Who is Dusharla Satyanarayana: అతడు అడవిని సృష్టించాడు.. ప్రకృతి కోసం ప్రాణాలను సైతం ఎదిరించిన ధీశాలి.. నల్లగొండ వాటర్మ్యాన్ కథ మీకు తెలుసా..?
నల్గొండ నీటి కష్టాలపై జల సాధన సమితి ద్వారా పోరాడి, తన 70 ఎకరాల భూమిని 5 కోట్ల మొక్కలతో అడవిగా మార్చిన వ్యక్తి దుశర్ల సత్యనారాయణ. ప్రకృతి కోసం ఆయన త్యాగాలు ఎంతో స్ఫూర్తిదాయకం.

Satyanarayana JSS Founder | తెలంగాణకు చెందిన ప్రముఖ వ్యక్తి, ప్రకృతి ప్రేమికుడు దుశర్ల సత్యనారాయణ పేరు గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తోంది. పర్యావరణాన్ని పరిరక్షించేందుకు, ప్రకృతి మీద ప్రేమతో ఉద్యోగానికి రాజీనామా చేసి, ఓ అడవినే సృష్టించిన గొప్ప మనసున్న వ్యక్తిగా పేరుగాంచారు. కానీ 72 ఏళ్ల ప్రకృతి ప్రేమికుడు, నల్గొండ వాటర్ మ్యాన్గా పేరుగాంచిన దుశర్ల సత్యనారాయణపై ఇటీవల దాడి జరిగింది. తన అడవిలో చెట్లను నరుకుతున్న వారిని అడ్డుకున్నందుకు, పొరుగు గ్రామాలకు చెందిన కొందరు వ్యక్తులు ఆయనపై విచక్షణారహితంగా దాడి చేశారు. గాయపడిన ఆయన హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఆయన సేవల్ని గుర్తించిన వారు, తెలిసిన వారు దుశర్ల సత్యనారాయణపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నారు. ఆయన గొప్పతనం తెలిస్తే అలా దాడిచేసే వారు కాదని అంటున్నారు.
బ్యాంకు జాబ్ మానేసి సమాజసేవకు అంకితం
1954 మార్చి 12న సూర్యాపేట జిల్లా మోతే మండలం రాఘవపూర్ గ్రామంలో జన్మించిన దుశర్ల సత్యనారాయణ కేవలం ఒక వ్యక్తిగా కాకుండా ఒక వ్యవస్థగా ఎదిగారు. ఆచార్య జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుండి అగ్రికల్చర్ బి.ఎస్.సి పూర్తి చేశారు. మొదట్లో ఆంధ్రా బ్యాంక్, తరువాత యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉన్నత ఉద్యోగాలు నిర్వహించారు. అయితే, తన కళ్ల ముందే రైతులు పడుతున్న కష్టాలు, ముఖ్యంగా నల్గొండ జిల్లాను పీడిస్తున్న ఫ్లోరోసిస్, నీటి సమస్యలు ఆయనను నిలకడగా ఉండనివ్వలేదు. 1980లోనే తన ఉద్యోగాన్ని వదిలివేసి, సమాజ సేవకు తన జీవితాన్ని అంకితం చేశారు.

జల సాధన సమితి - ఫ్లోరోసిస్ సమస్యపై పోరాటం
నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ సమస్య సృష్టిస్తున్న బీభత్సాన్ని చూసి చలించిన దుశర్ల సత్యనారాయణ జల సాధన సమితి (JSS) ని స్థాపించారు. కలుషిత నీటి వల్ల వేలాది మంది ప్రజలు వికలాంగులుగా మారుతుంటే, ప్రభుత్వాల నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరిస్తున్నాయని ఆయన ఎండగట్టారు. 1992లో నల్గొండ నుంచి శ్రీశైలం వరకు, యాదగిరిగుట్ట వరకు పాదయాత్రలు చేపట్టి ప్రజలలో చైతన్యం తీసుకొచ్చారు. 1996లో నల్గొండ లోక్సభ స్థానానికి ఏకంగా 682 మందితో నామినేషన్లు వేయించి, ఎన్నికల సంఘం దిగివచ్చేలా చేశారు. నల్గొండ లోక్సభ స్థానానికి ఎన్నికను నెలరోజులకు వాయిదా వేసింది.
ప్రధాని వాజ్పేయిని కదిలించిన దుశ్చర్ల
ఫ్లోరైడ్ బాధితులతో కలిసి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద 17సార్లు నిరసన కార్యక్రమాలు చేపట్టి సమస్యను జాతీయ స్థాయిలో తెలిసేలా చేశారు. ఆయన పోరాటంలో అత్యంత కీలక ఘట్టం, 2003లో అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజపేయి ఛాంబర్లో ఫ్లోరైడ్ బాధితులు అంశుల స్వామి, కొత్తపల్లి నర్సింహలను టేబుల్పై పడుకోబెట్టి సమస్య తీవ్రతను వివరించారు. ఆ సంఘటనతో కదిలిపోయిన ప్రధాని వెంటనే పైపులైన్ పనులకు ఆదేశాలిచ్చారు. ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు విషయంలో దుశర్ల చేసిన పోరాటం మరువలేనిది.
70 ఎకరాల అద్భుత అడవి సృష్టికర్త
దుశర్ల సత్యనారాయణ జీవితంలో మరో అద్భుత ఘట్టం ఆయన 70 ఎకరాల కృత్రిమ అడవిని సృష్టించడం. తనకున్న పూర్వీకుల భూమి 70 ఎకరాలను అడవిగా మార్చేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు. కోట్ల రూపాయల విలువచేసే భూములను రియల్ ఎస్టేట్ పరం చేయకుండా, అటు వారసులకు కూడా ఇవ్వకుండా దానిని ప్రకృతికి కానుకగా ఇచ్చారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుండి విత్తనాలను సేకరించి తీసుకొచ్చి ఏకంగా 5 కోట్లకు పైగా మొక్కలను నాటిన ఆయన, ఆ భూమిని ఒక అడవిగా, జీవవైవిధ్య కేంద్రంగా మార్చారు. ఈ అడవిలో నెమళ్లు, కోతులు, అడవి పందులు, ముళ్లపందులు సహా 32 రకాలకు పైగా పక్షులు స్వేచ్ఛగా విహరిస్తున్నాయి. కోతుల కోసం ప్రత్యేకంగా సజ్జలు, దుంపలు పండిస్తున్నారు, పక్షుల కోసం ఏడు తామర కుంటలను తవ్వించి వర్షపు నీటిని నిల్వ చేస్తున్నారు. ఈ అడవిలోని ఒక్క పండును కూడా ఆయన వ్యాపారానికి వాడుకోకపోవడం విశేషం. అది కేవలం ప్రకృతికే సొంతం అని ఆయన గట్టిగా నమ్ముతారు.
దుశ్చర్లకు గుర్తింపు, పురస్కారాలు
పర్యావరణ ప్రేమికుడు దుశర్ల సత్యనారాయణ ప్రకృతి కోసం చేసిన నిస్వార్థ సేవకు గాను అనేక పురస్కారాలు ఆయనను వరించాయి. 2022లో జాతీయ నదుల పునరుజ్జీవ సదస్సులో నీటి సంరక్షకుడు అవార్డు అందుకున్నారు. 2024లో గవర్నర్ ప్రతిభా పురస్కారానికి ఎంపికయ్యారు. తెలంగాణ గవర్నర్ అవార్డ్స్ ఫర్ ఎక్స్లెన్స్తో పాటు రూ.2లక్షల నగదును గవర్నర్ జిష్ణుదేవ్వర్మ చేతుల మీదుగా అందుకున్నారు. 2025లో సాక్షి ఎక్సలెన్స్ ఇన్ ఎన్విరాన్మెంట్ అవార్డుకు ఎంపికయ్యారు.
అడవిని రక్షించే ప్రయత్నం చేసిన ఆయనపై దుండగులు దాడి చేయడం దురదృష్టకరం అని చెప్పాలి. పర్యావరణం పట్ల దుశర్ల సత్యనారాయణ చూపిస్తున్న నిబద్ధత రాబోయే తరాలకు ఒక దిక్సూచి వంటిది. వందల కోట్ల ఆఫర్లు వచ్చినా లొంగకుండా ప్రకృతి కోసం తన 70 ఎకరాలను అంకితం చేసిన యోధుడిపై దాడిని అంతా వ్యతిరేకిస్తున్నారు.
ట్రెండింగ్ వార్తలు





















