ఆయిల్ కంపెనీలు క్రెడిట్ ఆప్షన్ రద్దు చేయడమే దీనికి ప్రధాన కారణం. దీనివల్ల డీలర్లు ఇబ్బందులు పడి, సరఫరా తగ్గింది.
Andhra Pradesh Petrol and Diesel Crisis News: ఆంధ్రప్రదేశ్లో ఇంధన సంక్షోభం! పెట్రోల్ బంకుల వద్ద భారీ క్యూలు! అప్రమత్తమైన ప్రభుత్వం కీలక ప్రకటన!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ కొరత తీవ్రమైంది. ప్రధాన పట్టణాల్లో బంకుల వద్ద కిలోమీటర్ల మేర క్యూలైన్లు కనిపిస్తున్నాయి. దీంతో ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది.

- ఆంధ్రప్రదేశ్లో ఇంధన కొరత ప్రచారం, బంకుల వద్ద కిలోమీటర్ల క్యూలైన్లు.
- ప్రభుత్వం రాష్ట్రంలో చమురు కొరత లేదని, ప్రజలు కంగారు పడొద్దని సూచించింది.
- రబీ సీజన్, వ్యవసాయ, ఆక్వా రంగాలపై ఇంధన కొరత ప్రభావం తీవ్రంగా ఉంది.
- ఆయిల్ కంపెనీలు క్రెడిట్ ఆప్షన్ రద్దు చేయడంతో సరఫరా తగ్గింది.
Andhra Pradesh Petrol and Diesel Crisis News: ఆంధ్రప్రదేశ్లో రాత్రికి రాత్రే ఇంధన కొరత ఉందనే ప్రచారం జోరుగా సాగింది. వాహనదారులు బంకుల వద్దకు పరుగులు పెట్టారు. ఫిల్లింగ్ స్టేషన్స్ వద్ద కిలోమీటర్ల మేర క్యూలైన్లు కనిపిస్తున్నాయి. భారీ వాహనదారులు రావడంతో చాలా బంకుల నిర్వాహకులు నో స్టాక్ బోర్డులు ఏర్పాటు చేశారు. దీనిపై స్పందించిన ప్రభుత్వం రాష్ట్రంలో చమురు కొరత లేదని, ప్రజలు కంగారు పడొద్దని సూచించింది. దీని వల్ల ఉన్న స్టాక్ త్వరగా అయిపోతుందని అవసరమైన వాళ్లకు అందకుండా పోతుందని తెలిపారు. అవసరానికి మించి చమురు స్టాక్ పెట్టుకోవద్దని హితవు పలికింది.
రాష్ట్రంలోని ఉమ్మడి గోదావరి జిల్లాలు, కర్నూలు, నంద్యాల, కృష్ణా వంటి జిల్లాల్లో చమురు కొరత దారుణంగా ఉందనే ప్రచారం జోరుగా సాగుతోంది. కర్నూలు జిల్లాలో పెట్రోల్, డీజిల్ కోసం వాహనదారులు గంటల తరబడి క్యూలైన్లలో ఎదురు చూస్తున్నారు. డీజిల్ దొరకదనే భయంతో పెట్రోల్ కోసం కూడా జనం ఎగబడుతున్నారు. చేతిలో ఖాళీ బాటిళ్లు, టిన్లు పట్టుకొని ఇంధనం కోసం బారులు తీరుతున్నారు. ఇది కర్నూలు జిల్లాలోనే కాదు రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి పరిస్థితి కనిపిస్తోంది.
మచిలీపట్నంలో దాదాపు అన్ని బంకుల్లో డీజిల్ నిల్వలు లేవనే పరిస్థితి కనిపిస్తోంది. కొన్ని బంకుల్లో మాత్రమే కొద్దిపాటి నిల్వలు ఉండటంతో వాహనదారులకు రేషన్ పద్ధతిలలో ఇంధనాన్ని సరఫరా చేస్తున్నారు. ఒక్కో వాహనాన్నికి 500 రూపాయలకు మించి డీజిల్ కొట్టడం లేదు. నందిగామలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఇక్కడ కూడా కారుకు పది లీటర్లు, లారీకి 50 లీటర్లు మాత్రమే ఇంధనాన్ని ఫిల్ చేస్తున్నారు. ఆటో డ్రైవర్లు రెండు లీటర్ల డీజిల్ కోసమే గంటల తరబడి ఎదురు చూడాల్సి వస్తోంది.
రాష్ట్రంలో రబీ కోతల సీజన్ నడుస్తోంది. ఈ సమయంలో హార్వెస్టర్లు,ట్రాక్టర్లకు డీజిల్ అవసరం. డీజిల్ కొరత కారణంగా కోతలు ఆగిపోతే పంట నష్టం వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయంతోపాటు ఆక్వా రంగంపై కూడా ఈ ప్రభావం తీవ్రంగా ఉంది. రొయ్యలు, చేపల చెరువుల్లో ఏరియేటర్ల నిర్వహణకు డీజిల్ తప్పనిసరి. సరైన సమయంలో ఇంధనం అందకపోవడంతో సాగుపై ప్రతికూల ప్రభావం పడనుంది.
రాష్ట్రంలో ఒక్కసారిగా ఇంధన కొరత ఏర్పడటానికి కారణం ఆయిల్ కంపెనీలు క్రెడిట్ ఆప్షన్ రద్దు చేయడమే అని తెలుస్తోంది. సాధారణంగా పెట్రోల్ బంకులకు కంపెనీలు ఇంధనాన్ని సరఫరా చేసేటప్పుడు కొంత క్రెడిట్ సదుపాయం కల్పిస్తాయి. అయితే తాజాగా ఈ విధానం మార్చుకోవడంతో డీలర్లు ఇబ్బందులు పడుతున్నారు.
ఫలితంగా కంపెనీలు నుంచి బంకులకు రావాల్సిన సరఫరా తగ్గింది. దీనికి తోడు రబీ సీజన్ కావడంతో డీజిల్ డిమాండ్ పెరగడం కూడా కొరతకు ఒక కారణంగా అధికారులు చెబుతున్నారు.
రంగంలోకి దిగిన ప్రభుత్వం
రాష్ట్రంలో నెలకొన్న అసాధారణ పరిస్థితులపై ముఖ్యమంత్రి చంద్రబాబు అత్యున్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమస్యను కేవలం ఒక శాఖకు పరిమితం చేయకుండా ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్, పౌరసరఫరాల శాఖ అధికారులతో నేరుగా చర్చించారు. పెట్రోల్ బంకుల యజమానులు, ఆయిల్ కంపెనీలతో మాట్లాడి వెంటనే చర్యలు తీసుకోవాలని సరఫరా పునరుద్ధరించాలని ఆదేశించారు. గత ఏప్రిల్ నెలతో పోలిస్తే ఈసారి పది శాతం అదనపు ఇంధనాన్ని సరఫరా చేసేందుకు ఆయిల్ కంపెనీలు అంగీకరించాయని వెల్లడించారు. ప్రతి జిల్లాలో పరిస్థితిని కలెక్టర్లు స్వయంగా పర్యవేక్షించాలని, ఎక్కడా ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని స్పష్టం చేశారు.
ఏదైనా పెట్రోల్ బంకులో స్టాక్ సమస్య ఉంటే లేదా ఇబ్బందులు ఎదురైతే వెంటనే 1967 అనే టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేయాలని పౌరసరఫరాల శాఖ కమిషనర్ చెప్పారు. ఏపీ ఫ్యూయల్ డీలర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రావి గోపాలకృష్ణ నేతృత్వంలో డీలర్ల నుంచి ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరిస్తూ సరఫరా చైన్ను సరిచేస్తున్నారు.
వినియోగదారుల ఆవేదన
అధికారులు ఇంధన కొరత లేదని చెబుతున్నప్పటికీ వాస్తవ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని ప్రజలు అంటున్నారు. బంకుల వద్ద ఎదురు చూడాల్సి వస్తోందని, డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి ప్రభుత్వం చేపట్టిన చర్యల వల్ల సరఫరా మెరుగు పడుతుందని అధికారులు చెబుతున్నారు. అయితే వాహనదారులు ఆందోళన చెందవద్దని, అవసరానికి మించి చమురు నిల్వ చేసుకోవద్దని సూచిస్తున్నారు. స్టాక్ లేని బంకుల వివరాలు సేకరిస్తున్నామని, తద్వారా లోటు ఉన్న ప్రాంతాలకు తక్షణమే ట్యాంకర్లు పంపే ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు.
Frequently Asked Questions
ఆంధ్రప్రదేశ్లో ఇంధన కొరత ఏర్పడటానికి ప్రధాన కారణం ఏమిటి?
రైతులపై ఈ ఇంధన కొరత ఎలాంటి ప్రభావం చూపుతుంది?
రబీ సీజన్లో పంట కోతలు, ట్రాక్టర్ల వాడకానికి డీజిల్ అవసరం. సరఫరా లేకపోతే పంట నష్టం జరిగే అవకాశం ఉంది.
ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించడానికి ఎలాంటి చర్యలు తీసుకుంది?
ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించి, ఆయిల్ కంపెనీలతో మాట్లాడి సరఫరా పునరుద్ధరించాలని ఆదేశించారు. కలెక్టర్లకు పరిస్థితిని పర్యవేక్షించాలని సూచించారు.
ప్రజలు ఏవైనా ఇబ్బందులు ఎదుర్కొంటే ఎవరిని సంప్రదించాలి?
ఏదైనా పెట్రోల్ బంకులో స్టాక్ సమస్య ఉంటే లేదా ఇబ్బందులు ఎదురైతే వెంటనే 1967 అనే టోల్-ఫ్రీ నెంబర్కు కాల్ చేయవచ్చు.
ట్రెండింగ్ వార్తలు






















