MLC Ananthababu: హత్య కేసులో సాక్షుల్ని ప్రభావితం చేసే ప్రయత్నం - ఎమ్మెల్సీ అనంతబాబుకు బెయిల్ రద్దు గండం
MLC Ananthababu: హత్య కేసులో సాక్షుల్ని ప్రభావితం చేసే ప్రయత్నం చేయడంతో ఎమ్మెల్సీ అనంతబాబుకు బెయిల్ రద్దు గండం పొంచి ఉంది. ఆయన బెయిల్ రద్దు చేయాలని కోర్టులో పిటిషన్ దాఖలైంది.

MLC Ananthababu bail tension: మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వైసీపీ మాజీ ఎమ్మెల్సీ అనంతబాబు చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. సాక్షులను ప్రభావితం చేసేందుకు ఆయన సాగించిన ప్రయత్నాలు బహిర్గతం కావడంతో, ఆయన బెయిల్ రద్దు చేయాలంటూ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలైంది.
సాక్షుల కొనుగోలుకు ఎమ్మెల్సీ ఎర వేశారని ఆరోపణలు
హత్య కేసు నుంచి బయటపడేందుకు అనంతబాబు సాక్షులను కొనేందుకు ప్రయత్నిస్తూ దొరికిపోయారని పోలీసులు కేసులు నమోదు చేశారు. కీలక సాక్షులకు భారీ మొత్తంలో నగదు ఆశ చూపడమే కాకుండా, మాట వినని వారిని తీవ్రంగా హెచ్చరించినట్లు సాక్షులు పోలీసులకు చెప్పారు. ఈ పరిణామాలను తీవ్రంగా పరిగణించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ సుబ్బారావు, రాజమండ్రి ఎస్సీ-ఎస్టీ ప్రత్యేక కోర్టులో బెయిల్ రద్దు పిటిషన్ దాఖలు చేశారు. నిందితుడు తన పరపతిని ఉపయోగించి వ్యవస్థను తప్పుదోవ పట్టిస్తున్నారని, తక్షణమే ఆయనను అదుపులోకి తీసుకోవాలని కోర్టును కోరారు.
సుప్రీంకోర్టు నిబంధనల ఉల్లంఘన
గతంలో పోలీసులు నిర్దేశిత గడువులోగా విచారణ పూర్తి చేయలేదన్న సాంకేతిక కారణంతో అనంతబాబుకు 2022 డిసెంబర్లో సుప్రీంకోర్టు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే, సాక్షులను ఎట్టిపరిస్థితుల్లోనూ కలవకూడదని, వారిని ప్రభావితం చేయకూడదని అత్యున్నత న్యాయస్థానం స్పష్టమైన ఆంక్షలు విధించింది. ఇప్పుడు సాక్షుల కొనుగోలుకు ప్రయత్నించడం ద్వారా ఆయన సుప్రీంకోర్టు ఆదేశాలను తుంగలో తొక్కారని, ఇది బెయిల్ రద్దుకు బలమైన కారణమని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అనంతబాబు బయట ఉంటే విచారణ నిష్పక్షపాతంగా జరగదని, సాక్షులను భయభ్రాంతులకు గురిచేస్తూ కేసును తారుమారు చేసే ప్రమాదం ఉందని పీపీ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. నేర స్వభావం కలిగిన వ్యక్తి స్వేచ్ఛగా తిరగడం వల్ల బాధితులకు న్యాయం జరగదని, కేసులో కీలకమైన ఆధారాలను మాయం చేసే అవకాశం ఉందని వాదించారు. నిందితుడి ప్రవర్తన వల్ల న్యాయవ్యవస్థపై ప్రజల్లో ఉన్న నమ్మకం దెబ్బతినే అవకాశం ఉందని పిటిషన్లో పేర్కొన్నారు.
ఆనాటి డోర్ డెలివరీ దారుణం
2022 మే నెలలో జరిగిన ఈ హత్య ఉదంతం అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తన వద్ద పనిచేసిన దళిత యువకుడు సుబ్రహ్మణ్యంను హత్య చేసి, అనంతరం దానిని ప్రమాదంగా చిత్రీకరించేందుకు మృతదేహాన్ని స్వయంగా తన కారులోనే తెచ్చి బాధితుడి ఇంటి వద్ద డోర్ డెలివరీ చేసిన తీరు సంచలనం సృష్టించింది. తాజా పరిణామాలతో అనంతబాబుకు మళ్లీ జైలు గండం పొంచి ఉంది. ఒకవేళ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సమర్పించిన సాక్ష్యాధారాలతో కోర్టు ఏకీభవిస్తే, ఆయన బెయిల్ రద్దు కావడం ఖాయమన్న అభిప్రాయం వినిపిస్తోంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు





















