![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Minister Vemula Prashanth Reddy : బొగ్గుగని కాంట్రాక్ట్ ఆశచూపి రాజీనామా, రాజగోపాల్ రెడ్డి స్వార్థంతోనే ఉపఎన్నిక - మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
Minister Vemula Prashanth Reddy : మునుగోడు ఉపఎన్నిక రాజగోపాల్ రెడ్డి స్వార్థం కోసమే వచ్చిందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు.
![Minister Vemula Prashanth Reddy : బొగ్గుగని కాంట్రాక్ట్ ఆశచూపి రాజీనామా, రాజగోపాల్ రెడ్డి స్వార్థంతోనే ఉపఎన్నిక - మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి Munugode by poll minister Vemula prashanth reddy comments on BJP Komati reddy rajagopal reddy contract in Jharkhand DNN Minister Vemula Prashanth Reddy : బొగ్గుగని కాంట్రాక్ట్ ఆశచూపి రాజీనామా, రాజగోపాల్ రెడ్డి స్వార్థంతోనే ఉపఎన్నిక - మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/08/9da19ebbbb0371671be331746d8801971665227601359235_original.jpeg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Minister Vemula Prashanth Reddy : మునుగోడులో పార్టీల ప్రచారాలు జోరందుకున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో ప్రధాన పార్టీల నేతలు రంగంలోకి దిగారు. పోటాపోటీగా విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతున్నారు. శనివారం చౌటుప్పల్ మండలం డి. నాగారం, దామెరా,చింతల గూడెం గ్రామాల్లో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పర్యటించారు. బాల్కొండ నియోజకవర్గ ప్రతినిధులతో మంత్రి సమావేశమై ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. మునుగోడు ఉపఎన్నిక ఎవరి స్వార్థం కోసం వచ్చిందో ప్రజలు గమనించాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కోరారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం రాజీనామా చేసి మునుగోడు ఉపఎన్నిక వచ్చేలా చేశారని మండి పడ్డారు. దీని వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని ఆరోపించారు. దేశ వ్యాప్తంగా కేసీఆర్ కు ఆదరణ పెరుగుతుందని, తెలంగాణలో కేసీఆర్ ఇస్తోన్న సంక్షేమ పథకాలు అన్ని రాష్ట్రాల్లో కావాలనే డిమాండ్ వస్తుందన్నారు.
అమిత్ షా పన్నాగంలో భాగమే ఉపఎన్నిక
సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వస్తే తమ పీఠాలు కదులుతాయని, అమిత్ షా పన్నాగంలో భాగమే మునుగోడు ఉపఎన్నిక తెచ్చారని మంత్రి ప్రశాంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ ను తెలంగాణలోనే కట్టడి చేయాలని, తెలంగాణ రాజకీయాల్లో బిజీ చేస్తే ఇటు వైపు రారని కుట్ర పూరితంగా మునుగోడు ఉపఎన్నికలు తెచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మునుగోడు లో బీజేపీ లేదు నేను రాజీనామా చేయను అని రాజగోపాల్ అంటే ఝార్ఖండ్ లో రూ.22 వేల కోట్ల బొగ్గుగని కాంట్రాక్ట్ ఆశచూపి రాజ గోపాల్ రెడ్డితో రాజీనామా చేయించారని అన్నారు. మునుగోడు ప్రజల అభిప్రాయం చూస్తుంటే రాజగోపాల్ రెడ్డికి డిపాజిట్ కూడా వచ్చేట్టు లేదని ఎద్దేవా చేశారు.
తెలంగాణ మోడల్ పై చర్చ
తెలంగాణలో కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలు దేశ వ్యాప్తంగా కావాలని ప్రజల్లో చర్చ జరుగుతోందని, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రైతు నాయకులు తెలంగాణ మోడల్ అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారని మంత్రి ప్రశాంత్ రెడ్డి అన్నారు. దేశానికే తెలంగాణను రోల్ మోడల్ గా నిలిపిన కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తున్నందుకు తమకు గర్వంగా అనిపిస్తుందన్నారు. కేసీఆర్ ను కట్టడి చేయడం మోదీ, అమిత్ షా తరం కాదని, దేశ వ్యాప్తంగా బీజేపీ అవినీతిని కేసీఆర్ ఎండగడతాడని తేల్చి చెప్పారు. ఇక్కడ ఒక్కో కార్యకర్త ఒక్కో కేసీఆర్ అని అన్నారు. వారి మాటల్లోని అవేశం వింటుంటేనే తెలుస్తోందన్నారు.
5జీ స్పెక్ట్రంలో కుంభకోణం
తెల్లారితే సుద్దపూసలా, సత్యహరిశ్చంద్రుడిలా మాట్లాడుతున్న మోదీ, అమిత్ షాలు 5జీ స్ప్రెక్ట్రం వేలంలో 10 లక్షల కోట్ల కుంభకోణం చేశారని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. 2007లో 2జీ వేలంలో రూ.1.70 లక్షల కోట్లు వస్తే అవినీతి జరిగిందని అప్పుడు మాట్లాడిన ఇప్పటి ప్రధాని మోదీ 15 ఏళ్ల తర్వాత అడ్వాన్స్డ్ టెక్నాలజీ 5జీ స్పెక్ట్రం వేలంలో 1.40 లక్షల కోట్లు మాత్రమే వస్తే ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. సుమారు రూ.10 లక్షల కోట్ల అవినీతి జరిగిందని అన్నారు. అక్రమంగా సంపాదించిన లక్షల కోట్ల సొమ్ముతో ఎమ్మెల్యేలను కొంటూ ప్రజలచే ఎన్నుకున్న ప్రభుత్వాలను కూలదోస్తున్నారని మండిపడ్డారు. ఈ స్వాతంత్ర్య భారత దేశంలోనే అత్యంత అవినీతి పరులు మోదీ, అమిత్ షా అని మంత్రి వేముల మండిపడ్డారు. మునుగోడు ప్రజలు దీన్ని అర్థం చేసుకోవాలని కోరారు. కేసీఆర్ వచ్చిన తర్వాత మార్పును దృష్టిలో పెట్టుకొని ఓటుతో బీజేపీ, కాంగ్రెస్ లకు బుద్ది చెప్పాలని కోరారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)