రక్షణశాఖ ఆధ్వర్యంలో ఉన్న 360 ఎకరాల ఎయిర్ స్ట్రిప్కు అనుబంధంగా రాష్ట్ర ప్రభుత్వం మరో 450 ఎకరాలు అప్పగిస్తే, విమానాశ్రయాన్ని పూర్తిగా తమ ఆధ్వర్యంలో నిర్మించి, పౌరసేవలకు అనుకూలంగా ఎన్క్లేవ్ను నిర్మించుకోవడానికి అనుమతిస్తామని రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు.
Adilabad Airport: ఆదిలాబాద్ జిల్లా వాసులకు గుడ్ న్యూస్! ఎయిర్ పోర్టు నిర్మాణానికి త్వరలోనే శంకుస్థాపన!
Adilabad Airport: ఆదిలాబాద్ జిల్లావాసులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. రక్షణ శాఖ ఆధ్వర్యంలో ఎయిర్పోర్ట్ నిర్మించడానికి కేంద్రం ఓకే చెప్పింది. అయితే దీనికి కొన్ని కండిషన్స్ పెట్టింది.

- ఆదిలాబాద్ విమానాశ్రయ నిర్మాణానికి రక్షణ శాఖ అంగీకారం తెలిపింది.
- రాష్ట్ర ప్రభుత్వం 450 ఎకరాలు అప్పగిస్తే విమానాశ్రయం నిర్మాణం చేపడతామని హామీ.
- 17న పౌర విమానయాన, రక్షణ శాఖలు, రాష్ట్రం కలిసి ఓఎల్ సర్వే చేస్తాయి.
- త్వరలో శంకుస్థాపన, రెండున్నరేళ్లలో నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యం.
Adilabad Airport: ఆదిలాబాద్ జిల్లాలో ఎయిర్ పోర్టు నిర్మాణానికి రక్షణశాఖ ముందుకొచ్చింది. ప్రస్తుతం అక్కడ ఆ శాఖ ఆధ్వర్యంలోని 360 ఎకరాల ఎయిర్ స్ట్రిప్కు అనుబంధంగా రాష్ట్ర ప్రభుత్వం మరో 450 ఎకరాలు అప్పగించాలని సూచించింది. అలా చేస్తే పూర్తిగా తమ శాఖ ఆధ్వర్యంలోనే ఎయిర్ పోర్టు నిర్మించి పౌరసేవలకు అనుకూలంగా ఒక ఎన్ క్లేవ్ నిర్మించుకోవడానికి పౌరవిమానయానశాఖకు అనుమతిస్తామని రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ స్పష్టంచేశారు.
ఆదిలాబాద్లో ఎయిర్ పోర్టు నిర్మాణ అంశంపై కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి కిషన్ రెడ్డి, పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలు గోడం నగేశ్, పాయలశంకర్, ఆదిలాబాద్ కలెక్టర్ రాజార్షి షా బుధవారం రాజ్ నాథ్ సింగ్తో చర్చించారు. అనంతరం కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నివాసంలో జరిగిన విలేకర్ల సమావేశంలో మంత్రి రామ్మోహన్నాయుడు ఈ విషయాలు వెల్లడించారు. దేశంలో ప్రస్తుతం ఉన్న 165 విమానాశ్రయాలను 2047 నాటికి 350కి పెంచాలన్నది ప్రధానమంత్రి మోదీ లక్ష్యం అనీ పేర్కొన్నారు.
ఎయిపోర్ట్ ఏర్పాటుకు ఆదిలాబాద్కు అత్యంత సానుకూల అవకాశాలున్నాయనీ, వరంగల్, కొత్తగూడెంతోపాటు ఆదిలాబాద్ డిఫెన్స్కి సంబంధించిన 360ఎకరాల్లో ఎయిర్ పోర్టు నిర్మించాలని కిషన్ రెడ్డి తనను కోరారని రామ్ వివరించారు. దానికి రక్షణశాఖ ఆమోదం కూడా కావాల్సి ఉండటంతో కిషన్ రెడ్డి గతంలోనే రక్షణమంత్రిని కలిసి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారని గుర్తు చేశారు. దీంతో ఎయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియాతో కలిసి సంయుక్తంగా నిర్మించడానికి ఎలాంటి అభ్యంతరం లేదని గతంలోనే రక్షణ శాఖ సూత్రపాయ అంగీకార లేఖ ఇచ్చిందన్నారు. అక్కడ ఎయిర్ బస్ తరహా పెద్ద విమానాలు దిగే రన్వే నిర్మించాలంటే మరో 450 ఎకరాలు కావాలి, ఆ మేరకు రాష్ట్రప్రభుత్వానికి విజ్ఞప్తి చేశామని వివరించారు.
ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ విషయంలో రక్షణశాఖ మద్దతు కోరగా రాజ్నాథ్ సింగ్ సంపూర్ణ సహకారం అందిస్తామన్నారు. ఈనెల 17న పౌరవిమానయాన, రక్షణశాఖ, రాష్ట్ర ప్రభుత్వం కలిసి క్షేత్రస్థాయికి వెళ్లి ఓఎల్ (అబ్ స్టకిల్ లిమిటేషన్) సర్వేచేసి మాస్టర్ ప్లాన్ తయారుచేస్తాయి. రక్షణశాఖ అంగీకరించిన తర్వాత శంకుస్థాపనకు వెళ్తారు. ఈలోపు రాష్ట్ర ప్రభుత్వం మరో 450 ఎకరాలు అప్పగించాల్సి ఉంది. వీలైనంత త్వరగా శంకుస్థాపన చేసి రెండు, రెండున్నరేళ్లలో నిర్మాణం పూర్తిచేస్తామని రామ్మోహన్ నాయుడు తెలిపారు. ప్రస్తుతం ఆదిలాబాద్కు 170 కి.మీ. దూరంలో నాగ్ పూర్, 150 కి.మీ. దూరంలో అకోలా ఎయిర్ పోర్టులున్నాయి. హైదరాబాద్ కు రావాలంటే ఏడుగంటలు పడుతుంది. అందువల్ల ఈ ఎయిర్ పోర్టు వేగంగా అభివృద్ధిచెందే అవకాశముందని రామ్మోహన్ నాయుడు తెలిపారు.
పెద్దపల్లి జిల్లాలో అంతర్గావ్ వద్ద రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన స్థలం ఎయిర్ పోర్టు నిర్మాణం కోసం సానుకూలంగా ఉన్నట్లు తాము నిర్వహించిన ప్రీఫీజిబిలిటీ స్టడీలో తేలిందని రామ్మోహన్ నాయుడు తెలిపారు. నివేదికను ఫిబ్రవరి 13న రాష్ట్ర ప్రభుత్వానికి పంపామని, దానిపై వారు తదుపరి నిర్ణయాన్ని చెప్పాల్సి ఉందన్నారు. కొత్తగూడెంలో రాష్ట్ర ప్రభుత్వం చూపిన స్థలం అనుకూలంగా లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ స్థలం చూపితే స్టడీ చేయడానికి సిద్ధమన్నారు. పెద్దవిమానాశ్రయం కోసం సగటున 1200 ఎకరాలు అవసరమవుతుందని.. ఆదిలాబాద్ ఎయిర్ పోర్టు, ఏటీసీ, డిఫెన్స్ శిక్షణ సౌకర్యాల నిర్మాణం రక్షణశాఖే చేపడుతుందని, దానివల్ల ఆ ప్రాంతంలో ఉద్యోగాల కల్పన, దేశంలోని వివిధ ప్రాంతాలకు అనుసంధానత ఏర్పడుతుందన్నారు.
ఈ ఏడాది చివరికల్లా దేశవ్యాప్తంగా అన్ని ఎయిర్ పోర్టుల్లో ఉడాన్ కేఫేలు ప్రారంభిస్తామని రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. అయితే ఆదిలాబాద్లో ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి మార్గం సుగమం కావడంతో జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఆదిలాబాద్ మరింత అభివృద్ధి చెందుతుందని ఆశ భావం వ్యక్తం చేస్తున్నారు.
Frequently Asked Questions
ఆదిలాబాద్ విమానాశ్రయ నిర్మాణానికి రక్షణశాఖ ఎందుకు ముందుకొచ్చింది?
ఆదిలాబాద్ విమానాశ్రయానికి ఎంత భూమి అవసరం?
ప్రస్తుతం రక్షణశాఖ ఆధీనంలో 360 ఎకరాలు ఉంది. ఎయిర్ బస్ తరహా పెద్ద విమానాలు దిగే రన్వే నిర్మాణానికి మరో 450 ఎకరాలు అవసరం.
ఆదిలాబాద్ విమానాశ్రయం నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నుండి ఏమేం ఆశిస్తున్నారు?
రాష్ట్ర ప్రభుత్వం మరో 450 ఎకరాలు అప్పగించాలని, ఆ తర్వాత ఓఎల్ (అబ్స్టకిల్ లిమిటేషన్) సర్వే చేసి మాస్టర్ ప్లాన్ తయారుచేయడంలో సహకరించాలని ఆశిస్తున్నారు.
విమానాశ్రయం నిర్మాణం ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఎప్పుడు పూర్తవుతుంది?
రక్షణశాఖ ఆమోదం తెలిపిన తర్వాత శంకుస్థాపన జరుగుతుంది. వీలైనంత త్వరగా ప్రారంభించి, రెండు, రెండున్నరేళ్లలో నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















