![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
వధువు తల్లి ఖాతాలోనే కళ్యాణమస్తు, షాదీ తోఫా నగదు- వచ్చే త్రైమాసికం నుంచి అమలు
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలతోపాటు దివ్యాంగులు, భవన నిర్మాణ కార్మికుల్లోని ఆడపిల్లలందరికీ కూడా మంచి జరుగుతుందన్నారు సీఎం జగన్.
![వధువు తల్లి ఖాతాలోనే కళ్యాణమస్తు, షాదీ తోఫా నగదు- వచ్చే త్రైమాసికం నుంచి అమలు CM Jagan has deposited the YSR Kalyanamastu and YSR Shadi Tofa cash in accounts of beneficiaries for quarter of October-December 2022 వధువు తల్లి ఖాతాలోనే కళ్యాణమస్తు, షాదీ తోఫా నగదు- వచ్చే త్రైమాసికం నుంచి అమలు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/10/546e35e6cc16714058ffb0a788e2d5bd1676012995613215_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
2022 అక్టోబరు- డిసెంబర్ త్రైమాసికానికి సంబంధించి వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా నగదును లబ్ధిదారుల ఖాతాల్లో సీఎం జగన్ జమ చేశారు. 4,536 మంది లబ్ధిదారులకు రూ. 38.18 కోట్లను బటన్ నొక్కి అందించారు. అక్టోబరు- డిసెంబర్ మధ్య పెళ్లిళ్లు చేసుకున్నవారికి దరఖాస్తు చేసుకోవడానికి నెలరోజుల పాటు సమయం ఇచ్చారు. ఫిబ్రవరిలో వెరిఫికేషన్ పూర్తి చేసి ఇవాళ నగదు జమ చేశారు.
ప్రతి సంవత్సరంలో మూడు త్రైమాసికాల్లో ఈ కార్యక్రమానికి సంబంధించిన నగదును ప్రభుత్వం జమ చేస్తోంది. జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలకు సంబంధించి దరఖాస్తులను ఏప్రిల్లో స్వీకరిస్తారు. మే నెలలో వారికి నగదు పంపిణీ చేస్తారు. ఈ పథకం సమూలంగా ఒక మార్పును తీసుకొచ్చే ప్రయత్నమని సీఎం జగన్ అభిప్రాయపడ్డారు. పేదవాడి తలరాత మారాలంటే.. చదువు అనే అస్త్రాన్ని ఇవ్వగలిగితేనే తలరాతలు మారుతుందన్నారు. దీన్నే గట్టిగా నమ్ముతున్న ప్రభుత్వం... కళ్యాణమస్తు, షాదీ తోఫాల్లో మార్పులు చేసినట్టు పేర్కొన్నారు. పిల్లలను చదివించడానికి పెట్టే ప్రతి రూపాయి కూడా ఖర్చుగా భావించడం లేదన్నారు. పిల్లలకు ఇచ్చే ఆస్తిగానే భావిస్తున్నామన్నారు. వయసు మాత్రమే కాదు, చదువు కూడా ఒక అర్హతగా ఈ పథకానికి నిర్దేశించామన్నారు.
పెళ్లైన వారే కాకుండా వారి తర్వాత తరాలు కూడా చదువుల బాట పట్టాలనే ఇది చేస్తున్నామన్నారు సీఎం జగన్. పిల్లల చదువులను ప్రోత్సహించడం, బాల్యవిహాహాలను నివారించడం, స్కూళ్లలో డ్రాప్ అవుట్స్ను తగ్గించడమే లక్ష్యంగా ఈ పథకంలో రూల్స్ ఉన్నట్టు వివరించారు. టెన్త్ సర్టిఫికెట్ కచ్చితంగా ఉండాలని చెప్తున్నామన్నారు. ఈ ప్రోత్సాహకం కోసం కనీసంగా టెన్త్ వరకూ తీసుకున్నామన్నారు. తర్వాత అమ్మ ఒడి ఉంది కాబట్టి సహజంగానే ఇంటర్మీడియట్ చదువుకుంటారని అభిప్రాయపడ్డారు. ఆ తర్వాత విద్యాదీవెన, వసతి దీవెన పథకాలు ఉన్నాయి కాబట్టి ఇంటర్మీడియట్ నుంచి ఆగిపోకుండా చదువులు ముందుకు కొనసాగుతాయని తెలిపారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలతోపాటు దివ్యాంగులు, భవన నిర్మాణ కార్మికుల్లోని ఆడపిల్లలందరికీ కూడా మంచి జరుగుతుందన్నారు సీఎం జగన్. వచ్చే త్రైమాసికం నుంచి కళ్యాణమస్తు, షాదీ తోఫా డబ్బులు పెళ్లికూతురు తల్లుల ఖాతాల్లోకి వేస్తున్నామన్నారు. పలువురి సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. పెళ్లిళ్ల కోసం కొంతకాలం ఆగొచ్చు… కానీ చదువులు ఆగిపోకూడదన్నారు. అమ్మాయిలు చదువుల బాట పడితేనే సమాజం బాగుపడుతుందన్నారు. పదేళ్ల తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయి? అన్న ఆలోచనతో మనం అడుగులు ముందుకేస్తున్నామన్నారు.
ప్రపంచంలో పోటీ విపరీతంగా ఉందన్నారు సీఎం జగన్.. మన పిల్లలకు ఎక్కడకు వెళ్లినా.. గెలిచే పరిస్థితి ఉండాలని అభిప్రాయపడ్డారు. అందుకే విద్యారంగాన్ని పూర్తి స్థాయిలో మెరుగుపరచడానికి అన్నిరకాల చర్యలు తీసుకున్నామన్నారు. అమ్మఒడి, సంపూర్ణ పౌష్టికాహారం, విద్యాకానుక, బైలింగువల్ టెక్ట్స్బుక్, నాడు-నేడుతోపాటు, అన్ని క్లాసుల్లో డిజిటల్ క్లాస్ రూమ్స్, 8వ తరగతిలోకి రాగానే వారందరికీ ట్యాబ్స్,, బైజూస్ కంటెంట్, సీబీఎస్ఈ సిలబస్, విదేశాల్లో చదువుకోవాలనుకునే వారికి రూ.1.25 కోట్ల వరకూ సహాయాన్ని ఇస్తున్నామన్నారు.
సంతృప్త స్థాయిలో పథకం అమలు చేస్తున్నామన్నారు సీఎం జగన్. గ్రామ సచివాలయ స్థాయిలోనే మ్యారేజ్ సర్టిఫికెట్లు, దరఖాస్తు పూర్తి ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. ఎక్కడా కూడా లంచాలకు, వివక్షకు తావులేదన్నారు.
గతంలో కూడా ఇలాంటి తరహా కార్యక్రమం ప్రకటించారు కానీ.. కానీ అమలు ఘోరంగా ఉండేదన్నారు. మంచి చేయాలన్న ఆలోచనతో చేసింది కాదన్నారు. కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఆరోజు తీసుకు వచ్చారని తెలిపారు. అరకొరగా డబ్బులు ఇచ్చారని విమర్శించారు. అవికూడా పూర్తిగా ఇవ్వలేదని ఆరోపించారు. 2018-19 సంవత్సరంలో 17,709 మంది లబ్ధిదారులకు రూ. 68.68 కోట్లు ఎగ్గొట్టారని గుర్తు చేశారు. 2018 అక్టోబరు నుంచి పూర్తిగా ఎగ్గొట్టారన్నారు.
ఆనాడు ఈ పథకం కేవలం ప్రకటనలకే పరిమితమైందన్నారు సీఎం జగన్. ఎస్సీలకు గతంలో రూ.40వేలు అయితే ఇప్పుడు లక్ష చేశామన్నారు. ఎస్సీలు కులాంతర వివాహాలకు గతంలో రూ.75వేలు ప్రకటిస్తే ఇప్పుడు రూ.1.2లక్షలు చేసి అమలు చేస్తున్నామన్నారు. ఎస్టీలకు రూ.50వేలు గతంలో అయితే.. ఇప్పుడు రూ.. 1 లక్ష ఇస్తున్నాం... ఎస్టీ కులాంతర వివాహాలకు గతంలో రూ.75వేలు అయితే ఇప్పుడు రూ.1.2 లక్షలు ఇస్తున్నామని తెలిపారు. బీసీలకు గతంలో రూ.35వేలు అయితే ఇప్పుడు రూ.50వేలు... బీసీలు కులాంతర వివాహాలకు గతంలో రూ.50వేలు అయితే ఇప్పుడు రూ.75వేలు ఇస్తున్నట్టు వివరించారు. మైనార్టీలకు గతంలో రూ.50వేలు అయితే ఇప్పుడు రూ.1 లక్ష రూపాయలు... విభిన్న ప్రతిభావంతులకు గతంలో రూ.1 లక్ష అనిచెప్తే.. ఇప్పుడు రూ.1.5లక్షలు పెంచినట్టు పేర్కొన్నారు. భవన, ఇతర కార్మికులకు గతంలో రూ.20వేలు అయితే, ఇప్పుడు రూ.40వేలు చేశామన్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)