Revanth Reddy: అది దెయ్యాల రాష్ట్ర సమితి - పొలిమేరల వరకూ తరిమికొట్టాలి - రేవంత్ పిలుపు
CM Revanth: బీఆర్ఎస్ పై రేవంత్ రెడ్డి ఘాటు విమర్శలు చేశారు. అది బీఆర్ఎస్ కాదని..డీఆర్ఎస్ అన్నారు. అంటే దెయ్యాల రాష్ట్ర సమితి అన్నారు.

Revanth Reddy on BRS: భారత రాష్ట్ర సమితిపై రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆ ఇంటి బిడ్డనే చుట్టూ దయ్యాలు ఉన్నాయని బయటపెట్టినా… ఆ దయ్యాల నాయకుడు సమాధానం చెప్పడం లేదన్నారు. అది బీఆర్ఎస్ కాదు డీఆరెస్.. భారత రాష్ట్ర సమితి కాదు… దెయ్యాల రాష్ట్ర సమితి ..ఈ కొరివి దెయ్యాలను తెలంగాణ పొలిమేరల వరకు తరిమికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం తిర్మలాపురంలో ప్రజాపాలన-ప్రగతిబాట బహిరంగ సభలో రేవంత్ ప్రసంగించారు.
పదేళ్లు దోచుకుతిన్న రాబందులు మమ్మల్ని ప్రశ్నిస్తారట…ఒక్క నోటీసు ఇస్తేనే ఆయన ఆగమాగం అయితుండు… జవాబు చెప్పాల్సింది పోయి విమర్శలు చేస్తుండని మండిపడ్డారు. ముందు నీ బిడ్డ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని కేసీఆర్ ను డిమాండ్ చేశారు. తిరుమల తరహాలో యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్మెంట్ బోర్డును ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నాం .. యాదగిరిగుట్ట అలయం ఆధ్వర్యంలో మెడికల్ కళాశాలను యూనివర్సిటీ స్థాయికి అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని ప్రకటించారు.
నవంబర్ 8న పాదయాత్ర చేసి మూసీ నదిని ప్రక్షాళన చేసి తీరతామని మాట ఇచ్చానని... ఎవరు అడ్డుపడినా మూసీ పునరుజ్జీవనం చేసి తీరుతామని హామీ ఇచ్చారు. మోదీ సబర్మతి, గంగా నది ప్రక్షాళన చేసుకోవచ్చుగానీ మేం మూసీ ప్రక్షాళన చేసుకోవద్దా?మా నల్లగొండల బిడ్డలు మూసీ మురికి కూపంలో బ్రతకావాల్సిందేనా? అని ప్రశ్నించారు. ఎవరేం అనుకున్నా సరే… మూసీ ప్రక్షాళన చేసి తీరుతామన్నారు. నల్లగొండ గడ్డ చైతన్యానికి మారుపేరు .. నిజాంనవాబులను దిగంతాలకు తరిమిన చరిత్ర నల్లగొండదన్నారు. ఎవరో ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తే నల్లగొండ బిడ్డలు చూస్తూ ఊరుకోరు ..గత బీఆరెస్ పదేళ్లపాలనలో నల్లగొండకు వాళ్లు చేసిందేం లేదని గుర్తుచేశారు.
ఎస్ఎల్బీసీ, బునాదిగాని కాలువ.. ఇలా పదేళ్లలో ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తిచేయలేదు. ఆనాడు వాసాలమర్రికి వచ్చి… ఆకుల ఆగవ్వకు అల్లనేరేడు పండు ఇచ్చి ఆసుపత్రిపాలు చేసిండు .. వాసాలమర్రిలో ఇండ్లు కూలగొట్టి స్మశానంగా మార్చిండని మండిపడ్డారు. ఆయన ఆగం చేసినా వాసాలమర్రి పరిస్థితిని బాగు చేయాలని మా నాయకులను ఆదేశిస్తున్నానని... మేం అధికారంలోకి రాగానే ఒక్కొక్కటిగా చక్కదిద్దుకుంటూ ముందుకు వెళుతున్నామన్నారు. నీళ్లు ఎలా ఇస్తారని కొందరు మాట్లాడుతున్నారు ..ఎస్ఆరెస్పీ, మిడ్ మానేరు కట్టిందెవరు..ప్రాజెక్టులు కట్టిన మాకు గంధమల్లకు నీళ్లు ఎట్లా ఇవ్వాలో మాకు తెలియదా? అని ప్రశ్నించారు.
ప్రజాపాలనలో ఆడబిడ్డలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్నికల్పించామని గుర్తు చేశారు. రూ. 500 లకే గ్యాస్ సిలిండర్ అందించాం.. మహిళా సంఘాలకు రూ.21 వేల కోట్లు బ్యాంకు లింకేజీ రుణాలు ఇచ్చింది నిజం కాదా? ..అమ్మ ఆదర్శ పాఠశాలల పేరుతో పాఠశాలల నిర్వహణ ఆడబిడ్డల చేతిలో పెట్టింది నిజం కాదా అని ప్రశ్నించారు. కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయాలని మేం ప్రయత్నిస్తుంటే కొంతమంది ఏడుస్తున్నారన్నారు.
రూ. 2 లక్షల రుణమాఫీ చేసి రైతులను రుణ విముక్తులను చేసింది నిజం కాదా ..రైతులు పండించిన ప్రతీ గింజ కొంటూ రైతులను ఆదుకుంటుంటే కడుపులో విషం పెట్టుకుని కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. కులగణన ద్వారా బీసీల లెక్క తేల్చి 42 శాతంరిజర్వేషన్లు కల్పించేందుకు చట్టం చేశాం… కేంద్ర ప్రభుత్వం కులగణన చేసే అనివార్యతను కల్పించాం.. ఎస్సీవర్గీకరణ చేసి దశాబ్దాల పోరాటాల కలను నెరవేర్చాం ..ఇంతకంటే నాకు ఇంకా కావాలని ప్రశ్నించారు.నాకు ఇక వేరే కోరిక లేదు… తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే ఆదర్శవంతంగా తీర్చిదిద్దడమే నా కర్తవ్యమన్నారు.





















