Andhra Pradesh Assembly on Nov 11th | వైసీపీనే వెంటాడుతూనే ఉన్న 11వ నెంబర్ | ABP Desam
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలను నవంబర్ పదకొండో తేదీ నుంచి జరగనున్నాయి. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి పూర్తి స్థాయి బడ్జెట్ను ఈ అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశ పెట్టనున్నారు. ఇప్పటికే బడ్జెట్ కసరత్తు పూర్తయింది. అయితే ఇప్పుడు ఖరారు చేసిన తేదీ , సమయం మాత్రం యాధృచ్చికంగా ఉన్నా.. అవి వైసీపీని సోషల్ మీడియాలో ట్రోల్ చేసేలా ఉండటం వైరల్ గా మారింది. వైసీపీకి పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అందుకే పదకొండు పేరుతో సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ ఉంటారు టీడీపీ , జననస, బీజేపీ పార్టీలకు చెందిన సోషల్ మీడియా కార్యకర్తలు. తాజాగా ఏపీ అసెంబ్లీ సమావేశాల తేదీలను ఖరారు చేశారు. అన్ని పదొకొండు వచ్చేలా ఖరారు చేశారు. పదకొండో తేదీన.. పదకొండు గంటలకు అసెంబ్లీ ప్రారంబమవుతుంది. వెంటనే బడ్జెట్ ప్రవేశ పెడతారు. అంటే పదకొండు గంటలకే బడ్జెట్ ప్రవేశ పెడతారు. ఈ సమావేశాలను పదకొండు రోజుల పాటు నిర్వహించాలని ప్రాధమికంగా నిర్ణయించినట్లుగా అధికారవర్గాలు చెబుతున్నాయి. మమాలుగా అయితే బీఏసీ సమావేశంలో ఖరారు చేశారు. సాధారణంగా ప్రధాన ప్రతిపక్షం కూడా లేనందున ప్రభుత్వం చెప్పినట్లుగానే అసెంబ్లీ జరుగుతుంది కాబట్టి.. అనుకుంటే పదకొండు రోజులే జరుగుతుంది. అంతకు మించి నవంబర్లో నెలలో జరుగుతున్న సమావేశాలు కావడంతో పదకొండో నెల.. పదకొండో తేదీ.. పదకొండు గంటలు.. పదకొండు రోజులు.. మరి ఆ పదకొండు మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వస్తారా అని టీడీపీ జనసేన సోషల్ మీడియా వైసీపీ ని ట్రోల్ చేస్తోంది. అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలా వద్దా అన్నదానిపై ఇంకా వైసీపీ ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదు.























