Padi kaushik Reddy: కాంగ్రెస్ ఎంపీలు రాధాకృష్ణన్కు ఓటేశారు - ఎంపీలే చెప్పారు - పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Congress MPs: ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంపీలు బీజేపీకి ఓటేశారని పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు. రేవంతే వారితో అలా వేయించారని తనకు చెప్పారన్నారు.

Congress MPs voted for BJP: ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల ఓట్లను బీజేపీకి 'అమ్మేశారని' భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు. మంగళవారం పార్టీ ఆఫీసులో ప్రెస్మీట్ పెట్టి ఈ ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ నిలబెట్టిన అభ్యర్థికి 315 ఓట్లు రావాల్సి ఉందని కానీ 300 ఓట్లే వచ్చాయన్నారు. రేవంత్ రెడ్డికి అమ్ముకోవడం అలవాటు అన్నారు. గ్రూప్-1 పోస్టులను అమ్ముకున్నారు. మిర్యాలగూడ ఎమ్మెల్యే గన్ మెన్ యూరియాను అమ్ముకున్నారు. ఇప్పుడు ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో కూడా ఇలాంటి అక్రమాలు జరిగాయన్నారు.
ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి ఎంపీలకు దిశానిర్దేశం చేసినప్పటికీ, ఓట్లు బీజేపీ అభ్యర్థికి పడ్డాయని కౌశిక్ రెడ్డి పేర్కొన్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ ఎన్డీఏతో రహస్య ఒప్పందం చేసుకునన్నారని తెలంగాణ ప్రజల ఓట్లు ఇలా అమ్ముకోవడం దారుణమన్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికలు అయ్యాక మేము బీజేపీ అభ్యర్థికి ఓట్లు వేశామని కాంగ్రెస్ ఎంపీలు నిర్మలా సీతారామన్ ను కలిశారని కౌశిక్ రెడ్డి ఫోటోలు బయట పెట్టారు. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కలిశారని.. తెలంగాణ కాంగ్రెస్ 8మంది ఎంపీలు లోక్ సభ స్పీకర్ ను కలిశారన్నారు. క్రాస్ అయిన 15 ఓట్లలో 8మంది తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల ఓట్లు ఉన్నాయని కౌశిక్ రెడ్డి స్పష్టం చేశారు.
తెలంగాణకు రేవంత్ రెడ్డి ద్రోహం చేశారన్నారు. రేవంత్ రెడ్డి చంద్రబాబుతో లింక్ పెట్టుకుని తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల ఓట్లు అమ్ముకున్నారని మండిపడ్డారు. తనకు ముగ్గురు తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కలిసి బీజేపీ ఉపరాష్ట్రపతి అభ్యర్థికి ఓటు వేశామని చెప్పారని కౌశిక్ రెడ్డి తెలిపారు. రాహుల్ గాంధీ ఓట్ చోరీ గురించి మాట్లాడుతున్నారు..తెలంగాణలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఓట్ చోరీ
చేస్తున్నారని ఆరోపించారు. సుప్రీంకోర్టు మాజీ జడ్జి సుదర్శన్ రెడ్డిని రేవంత్ రెడ్డి మోసం చేశారన్నారు. రేవంత్ రెడ్డి గురుదక్షిణ చంద్రబాబు నాయుడు,మోడీకి చెల్లిస్తున్నారని విమర్శించారు.
జస్టిస్ సుదర్శన్ రెడ్డికి రేవంత్ రెడ్డి వెన్నుపోటు పొడిచారు. రాహుల్ గాంధీ చెప్తే రేవంత్ రెడ్డి అభ్యర్థిని పెట్టారు మోడీ చెప్తే ఉపరాష్ట్రపతి అభ్యర్థికి ఓట్లు వేశారని.. రేవంత్ రెడ్డికి అమ్ముకోవడం అలవాటన్నారు. సిబిఐ,ఐటీ,ఈడీ బీజేపీ జేబు సంస్థలు అని రాహుల్ గాంధీ అంటారని.. కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ అని రేవంత్ రెడ్డి అంటారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో మంత్రులు ఎవరికి తెలియకుండా రేవంత్ రెడ్డి సిబిఐ విచారణకు ఇచ్చారని ఆరోపించారు. కాంగ్రెస్ వాళ్ళను చూస్తే జాలివేస్తోంది ..రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి నా లేక బీజేపీకి ముఖ్యమంత్రో తెలియడం లేదన్నారు.
నరేంద్రమోదీ ఏది చెప్తే రేవంత్ రెడ్డి అది చేస్తున్నారు..మోడీకి,రేవంత్ రెడ్డికి ఒప్పందం లేకపోతే గ్రూప్1 పోస్టుల అమ్మకాలపై సిబిఐ విచారణ జరిపించాలన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు హడావిడి చేసిన కేంద్రమంత్రి బండి సంజయ్ ఇప్పుడు సైలెంట్ అయ్యారని.. కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి నడిసముద్రంలో ముంచుతున్నారని తేల్చారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కార్యకర్తలను పట్టించుకుంటున్నారా...? 15 ఓట్లు ఎవరు దొంగతనం చేశారో కాంగ్రెస్ తేల్చుకోవాలని సూచించారు.





















