చేసుకోవాలని ఆదేశించింది. క్షేత్రస్థాయిలో రోగుల నుంచి కరోనా పరీక్షల కోసం స్వాబ్ నమూనాలను సేకరించేందుకు అవసరమైన వీటీఎం కిట్లు, వైద్య సిబ్బంది ధరించే పీపీఈ కిట్లు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉన్నాయా అని ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
గతంలో భారీగా కొనుగోలు చేసిన పీపీఈ కిట్లలో వ్యాలిడిటీ ముగిసిపోవడంతో దాదాపు 45 లక్షల కిట్లు వృథాగా మారాయి. ప్రస్తుతం పలు ప్రభుత్వ ఆసుపత్రుల్లోని ఆక్సిజన్ ప్లాంట్లు కూడా నిరుపయోగంగా మారడంతో తక్షణం దీనిపై చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని అధికారులు భావిస్తున్నారు. కరోనా కేసులు, నివారణ చర్యలు, వైద్యశాఖ చేపట్టాల్సిన చర్యలపై ఏపీ ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకోనుంది.
Frequently Asked Questions
ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత కరోనా కేసుల సంఖ్య, మరణాలు ఎన్ని?
మరణించిన కరోనా బాధితులు ఏ జిల్లాకు చెందినవారు, వారికి ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా?
మరణించిన వారిలో కడప జిల్లాకు చెందిన ముగ్గురు, కాకినాడ జిల్లాకు చెందిన ఒకరు ఉన్నారు. వారంతా ఇదివరకే ఇతర తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.
ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు ఎక్కువగా ఏ జిల్లాలో నమోదయ్యాయి?
ఆంధ్రప్రదేశ్లో నమోదైన మొత్తం కోవిడ్19 కేసుల్లో అత్యధికంగా వైఎస్సార్ కడప జిల్లాలో 8 కేసులు నమోదయ్యాయి. గుంటూరులో 2, విశాఖపట్నం, కాకినాడ జిల్లాల్లో ఒక్కో కేసు నమోదయ్యాయి.
కరోనా కేసుల పెరుగుదల దృష్ట్యా ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
ప్రజలెవరూ ఆందోళన చెందకుండా తగిన ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ను సంప్రదించి చికిత్స తీసుకోవాలి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు























