Revanth Hybrid Model: రేవంత్ హైబ్రిడ్ నమూనా - మహారాష్ట్ర, గుజరాత్కే లాభం - దక్షిణాదికి నష్టమే!
Delimitation: రేవంత్ హైబ్రీడ్ మోడల్ తో దక్షిణాదికి అన్యాయం జరుగుతుందని లెక్కలు చెబుతున్నాయి. జీడీపీ పరంగా ముందున్న గుజరాత్, మహారాష్ట్రాలకు భారీగా మేలు జరుగుతుంది.

Revanth hybrid model Delimitation: నియోజకవర్గాల పునర్విభజన అంశం చుట్టూ రాజకీయం నడుస్తోంది. జనాభా ప్రాతిపదికన సీట్ల కేటాయింపు జరిగితే, కుటుంబ నియంత్రణ పాటించిన దక్షిణాది రాష్ట్రాలు శిక్షకు గురవుతాయనే ఆందోళన అందరిలోనూ ఉంది. అందుకే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపాదించిన 50:50 హైబ్రిడ్ మోడల్ ఆకర్షణీయంగా కనిపిస్తున్నప్పటికీ, లోతుగా విశ్లేషిస్తే అది పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్లు యారవుతుందనే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి.
హైబ్రిడ్ మోడల్ వెనుక అసలు లెక్క
కేంద్ర పాలిత ప్రాంతాలను మినహాయిస్తే దేశవ్యాప్తంగా రాష్ట్రాల్లో లోక్సభ స్థానాలను 816కు పెంచి, అందులో సగం జనాభాకు (408), మిగిలిన సగం ఆర్థిక వృద్ధి రేటు లేదా జీడీపీకి (408) కేటాయించాలన్నది రేవంత్ రెడ్డి ప్రతిపాదన. జనాభా తక్కువగా ఉన్నా, దేశ ఖజానాకు అత్యధికంగా పన్నులు కడుతున్న దక్షిణాది రాష్ట్రాలకు ఆర్థిక ప్రాతిపదికన న్యాయం జరుగుతుందని ఆయన వాదన. అయితే, ఈ గణాంకాలను సూక్ష్మంగా పరిశీలిస్తే, ఇది దక్షిణాదికి మేలు చేయడం కంటే ఉత్తర ,పశ్చిమ రాష్ట్రాల కూటమిని తిరుగులేని శక్తిగా మార్చే ప్రమాదం పొంచి ఉంది.
మహారాష్ట్ర-గుజరాత్ పొలిటికల్ పవర్ హౌస్
ఈ ఫార్ములా అమలులోకి వస్తే దేశ రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోతుంది. ప్రస్తుతం దేశ జిడిపిలో సింహభాగం కలిగి ఉన్న మహారాష్ట్ర, పారిశ్రామికంగా వేగంగా దూసుకుపోతున్న గుజరాత్ రాష్ట్రాలకు ఆర్థిక కేటాయింపుల కింద భారీగా సీట్లు లభిస్తాయి. ప్రస్తుతం ఈ రెండు రాష్ట్రాల ఉమ్మడి బలం 12.5 శాతంగా ఉండగా, రేవంత్ మోడల్లో అది ఏకంగా 18 శాతానికి చేరుకుంటుంది. అంటే, రేపటి రోజున దేశ ప్రధాని ఎవరవ్వాలి అనే నిర్ణయం కేవలం ఈ రెండు రాష్ట్రాల చేతుల్లోనే ఉండే అవకాశం ఉంది. ఇది దేశ సమాఖ్య స్పూర్తికి విఘాతం కలిగించడమే కాకుండా, దక్షిణాది ప్రాధాన్యతను మరింత తగ్గిస్తుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
తెలుగు రాష్ట్రాలకు తీరని అన్యాయం
తెలుగు రాష్ట్రాల ప్రయోజనాలను ఈ నమూనాలో బేరీజు వేస్తే ఫలితాలు నిరాశాజనకంగా ఉన్నాయి. 816 సీట్ల భారీ సభలో ఆంధ్రప్రదేశ్ కేవలం 36 స్థానాలకే, తెలంగాణ 32 స్థానాలకే పరిమితమవుతున్నాయి. అదే సమయంలో ఉత్తరప్రదేశ్ 102 స్థానాలతో తన పెద్దన్న పాత్రను మరింత సుస్థిరం చేసుకోనుంది. అంటే జనాభా ప్రాతిపదికన జరిగే అన్యాయాన్ని అరికట్టాలని చూస్తుంటే, ఆర్థిక ప్రాతిపదికన కూడా దక్షిణాదికి ఆశించిన స్థాయిలో ప్రాతినిధ్యం లభించడం లేదన్నది స్పష్టమవుతోంది.
ఢిల్లీ వంటి చిన్న రాష్ట్రాల హవా
ఈ ఫార్ములాలో మరో విచిత్రమైన పరిణామం ఏమిటంటే.. భౌగోళికంగా చిన్నదైన ఢిల్లీ వంటి రాష్ట్రం తన ఆర్థిక వాటాతో ఏకంగా 24 లోక్సభ స్థానాలను పొందే అవకాశం ఉంది. ఆర్థికంగా వెనుకబడిన బీహార్, రాజస్థాన్ వంటి రాష్ట్రాలు కూడా తమకున్న జనాభా బలం వల్ల అదనపు సీట్లను పొందుతాయి. ఇలాంటి పరిస్థితిలో దేశ పారిశ్రామిక కేంద్రంగా మారిన దక్షిణాది రాష్ట్రాలు, ఆర్థికంగా బాధ్యతాయుతంగా ఉన్నందుకు తగిన గుర్తింపు లభించకపోగా, రాజకీయ ప్రాబల్యాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని అంటున్నారు.
రక్షణ కవచం ప్రోరాటా విధానం మాత్రమే!
రేవంత్ రెడ్డి ప్రతిపాదన కేవలం ఒక చర్చకు దారితీసినప్పటికీ, అది శాస్త్రీయంగా దక్షిణాది రాష్ట్రాలకు రక్షణ ఇవ్వడం లేదు. జనాభా నియంత్రణ పాటించినందుకు దక్షిణాది రాష్ట్రాల సీట్ల సంఖ్య తగ్గకుండా ఉండాలంటే, ప్రస్తుతం ఉన్న 24 శాతం సీట్ల కోటాను అలాగే కొనసాగించే Pro rata basis ఏకైక మార్గం. జనాభా పెరిగినా, సీట్ల సంఖ్య పెరిగినా.. దేశ మొత్తం సీట్లలో దక్షిణాది వాటా ప్రస్తుతం ఉన్న శాతానికి తగ్గకుండా రాజ్యాంగ సవరణ చేయడమే నిజమైన పరిష్కారం. అంతేకానీ, కొత్త ప్రయోగాలు చేయడం వల్ల పరోక్షంగా ఉత్తర, పశ్చిమ రాష్ట్రాల ఆధిపత్యాన్ని అంగీకరించినట్లే అవుతుందని చెబుతున్నారు.
ట్రెండింగ్ వార్తలు






















