Kothagudem Earthquake: భద్రాద్రి కొత్తగూడెంలో భూకంపం.. అర్ధరాత్రి ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసిన ప్రజలు
Earthquake in Bhadradri Kothagudem | భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో శనివారం అర్ధరాత్రి దాటిన తరువాత భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై తీవ్రత 3.8గా నమోదైనట్లు NCS తెలిపింది.

Kothagudem Earthquake | కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత స్వల్ప భూకంపం సంభవించింది. జాతీయ భూకంప విజ్ఞాన కేంద్రం (NCS) వెల్లడించిన వివరాల ప్రకారం.. జూన్ 14 (ఆదివారం) తెల్లవారుజామున దాదాపు 2:26 గంటల సమయంలో భూమి కంపించింది. రిక్టర్ స్కేల్పై ఈ భూకంప తీవ్రత 3.8గా నమోదైనట్లు అధికారులు తెలిపారు. అర్ధరాత్రి సమయం కావడంతో గాఢ నిద్రలో ఉన్న ప్రజలు భూ ప్రకంపనలకు ఉలిక్కి పడి నిద్రలేచారు. ప్రాణ భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రికి వాయువ్య దిశగా సుమారు 111 కిలోమీటర్ల దూరంలో, భూమి లోపల 10 కిలోమీటర్ల లోతులో ఈ భూకంప కేంద్రం ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. అర్ధరాత్రి వేళ భూమి కదులుతున్నట్లు అనిపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. భూకంప తీవ్రత తక్కువగానే ఉన్నప్పటికీ, కొన్ని సెకన్లపాటు ప్రకంపనలు రావడం ప్రజలను భయాందోళనకు గురిచేసింది.
EQ of M: 3.8, On: 14/06/2026 02:26:35 IST, Lat: 17.492 N, Long: 80.894 E, Depth: 10 Km, Location: Bhadradri Kothagudem, Telangana.
— National Center for Seismology (@NCS_Earthquake) June 13, 2026
For more information Download the BhooKamp App https://t.co/5gCOtjdtw0 @DrJitendraSingh @OfficeOfDrJS @DrNKalaiselvi @GSuresh_NCS pic.twitter.com/lze5k0b1Ax
సాధారణంగా రిక్టర్ స్కేలుపై 3.5 కంటే తక్కువ తీవ్రత నమోదైతే భూకంపం సంభవించినట్లు అంతగా అనిపించదు, కానీ పరికరాల ద్వారా రికార్డవుతుంది. 3.5 నుండి 5.4 మధ్య తీవ్రత నమోదైతే ప్రజలకు భూకంపం వచ్చినట్లు స్పష్టంగా తెలుస్తుంది, కానీ పెద్దగా నష్టం జరగదని అధికారులు తెలిపారు.
ఫిబ్రవరిలో మేడ్చల్ జిల్లాలో భూకంపం..
సాధారణంగా తెలంగాణలో భూకంపాల తీవ్రత తక్కువగానే ఉంటుంది. రాష్ట్రంలో ఈ ఏడాది ఫిబ్రవరి 10న మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో భూకంపం సంభవించింది. మేడ్చల్ జిల్లాలోని కుత్బుల్లాపూర్, గాజులరామారం సహా పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. కుత్బుల్లాపూర్ మండల పరిధిలోని గాజులరామారం, ఆదర్శనగర్ ప్రాంతాల్లో భూమి కంపించింది. కొన్ని సెకన్ల పాటు భూమి కంపించడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. ఏం జరుగుతుందోనని భయపడి ప్రజలు తమ ఇళ్ల నుంచి వీధుల్లోకి పరుగులు తీశారు. ముఖ్యంగా స్కూల్లో ఉన్న చిన్నపిల్లలు తీవ్ర భయాందోళనల మధ్య క్లాస్ రూమ్స్ నుంచి బయటకు వచ్చారు. భూప్రకంపనలతో ఆ పరిధిలోని స్కూళ్లకు సెలవు ఇచ్చి, విద్యార్థులను ఇళ్లకు పంపించివేయడం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ఆ సమయంలో సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
అయితే, 2025 ఆగస్టు 14న వికారాబాద్ జిల్లా, దాని పరిసర ప్రాంతాలలో స్వల్ప భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. జాతీయ భూకంప విజ్ఞాన కేంద్రం (NCS) తెలిపిన వివరాల ప్రకారం.. రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 3.1గా నమోదైంది. భూగర్భంలో 10 కిలోమీటర్ల లోతులో ఈ కదలికలు సంభవించాయి.
ట్రెండింగ్ వార్తలు























