AP Assembly Session: అసెంబ్లీకి వచ్చిన జగన్.. గవర్నర్ ప్రసంగం మధ్యలోనే వైసీపీ సభ్యులతో కలిసి వాకౌట్
AP Assembly Budget Session |మాజీ సీఎం వైఎస్ జగన్ అసెంబ్లీకి వచ్చారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిలిపివేయాలని, రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడాలని నినాదాలు చేసిన వైసీపీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు.

YSRCP MLAs and MLCs Walkout | అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాలు మొదలైన కాసేపటికే వైఎస్సార్ సీపీ సభ్యులు సభ నుంచి వెళ్లిపోయారు. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తుంటే అడ్డుకునేందుకు ప్రయత్నించిన వైసీపీ సభ్యులు.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలుచేస్తూ సభ నుంచి వాకౌట్ చేశారు. వైఎస్సార్ సీపీ చాంబర్ నుంచి సభకు వచ్చిన మాజీ సీఎం జగన్ పార్టీ సభ్యులతో కలిసి మెడికల్ కాలేజీలో ప్రైవేటీకరణ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడాలని నినాదాలు చేసుకుంటూ అసెంబ్లీలోకి వచ్చిన వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కొంత సమయానికే సభ వాకౌట్ చేశారు.

గత ప్రభుత్వ హయాంలో వ్యవస్థలు నిర్వీర్యం
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తొలిరోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తున్నారు. రాష్ట్ర విభజన సమస్యలతో పాటు ఆర్థిక కష్టనష్టాల మధ్య ప్రస్తుత కూటమి ప్రభుత్వం పాలన ప్రారంభించినట్లు ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో వ్యవస్థలు నిర్వీర్యమై అభివృద్ధి ఆగిపోయిందని, ఆర్థిక ఇబ్బందులు తీవ్రమయ్యాయని ఆయన అసహనం వ్యక్తం చేశారు. గతంలో శాంతిభద్రతలకు విఘాతం కలగడమే కాకుండా, 22ఏ వంటి నిబంధనలు దుర్వినియోగం అయ్యాయని విమర్శించారు. విద్యుత్, సాగునీరు, రహదారులు వంటి కీలక మౌలిక వసతుల రంగాల్లో ప్రగతి కుంటుపడిందని వివరించారు.

2024లో రాష్ట్రాన్ని పునర్నిర్మించే బాధ్యతను ప్రజలు కూటమికి అప్పగించారని గవర్నర్ గుర్తు చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నాయకత్వంలో, ప్రధాని నరేంద్ర మోదీ సహకారంతో కూటమి ప్రభుత్వం సమర్థవంతంగా సాగుతోందని చెప్పారు. గత 19 నెలల కాలంలో వ్యవస్థలను గాడిలో పెట్టి, సూపర్ సిక్స్ సహా పలు సంక్షేమ కార్యక్రమాలను పునఃప్రారంభించినట్లు తెలిపారు. పాలనలో పారదర్శకత కోసం ఏడు శ్వేత పత్రాలను విడుదల చేసి, వ్యవస్థల పునరుద్ధరణపై తొలి తొమ్మిది నెలల కాలంలోనే ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని ప్రశంసించారు.

రాష్ట్ర భవిష్యత్తు కోసం 'స్వర్ణాంధ్ర 2047' లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రకటించారు. పది సూత్రాలను నిర్దేశించుకుని సుపరిపాలన అందించడమే ధ్యేయంగా అడుగులు వేస్తున్నట్లు పేర్కొన్నారు. అభివృద్ధిని, సంక్షేమాన్ని సమతూకంగా పాటిస్తూ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడమే ఈ ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేశారు. వ్యవస్థల పునర్నిర్మాణం ద్వారా రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ఫిబ్రవరి 12, 13 తేదీల్లో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు
అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం ముగిసిన వెంటనే సభ వాయిదా పడుతుంది. అనంతరం స్పీకర్ అధ్యక్షతన బిజినెస్ అడ్వైజరీ కమిటీ (BAC) సమావేశం నిర్వహిస్తారు. ఈ సమావేశంలో అసెంబ్లీ ఎన్ని రోజులు నిర్వహించాలి, ఏయే అంశాలపై ఎప్పుడు చర్చించాలనే దానిపై స్పష్టమైన నిర్ణయం తీసుకుంటారు. ఫిబ్రవరి 12, 13 తేదీల్లో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సభలో చర్చ జరుగుతుంది. ఈ చర్చ ముగింపులో ముఖ్యమంత్రి చంద్రబాబు సభ్యులు లేవనెత్తిన అంశాలకు సమాధానం ఇస్తారు.

అత్యంత కీలకమైన రాష్ట్ర బడ్జెట్ను ఫిబ్రవరి 14న ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ సభలో ప్రవేశపెడతారు. శివరాత్రి పండుగను పురస్కరించుకుని ఫిబ్రవరి 15 (ఆదివారం), 16 తేదీల్లో అసెంబ్లీకి సెలవులు ప్రకటించే అవకాశం ఉంది. తిరిగి ఫిబ్రవరి 17 నుంచి రెండు మూడు రోజుల పాటు బడ్జెట్పై సాధారణ చర్చ కొనసాగుతుంది. ఆ తర్వాత వివిధ ప్రభుత్వ శాఖల వారీగా గ్రాంట్లు, డిమాండ్లపై సుదీర్ఘంగా చర్చించి ఆమోదం తెలుపుతారు.
ఈ బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వం కేవలం ఆర్థిక అంశాలకే పరిమితం కాకుండా చట్టసభలో బిల్లులను కూడా ప్రవేశపెట్టనుంది. గతంలో తీసుకువచ్చిన నాలుగు ఆర్డినెన్సుల స్థానంలో కొత్త బిల్లులను ప్రభుత్వం సభ ముందుకు తీసుకువస్తుంది. పరిపాలనలో సంస్కరణలు, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఈ బిల్లులు కీలకం కానున్నాయి.
























