Revanth Chitchat: 3 అనుమానాస్పద మరణాలకు కేటీఆర్కు లింకేంటి ? - ఢిల్లీలో సీఎం రేవంత్ చిట్ చాట్
Telangana: ఢిల్లీలో మీడియా ప్రతినిధులతో రేవంత్ ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ఇందులో మూడు అనుమానాస్పద మరణాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.

Telangana CM Revanth Reddy: తెలంగాణలో మూడు అనుమానాస్పద మరణాలు చోటు చేసుకున్నాయని రేవంత్ రెడ్డి ఢిల్లీలో మీడియా ప్రతినిధులతో నిర్వహించిన ఇష్టాగోష్టిలో చెప్పారు. ఒకరు మేడిగడ్డపై కేసులు వేసిన రాజలింగమూర్తి, రెండు సినీ నిర్మాత కేదార్, మూడు వీరిద్దరి కేసులను వాదిస్తున్న సంజీవరెడ్డి అనే లాయర్ అని చెప్పారు. సినీ నిర్మాత కేదార్ కేటీఆర్ బిజినెస్ పార్టనర్ అన్నారు. ఈ మరణాలపై కేటీఆర్ ఎందుకు విచారణకు ఆదేశించడం లేదని ప్రశ్నించారు. కేదార్ అనే సినీ నిర్మాత విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండతో గం గం గణేశా అనే సినిమా తీశారు. విజయ్ దేవరకొండతో ఓ సినిమా ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే ఓ సినీ పైనాన్షియర్ ఇంట్లో పెళ్లి వేడుకల కోసం దుబాయ్ వెళ్లిన ఆయన అక్కడ చనిపోయారు. ఏం జరిగిందన్నదానిపై స్పష్టత లేదు.
అయితే సీఎం రేవంత్ రెడ్డి మాత్రం దుబాయ్ తో కేదార్ తో పాటు బీఆర్ఎస్ కు చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే ఉన్నారని అక్కడ ఎందుకు ఉన్నారని ప్రశ్నిస్తున్నారు. డ్రగ్స్ కేసులు త్వరలో విచారణకు వస్తున్న సమయంలో ఇలాంటి మరణాలు అనుమానాస్పదమేనని స్పష్టం చేశారు. తన వ్యాపార భాగస్వామి మరణంపై కేటీఆర్ ఎందుకు స్పందించడం లేదని కేటీఆర్ ప్రశ్నించారు. వీటిపై విచారణకు కేటీఆర్ ఎందుకు డిమాండ్ చేయరని ప్రశ్నించారు. ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తే తాము విచారణ చేయిస్తామన్నారు.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఆలస్యం చేస్తోంది కేంద్రమేనని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. విదేశాల్లో ఉన్న వారిని తీసుకు రావాల్సింది ఎవరని రేవంత్ ప్రశ్నించారు. బండి సంజయ్, కిషన్ రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. ప్రభాకర్ రావు, శ్రవణ్ రావును తీసుకు వస్తే నలభై ఎనిమిది గంటల్లో కేసీఆర్ , కేటీఆర్, హరీష్ రావులను అరెస్టు చేస్తామన్నారు. కాళేశ్వరంపై నిపుణుల కమిటీ విచారణ జరుపుతోందని వారి విచారణ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఉపఎన్నికలు వస్తాయని కేసీఆర్, కేటీఆర్ అంటున్న విషయాన్ని మీడియా ప్రతినిధులు ప్రస్తావించారు. అయితే ఎలా వస్తాయని రేవంత్ ప్రశ్నించారు. పదేళ్ల పాటు ఎంతో మంది ఎమ్మెల్యేలను ఫిరాయించినా రాని ఉపఎన్నికలు ఇప్పుడు ఎందుకు వస్తాయని ప్రశ్నించారు.
తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ లేనే లేదని స్పష్టం చేశారు. ఎన్నికల్లో పోటీ చేయని పార్టీ రాజకీయాల కోసం మాట్లాడుతోందని.. కాంగ్రెస్, బీజేపీ మధ్యనే తెలంగాణలో పోటీ జరుగుతోందన్నారు. బీజేపీ కోసం బీఆర్ఎస్ పని చేస్తోందన్నారు. ప్రధానమంత్రితో జరిగిన భేటీలో రాష్ట్రానికి రావాల్సిన, కావాల్సిన అంశాలపై నివేదికలు ఇచ్చామన్నారు. ఎస్ఎల్బీసీ పనులు కమిషన్లు రావన్న కారణంగా పదేళ్ల పాటు నిలిపివేశారని రేవంత్ మండిపడ్డారు. ఈ కారణంగానే అ ప్రమాదం జరిగిందన్నారు. కార్మికులను కాపాడేందుకు తీసుకుంటున్న చర్యలను కూడా ప్రధాని మోదీకి వివరించానని రేవంత్ రెడ్డి తెలిపారు.
Also Read: ప్రధానమంత్రి మోదీకి తెలంగాణ సీఎం రేవంత్ చేసిన వినతులు ఇవే !





















