Palvai Harish Babu: నెలాఖరులోగా జీవో 49ను రద్దు చేయకపోతే నిరవధిక నిరాహార దీక్ష: సిర్పూర్ ఎమ్మెల్యే
Demand to cancel GO 49 | జీవో 49 ప్రభుత్వం తాత్కాలికంగా నిలుపుదల చేయడం కంటి తుడుపుచర్యేనని, నెలాఖరులోగా పూర్తిగా రద్దు చేయాలని సిర్పూర్ ఎమ్మెల్యే హరీష్ బాబు డిమాండ్ చేశారు.

BJP MLA P Harish Babu | సిర్పూర్: కుమ్రం భీమ్ టైగర్ కన్జర్వేషన్ జీవో నం.49 తాత్కాలిక నిలుపుదల కేవలం కంటి తుడుపు చర్యగా పేర్కొన్నారు బీజేపీ ఎమ్మెల్యే హరీష్ బాబు. జీవో 49ని పూర్తిగా రద్దు చేసే వరకు పోరాటాలు విరమించేది లేదని సిర్పూర్ ఎమ్మెల్యే డా. పాల్వాయి హరీష్ బాబు అన్నారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో మంగళవారం మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు.
జీవో 49 పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్
ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు మాట్లాడుతూ.. జీవో నం.49 ను తాత్కాలికంగా నిలిపివేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిన్న సాయంత్రం మెమో ఇచ్చిందన్నారు. ఆదివాసి సంఘాలు, బీజేపీ, వివిధ ప్రజా సంఘాలు సోమవారం (జులై 21న) నిర్వహించిన ఏజెన్సీ ప్రాంతాల బంద్ సంపూర్ణం కావడంతో ప్రభుత్వం దిగివచ్చి ఈ మెమో ఇచ్చిందని తెలిపారు. 49 జీవోను తాత్కాలికంగా నిలుపుదల చేయడం కేవలం కంటి తుడుపు చర్య అని, పూర్తిగా జీవో రద్దు చేసే వరకు పోరాటాలు విరమించేది లేదని స్పష్టం చేశారు.
కేంద్రంపై కాంగ్రెస్ నేతల సాకులు
కేంద్ర ప్రభుత్వం ఆదేశిస్తేనే జీవో తెచ్చామని తెలంగాణ కాంగ్రెస్ నేతలు బీరాలు పలికారని, ఇప్పుడు తాత్కాలిక నిలుపుదల ఆర్డర్స్ ఇవ్వడానికి కేంద్రాన్ని సంప్రదించారా అని పాల్వాయి హరీష్ బాబు ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వానికి ప్రమేయం లేని అంశంలో భారతీయ జనతా పార్టీని టార్గెట్ చేసుకొని విమర్శలు గుప్పించిన కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు ఇచ్చిన ఉత్తర్వులతో వారి నిజ స్వరూపాన్ని బయట పెట్టుకున్నారని అన్నారు. జీవో రద్దు కోసం తెలంగాణ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచేందుకు కలెక్టరేట్ ముట్టడికి పిలుపునిస్తామని, అలాగే నెలాఖరు వరకు జీవోను రద్దు చేయకపోతే.. ఆగస్టు మొదటి వారంలో నిరవధిక నిరాహార దీక్ష చేపడతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో భాజపా జిల్లా అధ్యక్షులు ధోని శ్రీశైలం, జిల్లా కోశాధికారి అరుణ్ లోయ, మాజీ కౌన్సిలర్లు ఈర్ల విశ్వేశ్వర్ రావు, సింధం శ్రీనివాస్, బాల్క శ్యామ్, మాజీ ఎంపిపి మనోహర్ గౌడ్, ఎస్సీ మోర్చా పట్టణ అధ్యక్షులు చిప్పకుర్తి శ్రీనివాస్, పట్టణ ప్రధాన కార్యదర్శి కొండ తిరుపతి, సాంబయ్య, గణపతి లింగమూర్తి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.





















