Pawan Kalyan South Indian Temples Tour | పవన్ కళ్యాణ్ ఎందుకు కనిపించటం లేదంటే.! | ABP Desam
హైందవ ధర్మ పరిరక్షణ కోసం సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటే లక్ష్యంగా కృషి చేస్తున్న ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్..మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఐదు రోజుల పాటు దక్షిణ భారత దేశంలోని ప్రముఖ ఆలయాలను సందర్శించాలని నిర్ణయించుకున్నారు పవన్ కళ్యాణ్. అందులో భాగంగా కేరళ, తమిళనాడులోని ప్రముఖ ఆలయాలను పవన్ దర్శించుకోనున్నారు. వ్యక్తిగత పర్యటన కోసం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొద్దిరోజుల పాటు సింగపూర్ వెళ్లి వచ్చారు. అక్కడ ఆయన భార్య అన్నా లెజినోవా చదువుకుండటంతో కుటుంబంతో కలిసి కొద్ది రోజులు గడిపి తిరిగి ఈరోజు హైదరాబాద్ కు చేరుకున్నారు పవన్ కళ్యాణ్. రేపు హైదరాబాద్ నుంచి కేరళ పర్యటనకు బయల్దేరి వెళ్లనున్నారు. ముందుగా కేరళలోని త్రివేండ్రంకు చేరుకోవటంతో ఆలయాల సందర్శనను ప్రారంభించనున్నారు. త్రివేండ్రంలోని అనంతపద్మనాభ స్వామి ఆలయాన్ని పవన్ కళ్యాణ్ దర్శించుకోనున్నారు. అనంతరం కొచ్చి కి వెళ్లి అక్కడ ఆలయాలు..కొచ్చి ఫోర్ట్ ను సందర్శించనున్నారు. అనంతరం గురువాయూర్, త్రిసూర్ లలో పవన్ కళ్యాణ్ పర్యటన సాగనుంది. కేరళ పర్యటన తర్వాత పవన్ కళ్యాణ్ మూడు రోజుల పాటు తమిళనాడులో పర్యటించనున్నారు. అరక్కోణం, మధురై ప్రాంతాల్లో పవన్ పర్యటన సాగనుంది. పవన్ కళ్యాణ్ తో పాటు గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ కృష్ణ తేజ పర్యటనలో ఉండనున్నారు. గతంలో కేరళ టూరిజం డైరెక్టర్ గా చేసిన అనుభవం ఉండటంతో ఆలయాల సందర్శనకు పవన్ తనతో కృష్ణతేజను తీసుకువెళ్తున్నారు. పవన్ కళ్యాణ్ ఆలయాల సందర్శన గురించి ఉపముఖ్యమంత్రి కార్యాలయం గోప్యత పాటించే అవకాశం ఉంది. ఆయన సింగపూర్ పర్యటన గురించి ఎక్కడా సమాచారాన్ని వెల్లడించలేదు. వ్యక్తిగత పర్యటన కావటంతో వివరాలు వెల్లడించలేదని తెలుస్తోంది.



















