CM Revanth Reddy: 'మద్యం సరఫరా కంపెనీల విషయంలో పారదర్శకత' - బీర్ల ధరలపై అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
Telangana News: మద్యం సరఫరా కంపెనీల ఎంపికలో పారదర్శక విధానం పాటించాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. బీర్ల ధరలను పెంచాలన్న కంపెనీల ఒత్తిడిపై తీవ్రంగా స్పందించిన ఆయన అలా కుదరదని తేల్చిచెప్పారు.

CM Revanth Reddy Review On Excise Department: రాష్ట్రంలో మద్యం సరఫరా చేసేందుకు ముందుకు వచ్చే కంపెనీలను ఎంపిక చేసేందుకు పారదర్శక విధానం పాటించాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి (CM Revanth Reddy) అధికారులను ఆదేశించారు. ఎక్సైజ్ శాఖపై నిర్వహించిన సమీక్షలో ఆయన అధికారులకు కీలక సూచనలు చేశారు. ఇప్పటికే టీజీబీసీఎల్కు సరఫరా చేస్తున్న కంపెనీలు కొత్త బ్రాండ్లు సరఫరా చేసేందుకు సులభతర వాణిజ్య విధానం అనుసరించాలని చెప్పారు. కొత్త కంపెనీలను అనుమతించే విషయంలో నిబంధనలు పాటించాలని స్పష్టం చేశారు. కొత్త కంపెనీల నుంచి అప్లికేషన్లు తీసుకునేందుకు నోటిఫికేషన్ జారీ చేసి, కనీసం నెల రోజులు నిర్ణీత గడువు ఇవ్వాలని ఆదేశించారు. ఆ కంపెనీలు తమ బ్రాండ్ల పేర్లతో దరఖాస్తు చేసుకోవాలని.. సదరు కంపెనీల నాణ్యత ప్రమాణాలు, సరఫరా సామర్థ్యం పరిశీలించి పారదర్శకంగా ఈ ఎంపిక ప్రక్రియ చేపట్టాలని చెప్పారు. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి రిజ్వీ, ఎక్సైజ్ కమీషనర్ హరికిరణ్ పాల్గొన్నారు.
బీర్ల ధరలపై..
ఇటీవల యునైటెడ్ బేవరేజస్ కంపెనీ బీర్ల రేట్లను 33.1 శాతం పెంచాలని ఒత్తిడి చేసిందని అధికారులు సీఎం రేవంత్ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై తీవ్రంగా స్పందించిన సీఎం.. కంపెనీల ఒత్తిడికి తలొగ్గేది లేదని.. పొరుగున ఉన్న ఏపీ, మహారాష్ట్రతో పాటు ఇతర రాష్ట్రాల్లో ఉన్న బీర్ల ధరలను పరిశీలించాలని సూచించారు. హైకోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలోని ధరల నిర్ణయ కమిటీ (ప్రైస్ ఫిక్సేషన్ కమిటీ) నివేదిక ఆధారంగా ధరల పెంపుపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు. ఏడాదిగా ఎక్సైజ్ శాఖకు ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లిస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు క్రమంగా క్లియర్ చేయాలని ఆర్ధిక శాఖ అధికారులను ఆదేశించారు.
ఆ బీర్ల సరఫరా నిలిపేసిన కంపెనీ
యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్ (UBL) కంపెనీ ఉత్పత్తి చేసే కింగ్ ఫిషర్, హీనెకెన్ బీర్ల సరఫరాను తెలంగాణలో నిలుపుదల చేస్తున్నట్లు ప్రకటించింది. పాత బకాయిలు చెల్లించకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. సెబీ లిస్టింగ్ రెగ్యులేషన్స్లోని రెగ్యులేషన్ 30కి అనుగుణంగా.. తెలంగాణ బేవరెజెస్ కార్పొరేషన్ లిమిటెడ్కు వెంటనే బీర్ల సరఫరాను నిలిపేయాలని కంపెనీ నిర్ణయించింది. కంపెనీ బీర్ ప్రాథమిక ధరను 2019 - 20 నుంచి సవరించలేదని టీజీబీసీఎల్ (TGBCL) తెలిపింది. దీంతో తెలంగాణలో భారీ నష్టాలు చవిచూశామని పేర్కొంది. దీంతో పాటు గతంలో సరఫరా చేసిన బీర్లకు చెల్లించాల్సిన బకాయిలు భారీగా ఉన్నాయని వెల్లడించింది. ఈ క్రమంలో బీర్ల సరఫరా నిలిపేస్తున్నట్లు ప్రకటించింది. గత 2 త్రైమాసిక బకాయిలు రూ.900 కోట్లని యూబీఎల్ పేర్కొంది. పండుగ సీజన్, మరో త్రైమాసిక అమ్మకాలతో తెలంగాణ నుంచి రూ.1000 కోట్లకు పైగా బకాయిలు ఉంటాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

