Shabad Mass Murder Accused Selfie Video: అమ్మాయి కుటుంబం మోసం చేసింది - షాబాద్ సైకో కిల్లర్ రాజ్కుమార్ సెల్ఫీ వీడియోలో సంచలన విషయాలు
Psychopath Rajkumar Mobile Video Recovered: అమ్మాయి కుటుంబం తనను మోసం చేసిందని.. ఆర్థికంగా ఉపయోగించుకుని తప్పుడు కేసులు పెట్టారని సైకో రాజ్ కుమార్ వీడియో రికార్డు చేశాడు. పోలీసులకు ఈ వీడియో లభించింది.

Rajkumar Dying Declaration Video: పెను సంచలనం సృష్టించిన షాబాద్ ఆరుగురి హత్యల కేసులో దర్యాప్తు జరుపుతున్న పోలీసులకు నిందితుడు రాజ్కుమార్ మొబైల్ ఫోన్లో అత్యంత షాకింగ్ వీడియో ఒకటి లభ్యమైంది. ఆరు హత్యలు చేసే ముందే సైకో కిల్లర్ తన మొబైల్లో ఈ సెల్ఫీ వీడియోను రికార్డ్ చేసినట్లు విచారణలో తేలింది. ఆ వీడియోను పోలీసులు మీడియాకు చూపించారు. ఈ వీడియో.. ఆ ఉన్మాది మానసిక స్థితిని, ప్రతీకారేచ్ఛను స్పష్టంగా బయటపెట్టింది. నిందితుడి మృతదేహం లభ్యమైన ప్రాంతంలోనే అతని మొబైల్ ఫోన్ కూడా దొరికిందని సైబరాబాద్ సీపీ తరుణ్ జోషి స్పష్టం చేశారు. జులై 10వ తేదీ సాయంత్రం 4:55 గంటల ప్రాంతంలో రికార్డ్ చేసిన ఈ వీడియోలో.. ఆరుగురు అమాయకులను పాశవికంగా ఊచకోత కోయడానికి ముందు తనలో ఉన్న నేరపూరిత ఆలోచనలను, ప్రతీకారేచ్ఛను ఆ ఉన్మాది సుదీర్ఘంగా వివరించాడు.
ఆర్థిక మోసాలు, నమ్మకద్రోహమే ఈ ఘాతుకానికి ప్రధాన కారణమని ప్రాథమిక విచారణలో తేలింది. సదరు సెల్ఫీ వీడియోలో రాజ్కుమార్.. ఒక అమ్మాయిని గుడ్డిగా నమ్మి సర్వస్వం కోల్పోయానని, తన సంపాదనలో సగానికి పైగా వారి కోసమే ఖర్చు పెట్టానని చెప్పుకొచ్చాడు. తన దగ్గర నుండి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసి, తనను పూర్తిగా నష్టాల్లోకి నెట్టేసి, చివరికి కన్న పిల్లలకు చేతిలో పైసా, ఉండడానికి కాస్త భూమి కూడా లేకుండా రోడ్డున పడేశారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. అంతటితో ఆగకుండా, తను సర్వం కోల్పోయాక తనపైనే అక్రమంగా కేసులు పెట్టి జైలుకు పంపాలని సదరు వ్యక్తులు కుట్రలు పన్నారని, ఆ మానసిక క్షోభ భరించలేకే తాను ఈ మారణహోమానికి, ఆపై అఘాయిత్యానికి ఒడిగడుతున్నట్లు వీడియోలో పేర్కొన్నాడు.
అయితే, నిందితుడు రాజ్కుమార్ వీడియోలో ఎంతగా కన్నీటిపర్యంతమవుతూ సాకులు వెతికినప్పటికీ.. ఒకే రాత్రి తన భార్యాపిల్లలతో సహా ఆరుగురు అమాయకులను గొంతులు కోసి చంపిన అతని రాక్షసత్వానికి ఏమాత్రం సానుభూతి పొందే అర్హత లేదని సామాన్య జనం మండిపడుతున్నారు. తనను మోసం చేసిన వారిపై చట్టపరంగా పోరాడాల్సింది పోయి.. కన్నకూతురు, 18 నెలల పసికందు అని కూడా చూడకుండా కన్నబిడ్డలను కసాయిలా హతమార్చడం అతనిలోని వికృత సైకో మనస్తత్వానికి నిదర్శనం. ప్రస్తుతం ఈ సెల్ఫీ వీడియో ఆధారంగా పోలీసులు కేసును అన్ని కోణాల్లో లోతుగా విచారిస్తూ, అతనికి సహకరించిన , ఈ పరిస్థితికి కారణమైన ఇతరుల పాత్రపై కూడా ఆరా తీస్తున్నారు.
మేనమామ ఊళ్లో విషం తాగి చనిపోయిన రాజ్ కుమార్
షాబాద్ మండలానికి చెందిన 35 ఏళ్ల రాజ్కుమార్పై గతంలో ఓ 17 ఏళ్ల మైనర్ బాలికను వేధించినందుకు గానూ పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. ఈ కేసులో ఇటీవలే బెయిల్ పై బయటకు వచ్చిన రాజ్కుమార్, తనపై కేసు పెట్టిన వారిపై పగ పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే అత్యంత క్రూరమైన ప్రతీకార ప్రణాళికతో ఒకే రాత్రి ఆ బాలిక కుటుంబంతో పాటు తన కుటుంబాన్ని కూడా ఊచకోత కోశాడు. నిందితుడు మొదట షాబాద్ పట్టణంలోని పీఆర్ఆర్ స్టేడియం సమీపంలో ఉన్న సదరు మైనర్ బాలిక ఇంటిపై దాడి చేశాడు. బాలికను బలవంతంగా లాక్కెళ్లేందుకు ప్రయత్నించగా.. అడ్డువచ్చిన ఆమె తల్లి, నాయనమ్మలను కత్తితో పొడిచి చంపాడు. అనంతరం ఆ బాలికను అఖిల్ సాగర్ చెరువు సమీపంలోకి తీసుకెళ్లి పీక కోసి దారుణంగా హతమార్చాడు. ఈ ఘాతుకం ముగిసిన వెంటనే తన సొంత గ్రామానికి కార్లో ప్రయాణమై.. ఇంట్లో నిద్రిస్తున్న తన భార్య సరిత , తన ఇద్దరు కన్నబిడ్డలు గొంతులు కోసి అత్యంత పాశవికంగా చంపేశాడు. ఆ తర్వాత పారిపోయాడు.. ఆత్మహత్య చేసుకున్నాడు.
ట్రెండింగ్ వార్తలు






















