YS Sharmila Comments On YS Jagan:"జగన్కు అధికారం సూట్ కాలేదు, మారితే తప్ప ప్రజలు, దేవుడూ ఆశీర్వదించడు" వైసీపీ అధినేతపై షర్మిల తీవ్ర విమర్శలు
YS Sharmila Comments On YS Jagan: అధికారంలో ఉన్నప్పుడు చేయని మంచి మళ్లీ అధికారం ఇస్తే చేస్తామని చెప్పడమేంటని జగన్ను షర్మిల ప్రశ్నించారు. ఆయన మారే వరకు అధికారంలోకి రాడని అన్నారు.

YS Sharmila Comments On YS Jagan: వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. అధికారం కోసం జగన్ చేసే పాదయాత్రను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు మంచి చేయకుండా ప్రజలు తిరస్కరించిన తర్వాత మంచి చేస్తానంటూ చెప్పడమేంటని ప్రశ్నించారు. "అధికారంలో ఉన్నప్పుడు YSR జలయజ్ఞం పూర్తి చేయగలిగారా? నవరత్నాల్లో పెట్టిన హామీలకు దిక్కులేదు. అధికారంలో వచ్చిన 6 నెలల్లో పూర్తి చేస్తా అన్నారు. అధికారం ఇస్తే ఎందుకు పూర్తి చేయలేదు? మద్యనిషేధం అన్నారు. అధికారం ఇస్తే కల్తీ మద్యం పెట్టి, క్యాష్ పద్ధతిలో మద్య మాఫియా చేశారు. వేల ఏళ్ల నుంచి నిలబడ్డ రుషికొండను బోడి గుండు చేశారు."
అధికారంలో ఉన్నప్పుడు ప్రజల కోసం ఒక రోజు కూడా బయటకు రాకుండా అందుబాటులో లేకుండా ఉన్న వ్యక్తి ఇప్పుడు పాదయాత్రకు సిద్ధమవుతున్నారం హాస్యాస్పదంగా ఉందన్నారు షర్మిల. "అధికారం ఇస్తే ఒక్క రోజు కూడా బయటకు రాలేదు. ఆ పార్టీ వాళ్ళకే అందుబాటులో లేరు. ఎన్నికలకి 6 నెలల ముందు బయటకు వచ్చి సిద్ధం అంటూ కొన్ని నెలలు తిరిగారు. అంతే తప్పిస్తే ఒకరోజు అయినా ప్రజల కోసం బయటకు వచ్చారా ?" అన్నారా అని ప్రశ్నించారు.
ఒక వ్యక్తికి అధికారం ఇస్తే వారి అసలు నైజం తెలుస్తుందని అబ్రహాం లింకన్ అన్నారని జగన్ విజయంలో అది రుజువైందని అన్నారు షర్మిల. ఇప్పుడు ఆయన మారకుంటే ప్రజలు, దేవుడు ఆశీర్వదించే ఛాన్స్ లేదన్నారు. "మనం జగన్ని అధికారంలో చూశాం . జగన్కి అధికారం సూట్ అవ్వలేదు. జగన్కి పవర్ సూట్ అవ్వలేదు. జగన్ నేచర్ మారాలి. జగన్ నైజం మారాలి. జగన్ లో మార్పు రావాలి . జగన్ లో స్వార్థం తగ్గి మంచితనం పెరగాలి . అప్పుడు దేవుడు అధికారం ఇస్తాడేమో ? అంతవరకు దేవుడు , ప్రజలు ఆశీర్వదించరు. ఏడాదిన్నర తర్వాత చేసే పాదయాత్రకు ఇప్పుడు అనౌన్స్ ఎందుకు ? చిత్తశుద్ధి లేని యాత్రలు ఎందుకు ?" అని ఎద్దేవా చేశారు.
నరేగా యాక్ట్ లాంటి అద్భుతమైన పథకాన్ని బీజేపీ ప్రజలకు దూరం చేస్తోందని మండిపడ్డారు షర్మిల. "ప్రపంచ దేశాలకు నరేగా యాక్ట్ ఎంతో ఆదర్శం. మన రాష్ట్రంలో నరేగా కింద ఈ ఏడాదిలో 91.44 లక్షల కూలీలు యాక్టివ్ గా ఉన్నారు. ఉపాధి హామీకి శ్రీకారం చుట్టింది మన రాష్ట్రంలోనే. ఆనాడు సోనియా , మన్మోహన్ సింగ్ ఈ పథకాన్ని ప్రారంభించారు. YSR ముఖ్యమంత్రిగా దేశంలోనే ఈ పథకం ఏపీలో పైలట్ ప్రాజెక్ట్. ఉపాధి హామీ సక్సెస్ లో ఏపీ రోల్ మోడల్. ఈ పథకాన్ని అద్భుతంగా నడపడంలో YSR కృషి ఎనలేనిది . ఉపాధి హామీ పథకం రూపకల్పన లో YSR కృషి గొప్పది . పథకం ఎలా ఉండాలి అనేది ప్రజల నుంచి అభిప్రాయం తీసుకున్నారు. ఉపాధి హామీలో మధ్య వర్తుల ప్రమేయం ఉండకూడదు అని చెప్పారు . కూలీల కోరిక మేరకు ఏకంగా ఒకే సారి 60 లక్షల బ్యాంక్ అకౌంట్ లు తెరిచారు. ఉపాధి హామీ వేతనాలను నేరుగా అకౌంట్ లో వేయించారు. 60 రోజుల పాటు హాలిడే ఇవ్వాలని ఆనాడు ఒత్తిడి వస్తే.. YSR వద్దు అని వాదించారు. ఎటువంటి ఒత్తిడులకు లొంగలేదు. కూలీలకు 365 రోజులు పని ఉంటేనే కూలీలకు భరోసా ఉంటుంది అన్నారు. రైతుల నుంచి విమర్శలు ఎదురైనా కూలీల కోసం లొంగలేదు . రైతులు అలిగి ఒక సీజన్ బైకాట్ చేశారు. అయినా కూలీల చేతుల్లో బార్గెయిన్ పవర్ ఉండాలని పథకంలో మార్పులు చేయించారు. ఆనాడు ఉపాధి హామీ పథకం అంటే గ్రామాల్లో పెద్ద పండుగ. ఉపాధి హామీ పనులు ఎలా జరుగుతుంది అనేది ఆడిట్ పవర్ కూడా కూలీలకు ఉండేలా YSR చూశారు. 20 ఏళ్లలో ఉపాధి హామీ పథకం కూలీలలో ఆత్మవిశ్వాసం నింపింది. విలేజ్లో ఎకనామీ యాక్టివిటీ పెరిగింది . గ్రామాలు ఎంతో అభివృద్ధి జరిగాయి. ఆనాడు ఈ పథకం అమలుపై విదేశాలు మన దేశంలో పర్యటనలు చేశాయి. ఇతర దేశాల్లో కూడా ఈ పథకాన్ని అమలు చేసుకున్నారు. "
ఉపాధి హామీ పథకంపై బీజేపీ పగపట్టిందని షర్మిల ఆరోపించారు. దాన్ని రద్దు చేయాలని కుట్ర చేస్తున్నట్టు విమర్శించారు. ప్రజలకు మేలు చేసే పథకంలో గాంధీ పేరు తొలగించడం అన్యాయమని అన్నారు. "ఇంత గొప్ప పథకం పై బీజేపీ కక్ష్య గట్టింది. ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేయాలని కుట్రలు చేస్తుంది. ఉపాధి హామీ పథకానికి గాంధీ పేరు తొలగించడం అన్యాయం. గాంధీ మీద బీజేపీకి ద్వేషం ఉందని చెప్పడానికి ఇది నిదర్శనం . ఆనాడు గాడ్సే గాంధీని చంపిస్తే , ఇవాళ పేరు తీసి గాంధీని మోదీ మళ్లీ చంపారు. నరేగాకి విబి జి రామ్ జికి నక్కకు నాకలోకానికి ఉన్నంత తేడా ఉంది . నరేగా పథకంలో 100 రోజులు ఉపాధి ఒక హక్కు. అడిగిన వెంటనే డిమాండ్ ఆధారంగా పని కల్పించాలి . గ్రామ్ జి పథకంలో పని డిమాండ్ కాదట. నోటిఫై పద్ధతిలో పనులు కల్పిస్తారట. పనులు ఇవ్వాలా లేదా అనేది కేంద్రం నిర్ణయిస్తోంది అంట . నోటిఫై చేసిన గ్రామాల్లోనే పనులు ఉంటాయాట. ఇదెక్కడి న్యాయం ? ఒక గ్రామంలో పని .. ఇంకో గ్రామంలో పని లేదట. ఉపాధి హామీ పథకం లేదని చెప్పాలని చూస్తున్నారా ?. పని హక్కును కాలరాస్తున్నారు. ఒక బిడ్డకు చాక్లెట్.. ఇంకొకరికి లేదు .. నచ్చిన వాళ్లకు పని కల్పించడం ఇదెక్కడి న్యాయం ? పని లేకుంటే వెంటనే డీ నోటిఫై చేస్తారట. కేంద్రం ఉపాధి హామీలో పని హక్కును లాగేస్తున్నారు . మినిమం వేజ్ అంటూ లేకుండా ఎంత ఇస్తే అంతే తీసుకోవాలట. 125 రోజుల పని కల్పించడం పెద్ద జోక్ , చేస్తున్నది పెద్ద మాయ. ఉపాధి హామీ పథకంలో ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం యావరేజ్ కింద 52 రోజులు మాత్రమే ఇస్తుంది . 100 రోజులు కూడా పని కల్పించని వాళ్ళు 125 రోజులు ఇస్తాం అంటే నమ్మాలా? మన్రెగా లో 365 రోజులు పని ఉంటుంది . గ్రామ్ జి పథకంలో 60 రోజులు హాలిడే . కూలీలకు బార్ గెయిన్ పవర్ తీసేశారు . కూలీలు ఎంత ఇస్తే అంతే ఆ 60 రోజులు కూలి తీసుకోవాలి. మన్రేగా పథకంలో పనులు గ్రామ సభలకు నిర్ణయం ఉండేది . ఇది గ్రామాలు అభివృద్ధికి ఎంతో ఉపయోగ పడేది .
చంద్రబాబు గ్రామ్ జి బిల్లుకు ఎందుకు మద్దతు ఇచ్చారని షర్మిల ప్రశ్నించారు. ఢిల్లీ వెళ్లి నిధులు ఎందుకు అడుగుతున్నారని నిలదీశారు. రాష్ట్రంపై భారం పడుతుంటే బిల్లుకి ఎందుకు మద్దతు ఇవ్వాలని అనుమానం వ్యక్తం చేశారు. ఇది రాష్ట్రానికి చంద్రబాబు చేసిన పాపమని అభిప్రాయపడ్డారు. మన్రేగా లో మహిళలకు 8 గంటలే ఉండేది . ఇప్పుడు 10 గంటలు చేశారని తెలిపారు. గ్రామ్ జి పథకం కేవలం కాంట్రాక్టర్లకు లాభం చేసిది మాత్రమే అన్నారు. ఏపీలో ఫిబ్రవరి 2 నుంచి మన్రేగాను కాపాడేందుకు ఉద్యమం చేపడుతున్నట్టు షర్మిల ప్రకటించారు. మన్రేగా పరిరక్షణ యాత్ర మొదలు పెడుతున్నామన్నారు. ఫిబ్రవరి 2 నాటికి మన్రేగా మొదలు పెట్టి 20 ఏళ్లు అవుతుందని పథకం ప్రారంభించిన బండ్లపల్లి నుంచి ఉద్యమం ప్రారంభిస్తున్నామన్నారు. తానే స్వయంగా అన్ని జిల్లాల్లో తిరిగి ప్రజలను చైతన్యం చేస్తామని చెప్పారు. మన్రేగా ను కొనసాగించాలి, రోజువారీ వేతనాన్ని 400 వందలకు పెంచాలని డిమాండ్తో యాత్ర ఉంటుందని వెల్లడించారు.























