Bhadrachalam Temple: 3 దశలలో భద్రాచల శ్రీ సీతారామచంద్రమూర్తి ఆలయ అభివృద్ధి.. సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
Bhadrachalam Temple | భద్రాచల శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయాన్ని మూడు దశల్లో ఆగమశాస్త్రానుసారం అభివృద్ధి చేయాలని, 2027 మార్చి నాటికి తొలిదశ పనులు పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.

భద్రాచల శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానాన్ని అంతర్జాతీయ స్థాయి ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ఆలయ అభివృద్ధికి సంబంధించిన 3 దశల మాస్టర్ ప్లాన్ను ఖరారు చేశారు. ఈ భేటీలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు కొండా సురేఖ, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి తదితరులు పాల్గొని, దక్షిణ అయోధ్యగా పిలుచుకునే భద్రాద్రి వైభవాన్ని చాటేలా అభివృద్ధి పనులు ఉండాలని నిర్ణయించారు.
2027 మార్చి నాటికి మొదటి దశ పనులు పూర్తి..
ఆగమశాస్త్ర నిబంధనలకు, ఆలయ సహజత్వానికి ఎలాంటి భంగం కలగకుండా ఈ పనులు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా 2027లో రానున్న గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని, మొదటి దశ పనులను 2027 మార్చి 31 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో భాగంగా పుష్కర ఘాట్ల నిర్మాణం, భక్తులకు అవసరమైన క్యూ లైన్లు, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఇప్పటికే పూర్తయిన భూసేకరణకు అనుగుణంగా సిద్ధం చేసిన పలు డిజైన్లను సీఎం రేవంత్ ఈ సందర్భంగా పరిశీలించారు.
గోదావరి పుష్కరాల తర్వాత రెండో, మూడో దశల్లో ఆలయ పరిసరాల విస్తరణ, ఆధ్యాత్మిక కారిడార్ అభివృద్ధి వంటి పనులను చేపట్టనున్నారు. రాబోయే 200 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రణాళికలు ఉండాలని, భక్తులకు ఎక్కడా ఇబ్బంది కలగకుండా దశలవారీగా పనులు పూర్తి చేయాలని సీఎం స్పష్టం చేశారు. దీనికోసం అవసరమైన నిధుల అంచనాలు, వివరణాత్మక ప్రాజెక్ట్ నివేదికలను (DPR) త్వరితగతిన సిద్ధం చేయాలని అధికారులను రేవంత్ రెడ్డి ఆదేశించారు.
Before You Go
Peerzadiguda Software Tejaswini | అజయ్ వద్దు.. వద్దు.. అర్దరాత్రి అరుపులు
ట్రెండింగ్ వార్తలు























