Annamayya District Elephants Attack | అన్నమయ్య జిల్లాలో ఏనుగుల బీభత్సం..ముగ్గురి మృతి | ABP Desam
అన్నమయ్య జిల్లాలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. ఓబులవారిపల్లె మండలం గుండాల కోన అటవీ ప్రాంతంలో గుంపులుగా వచ్చి ఏనుగులు భక్తులపై దాడి చేశాయి. ఈ దాడిలో ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందారు. మహాశివరాత్రి సందర్భంగా కొంత మంది భక్తులు శేషాచలం అడవుల్లో నుంచి తలకోనకు నడిచి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. నడిచి వెళ్తున్న భక్తులపైకి ఏనుగులు దూసుకురాగా...భక్తులు పెద్దగా అరవటంతో అవి మరింతగా రెచ్చిపోయాయి. భక్తులు పరుగులు తీస్తున్నా వెంటపడి మరీ తొక్కేశాయి. మృతులు ముగ్గురు కాకుండా మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వాళ్లను తిరుపతి రుయాకు తీసుకువెళ్లారు. మృతుల్లో ఇద్దరిని కన్నెగుంట ఎస్టీ కాలనీకి చెందిన మణెమ్మ, చెంగల్ రాయుడుగా పోలీసులు గుర్తించారు. మరొకరి వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనపై అటవీశాఖ మంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భక్తులపై ఏనుగులు దాడి చేసి ముగ్గురుని చంపేయటం బాధాకరమన్న పవన్ కళ్యాణ్...భక్తులు అటవీ మార్గంలో జంతువులు సంచరించే ప్రదేశాల్లోకి వెళ్లొద్దని విజ్ఞప్తి చేశారు. అటవీప్రాంతంలోనూ భద్రత పెంచాలని అటవీశాఖ అధికారులను ఆదేశించారు.మృతుల కుటుంబాలకు 10లక్షల పరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు 5లక్షల చొప్పున తక్షణ సాయం ప్రకటించారు. అటవీ ప్రాంతాల్లో ఉండే ఆలయాలకు భద్రత పెంచాలని అధికారులను ఆదేశించారు పవన్ కళ్యాణ్.





















