Amaravati Land Pooling: అమరావతికి రెండో విడత భూసమీకరణ - రైతుల్లో అప్పటి ఉత్సాహం ఉందా?
Land Pooling: అమరావతి ల్యాండ్ పూలింగ్ రెండో విడత ప్రారంభమయింది. కానీ తొలి దశలో ఉన్నంత ఉత్సాహం రైతుల్లో ఇప్పుడు ఉందా అన్నదే పెద్ద ప్రశ్న.

AP Capital Amaravati 2nd Phace Land Pooling: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంలో అత్యంత కీలకమైన రెండో విడత భూసమీకరణ (LPS 2.0) ప్రక్రియ శనివారం నుంచి అధికారికంగా ప్రారంభం కానుంది. దాదాపు 16,666 ఎకరాల మేర భూమిని సేకరించడమే లక్ష్యంగా ఏపీసీఆర్డీఏ (APCRDA) ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గతంలో రాజధాని పనులు నిలిచిపోయినప్పుడు తీవ్ర ఆందోళన చెందిన రైతులు, ఇప్పుడు మళ్లీ పనులు శరవేగంగా ప్రారంభం కావడంతో ఈ రెండో విడత ప్రక్రియపై సానుకూల స్పందన వ్యక్తం చేస్తున్నారని సీఆర్డీఏ వర్గాలు చెబుతున్నాయి. అయితే మొదటి విడతలో చూపించినంత ఉత్సాహం ఇప్పుడు చూపిస్తారా అన్నది భూసమీకరణ ప్రారంభించిన తర్వాత స్పష్టత రానుంది.
రాజధాని అభివృద్దిపై ఆశావహంగా రైతులు
రాజధాని విస్తరణ జరిగితేనే తమ ప్రాంతం ఆర్థికంగా బలోపేతం అవుతుందని నమ్ముతున్న రైతులు, ప్రభుత్వంతో సహకరించేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. ఈ క్రమంలో రైతుల్లో ఉన్న చిన్నపాటి సందేహాలను నివృత్తి చేసేందుకు ప్రభుత్వం గట్టి భరోసా ఇస్తోంది. భూములిచ్చే రైతులకు మొదటి విడతలో కల్పించిన ప్రయోజనాలనే ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. భూమి రకాన్ని బట్టి నివాస , వాణిజ్య ప్లాట్లను కేటాయించడంతో పాటు, ఏటా చెల్లించే కౌలును చెల్లిస్తారు. భూములిచ్చిన రైతులకు కచ్చితమైన గడువులోగా అభివృద్ధి చేసిన ప్లాట్లను అప్పగిస్తామని, రాజధాని ప్రాంతంలో మౌలిక సదుపాయాల కల్పనకు ఎటువంటి నిధుల కొరత లేకుండా చూస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా రైతులకు హామీ ఇచ్చారు.
భారీ ప్రాజెక్టుల కోసం భూమి సేకరణ
ఇప్పుడు సేకరించబోయే ఈ 16,666 ఎకరాల భూమిని ప్రభుత్వం కేవలం ప్లాట్ల కోసం కాకుండా, రాజధాని మనుగడకు అవసరమైన భారీ ప్రాజెక్టుల కోసం ఉపయోగించనుంది. ప్రధానంగా రాజధాని చుట్టూ నిర్మించబోయే ఇన్నర్ రింగ్ రోడ్డు, క్వాంటం వ్యాలీ, అంతర్జాతీయ స్పోర్ట్స్ సిటీ, ఐటీ హబ్ల వంటి మెగా ప్రాజెక్టులు ఈ స్థలాల్లోనే రూపుదిద్దుకోనున్నాయి. అమరావతిని కేవలం పరిపాలనా నగరంగానే కాకుండా, ఆర్థిక , విజ్ఞాన నగరంగా తీర్చిదిద్దేందుకు ఈ భూమి అత్యంత కీలకం. రవాణా సౌకర్యాలను మెరుగుపరిచే రైల్వే నెట్వర్క్ , ఇండస్ట్రియల్ కారిడార్ల కోసం కూడా ఈ భూమిని కేటాయిస్తారు.
గతంలోలా ఆసక్తి చూపిస్తారా?
రాజదానిగా అమరావతిని ప్రకటించి ల్యాండ్ పూలింగ్ ప్రకటించినప్పుడు రైతులంతా ముందుకు వచ్చారు. అయితే ఇప్పుడు అంత ఆసక్తి చూపిస్తారా అన్నది పెద్ద ప్రశ్నగా మారింది. ప్రస్తుతం అమరావతి నిర్మాణం ప్రస్తుతం రైతుల అంచనాలకు తగ్గట్టుగానే శరవేగంగా సాగుతోంది. ఇప్పటికే అమరావతిలో ఐకానిక్ టవర్స్ పనులు పునఃప్రారంభం కావడం రైతుల్లో నమ్మకాన్ని రెట్టింపు చేసింది. గత ఐదేళ్లలో నిలిచిపోయిన కట్టడాలను పూర్తి చేయడంతో పాటు, వరద నియంత్రణ కోసం పంపింగ్ స్టేషన్లు , గ్రావిటీ కెనాల్స్ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. ఇది తమ భూముల విలువను పెంచడమే కాకుండా, భావితరాలకు గొప్ప ఉపాధి అవకాశాలను కల్పిస్తుందని రాజధాని రైతులు ఆశాభావంతో ఉన్నారు. అంందుకే రైతులంతా ముందుకు వస్తారని ప్రభుత్వం నమ్మకంగా ఉంది.
Before You Go
NTR Sister In Law Politics Entry Rumours | నందమూరి ఫ్యామిలీ నుంచి మరో పొలిటికల్ ఎంట్రీ?
ట్రెండింగ్ వార్తలు






















