Revanth Reddy: సింగపూర్ పర్యటన సక్సెస్, ఇక దావోస్ నుంచి పెట్టుబడులపై తెలంగాణ సర్కార్ ఫోకస్
Telangana సీఎం రేవంత్ రెడ్డి బృందం సింగపూర్ పర్యటన ముగించుకుని దావోస్కు బయలుదేరింది. సోమవారం నుంచి జరగనున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సు (World Economic Forum)లో పెట్టుబడులు తేవడంపై ఫోకస్ చేసింది.

World Economic Forum 2025 | సింగపూర్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం సింగపూర్ పర్యటన విజయవంతంగా ముగిసింది. మూడు రోజుల పర్యటన ముగించుకుని సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రి శ్రీధర్ బాబు, అధికారులు ఆదివారం రాత్రి సింగపూర్ నుంచి బయలుదేరి సోమవారం దావోస్ కు చేరుకున్నారు. స్విట్జర్లాండ్లోని దావోస్లో జనవరి 20 నుంచి 24 వరకు ఐదు రోజులపాటు పాటు జరిగే వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ (World Economic Forum) వార్షిక సదస్సులో పాల్గొని రాష్ట్రానికి భారీ పెట్టుబడులు తేవడంపై ఫోకస్ చేశారు.
తెలంగాణకు ఉన్న అనుకూలతలను దావోస్ వేదికగా చాటి చెప్పి హైదరాబాద్ ను ప్రపంచ స్థాయి పెట్టుబడుల గమ్య స్థానంగా మార్చే దిశగా సీఎం రేవంత్ సారథ్యంలోని రాష్ట్ర ప్రతినిధి బృందం దావోస్ పర్యటిస్తోంది. సింగపూర్ పర్యటన విజయవంతం అయిందని, దాంతో దావోస్ సదస్సుపై భారీ అంచనాలు నెలకొన్నాయి. గత ఏడాది దావోస్ లో పర్యటించిన అనుభవంతో మరిన్ని పెట్టుబడులు తీసుకొస్తామని తెలంగాణ బృందం దీమాగా ఉంది.
సింగపూర్ పర్యటనలో చివరి రోజున సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం పలు ప్రధాన వ్యాపార సంస్థల అధినేతలు, సింగపూర్ బిజినెస్ ఫెడరేషన్ (SBF) ప్రతినిధులతో సమావేశమై చర్చలు జరిపింది. ఇండియన్ ఓషన్ గ్రూప్ ఫౌండర్ సీఈవో ప్రదీప్తో బిశ్వాస్, డీబీఎస్ గ్రూప్ హెడ్ అమిత్ శర్మ, డీబీఎస్ కంట్రీ హెడ్ లిమ్ హిమ్ చౌన్, మెయిన్ హార్డ్ గ్రూప్ సీఈవో ఒమర్ షాజాద్, బ్లాక్ స్టోన్ సింగపూర్ సీనియర్ ఎండీ, ఛైర్మన్ గౌతమ్ బెనర్జీతో పాటు బ్లాక్ స్టోన్ రియల్ ఎస్టేట్ సీనియర్ ఎండీ పెంగ్ వీ టాన్ తో చర్చలు జరిపింది. హైదరాబాద్ లో పెట్టుబడులు ఉన్న అవకాశాలతో పాటు పరిశ్రమల ఏర్పాటు, అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వ విధానాలను వారికి వివరించారు.
Hon’ble Chief Minister Shri @revanth_anumula led #TelanganaRising delegation closed its Singapore leg of its two-nation tour with several one-on-one exclusive meetings with major business houses and members of the Singapore Business Federation (SBF).
— Telangana CMO (@TelanganaCMO) January 19, 2025
Along with IT & Industries… pic.twitter.com/rIJj2I9YGj
సింగపూర్ పర్యటన సక్సెస్
రాష్ట్ర ప్రతినిధి బృందం మూడు రోజుల పాటు సింగపూర్లో బిజీ బిజీగా గడిపింది. పలు రంగాల్లో ప్రపంచ స్థాయి సంస్థల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలతో సీఎం రేవంత్ నేతృత్వంలోని బృందం కీలక చర్చల్లో పాల్గొంది. సింగపూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ITE) తో తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ (Young India Skill University) ఒప్పందం చేసుకోవడంతో పాటు ఆశించిన పెట్టుబడుల ఒప్పందాలు జరిగాయి.
హైదరాబాద్ లోని ఫ్యూచర్ సిటీ (Hyderabad Future City)లో ఎస్టీ టెలీ మీడియా గ్లోబల్ డేటా సెంటర్ అత్యాధునిక ఏఐ ఆధారిత డేటా సెంటర్ ఏర్పాటుకు ముందుకు వచ్చింది. రూ. 3,500 కోట్ల పెట్టుబడులకు తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. క్యాపిటల్ ల్యాండ్ కంపెనీ హైదరాబాద్ లో భారీ ఐటీ పార్కు ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. దాదాపు రూ.450 కోట్లతో ఈ ఐటీ పార్కును అభివృద్ధి చేయనుంది. తెలంగాణలో సెమీ కండక్టర్ల తయారీ పరిశ్రమలు, పెట్టుబడుల అవకాశాలపై అక్కడి సెమీ కండక్టర్ ఇండస్ట్రీ అసోసియేషన్ తో జరిపిన చర్చలు సక్సెస్ అయ్యాయని రాష్ట్ర బృందం తెలిపింది.






















